Tuesday, July 3, 2012

Justice HR Khanna ఎమర్జెన్సీ’కి బెదరని ధీరుడు

నివారక నిర్బంధం’, విచారణ లేకుండా నిర్బంధించడం అనే విషయాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తిని కలచివేస్తాయి. జీవితంలో అత్యం త విలువైనది స్వేచ్ఛ. ఇలాంటి చట్టాలు, చర్యలు మౌలికమైన స్వేచ్ఛను భగ్నం చేస్తాయి. అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్-శివకాంత్ శుక్లా, 1976 సుప్రీంకోర్టు (రిపోర్టర్ 172) కేసులో హన్స్‌రాజ్ ఖన్నా భిన్నాభివూపాయం న్యాయ చరిత్రలో చారిత్రాత్మకమైనది. ఎవరీ హన్స్‌రాజ్ ఖన్నా? అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన న్యాయమూర్తి. ఆ పదవిని త్యజించిన మహోన్నతుడు. ఎమ్జన్సీ రోజుల్లో ప్రాథమిక హక్కుల కేసుల్లో భిన్నాభివూపాయాన్ని వ్యక్తపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని పోగొట్టుకున్న వ్యక్తి. పౌరహక్కుల గురించి, ప్రాథమిక హక్కుల అమలు గురించి, న్యాయ వ్యవస్థ స్వతంవూతత గురించి ఒంటరిగా పోరాడిన న్యాయమూర్తి. ‘హెబియస్ కార్పస్’ కేసు లో తనతోటి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విభేదించి ధైర్యంగా ఎమ్జన్సీ రోజుల్లో పౌరహక్కుల గురించి చెప్పిన వారు. వ్యక్తులను సుదీర్ఘకాలం నిర్బంధించే అధికారం రాజ్యానికి లేదని,తోటి న్యాయమూర్తులతో విభేదించి తీర్పు రాశా రు. ఎ.డి.ఎమ్. జబల్‌పూర్ కేసు ఎమ్జన్సీ రోజుల్లో ఓ సంచలనం. ఇప్పటికీ అది మర్చిపోలేని తీర్పు. ఈ తీర్పు తర్వాత న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో ‘భారత దేశంలో ప్రజాస్వామ్యం నెలకొన్న తర్వాత ఎవరో ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్‌రాజ్ ఖన్నా కీర్తి స్తంభం నిర్మిస్తారు’ అని రాసింది. ఆయన కీర్తిస్తంభం ఎవరూ నిర్మించలేదు. కానీ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టులో న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 1912జూలై 3న జస్టిస్ ఖన్నా జన్మించారు. 2008 ఫిబ్రవరి25న చనిపోయా రు. ఈ ఏడాది ఆయన శత జయంతి సంవత్సరం . మే నెలలో సాదత్ హస న్ మంటో శత జయంతి జరిగింది. ఈ నెలలో హెచ్.ఆర్. ఖన్నా శత జయంతి. ఈ ఇద్దరికీ సాన్నిహిత్యం లేదు. కానీ ఒకరు ‘నయా కానూన్’ అన్న కథని... (నయా కానూన్ అంటే కొత్త రాజ్యాంగం) రాశారు. మరొకరు రాజ్యాంగాన్ని వివిధ తీర్పుల్లో వ్యాఖ్యానించిన వ్యక్తి. ఎ.డి.ఎమ్ జబల్‌పూర్ కేసులోనే కాదు కేశవానంద భారతి (1973) కేసులో కూడా విలక్షణమైన అభివూపాయాన్ని వెలిబుచ్చిన వ్యక్తి హెచ్.ఆర్.ఖన్నా. న్యాయమూర్తులు ఎస్.ఎమ్. సిక్రీ పధాన న్యాయమూర్తి) జే.ఎం. శెలత్, కె.ఎస్. హెగ్డే, పి. జగన్‌మోహన్‌డ్డి, ఎ.ఎన్. గ్రోవర్, ఎస్. ముఖర్జీయాల ప్రకారం పార్లమెంట్ అధికారం పరిమితమైనది. రాజ్యాంగంలో సహజ సిద్ధమైన పరిమితులున్నాయి. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు ఎ.ఎం.రే, జి.జి. పలేకర్, కె.కె. మూథ్యూ, ఎస్.ఎన్. ద్వివేదీ, ఎం.హెచ్. బేగ్, వైవీ చంద్రచూడ్‌ల ప్రకారం- పార్లమెంట్‌కు అలాంటి పరిమితులు లేవు. న్యాయమూర్తి ఖన్నా ఎటువైపు తీసుకోలేదు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్న ది. కానీ దాన్ని మౌలికమైన నిర్మాణాన్ని మార్చే హక్కు లేదు. ఇదీ ఖన్నా అభివూపాయం. రెండేళ్ల తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక తీర్పు తర్వాత దీని మీద చాలా చర్చ జరిగింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఉంటాయని, ఆస్తి హక్కు ఉండదని ఖన్నా వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యానికి గొప్ప భరోసాను ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి కేసు.మొత్తం 13 మందిలో ఆరుగురు న్యాయమూర్తులు ఒకవైపు, మరో ఆరుగురు న్యాయమూర్తులు మరో వైపు ఉన్న కేసులో నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించిన వ్యక్తి హెచ్.ఆర్. ఖన్నా. హెచ్.ఆర్.ఖన్నా తీర్పుల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు విషిష్టమైనది. ఎందుకంటే అది ఎమ్జన్సీ రోజుల్లో వెలువరించినది. జయవూపకాశ్ నారాయణ్ ఉద్యమం నేపథ్యంలో వేలాదిమందిని అరెస్టు చేశారు. ‘మీసా’ చట్టాన్ని ప్రయోగించి ఎంతోమందిని నిర్బంధించారు. రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కును లేకుండా చేసిన రోజులు. అధికరణ 21ని సస్పెండ్ చేసే అధికారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు ఎ.డి.ఎం. జబల్‌పూర్ కేసు. అప్పుడున్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు- ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ ‘రే’, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా, జస్టిస్ బేగ్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్. పి.ఎన్. భగవతి. ఇద్దరు న్యాయమూర్తుల సీనియారిటీని కాదని జస్టిస్ ‘రే’ను ప్రధా న న్యాయమూర్తిగా నియమించారు. బెంచ్‌ను ఏర్పాటు చేయడం ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. కానీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఇలా కోరడం అసాధారణ విషయం. ఇది ప్రధాన న్యాయమూర్తికి నచ్చనప్పటికీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్‌ని ఏర్పాటు చేశారు. మానవహక్కుల గురించి ఎక్కువగా మాట్లాడే న్యాయమూర్తులు వైవీ చంద్రచూడ్, పి.ఎన్. భగవతి. ప్రధాన న్యాయమూర్తి, ఎం.హెచ్. బేగ్ ఎమ్జన్సీని సమర్థించినప్పటికీ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల వల్ల ప్రాథమిక హక్కులకు అనుకూలంగా తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో రాష్ట్రపతి 27.6.1975న రాజ్యాంగంలోని అధికరణ 359(1) ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకా రం వ్యక్తిగత స్వేచ్ఛను అమలు పరుచమని ఆర్టికల్ 226 ద్వారా కానీ, ఇతర రిట్ ల ద్వారా కానీ కోరడానికి వీల్లేదు. ‘మీసా’ చట్టం ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ నిర్బంధాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు. ఐదుగురు న్యాయమూర్తుల బృందంలో నలుగురు దాన్ని సమర్థించారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకించి తన భిన్నాభివూపాయాన్ని తీర్పు ద్వారా వ్యక్తపరిచిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా. ఆయన మాటల్లో ‘ ఆర్టికల్ 226 ప్రకారం రిట్‌లు జారీచేసే అధికారాన్ని రాజ్యాంగం హైకోర్టులకు సంక్రమింప చేసింది. ఈ అధికారాన్ని సస్పెండ్ చేసే అధికారం రాజ్యాంగం ఏ అధికార యంత్రాంగానికి ఇవ్వలేదు’. ఎమ్జన్సీ కాలంలో ఒక ఒంటరి గొంతుక ఈ తీర్పు చెప్పడం మామూలు విషయం కాదు. ఆ తీర్పు చెప్పినందుకు తగిన మూ ల్యాన్ని ఖన్నా చెల్లించారు. దేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయం తెలిసి తీర్పును వెలువరించిన ధీశాలి. దేశ పౌరుల ప్రాథమిక హక్కులను జెండాలాగా ఎగరవేసిన వారు జస్టిస్ ఖన్నా. రాజ్యాంగం నిబంధనలు, అధికరణలు తెలియడం కాదు. వాటి అమ లు కోసం మనస్సాక్షిగా పనిచేశారు హెచ్.ఆర్.ఖన్నా. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజాహితం కోసం పనిచేయాలనుకునే వ్యక్తులకు, న్యాయమూర్తులకు ఆదర్శవూపాయుడు జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. ఎ.డి. ఎం. జబల్‌పూర్ కేసులోని మరో ఇద్దరు న్యాయమూర్తులు ఖన్నా లాగా ఆలోచిస్తే అత్యవసర పరిస్థితి త్వరగా అంతమయ్యేది. తనకన్నా జూనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో జస్టిస్ ఖన్నా 29-1-1977న తన పదవికి రాజీనామా చేశారు. ఆ తీర్పు చెప్పినందుకు ఖన్నా గర్వపడ్డారు. దేశం గర్వపడింది. ఖన్నా తీర్పు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయబడింది. అధికర ణ 20,21లు ఎమ్జన్సీలో సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఈ సవరణ చెబుతుంది.మంటో ‘నయా ఖానూన్’ కథలో రాజ్యాంగం వస్తుంది. జీవితంలో మార్పు ఉండదు.రాజ్యంగ ప్రకారం ప్రాథమిక హక్కులున్నాయి. కానీ వాటి ఉల్లంఘనలను ఆపలేకపోతున్నాం. జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా లాంటి న్యాయమూర్తులు మన దేశానికి అవసరం.

Wednesday, April 25, 2012

Impartiality in courts

కోర్టుల్లో నిష్పక్ష పాతం న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసం చూరగొనాలంటే న్యాయ నిర్ణయ ప్రక్రియలో నిష్పక్షపాతం ఉండాలి. ఆర్‌ వర్సెస్‌ సుసెక్స్‌ (1924) కేసులో ప్రధాన న్యాయమూర్తి లాడ్డ్‌ హేవర్ట్‌ ‘న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టుగా కనిపించాలి. కేసుల విచారణ ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలి’ అన్నారు. పక్షపాతం అనేది ఆరు రకాలుగా ఉంటుందని వర్గీకరించారు. అవి వ్యక్తిగత పక్షపాతం, ఆర్ధిక పరమైన పక్షపాతం, కేసులోని విషయంమీద పక్షపాతం, శాఖాపరమైన పక్షపాతం, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల పక్షపాతం, మొండితనం- మూర్ఖత్వం వల్ల ఏర్పడిన పక్షపాతం. కోర్టు విచారణల్లో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కోర్టు ఏదైనా విషయంలో పక్షపాతంలో ఉందన్న అభిప్రాయం కోర్టుకు వచ్చిన వ్యక్తులకు ఏర్పడకూడదు. ఆ విధంగా కోర్టు వాతావరణం ఉండాలి. కోర్టుకు అంటే న్యాయమూర్తికి పూర్వభావనలు, ప్రతికూలాభిప్రాయాలు ఉండవని కాదు. అలాంటి భావనలు ఉండకూడదు. అలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు పైకి కనుపించేఉ విధంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పైకి కనుపించకుండా ఉంటాయి. వర్గం, మతం, కులం, లింగం, భాష, ప్రాంతం అనే విషయాలు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ప్రభావితం చేయకుండా న్యాయమూర్తి వ్యవహరించాలి. కిరాయిదారుడుగా ఉన్న న్యాయమూర్తి యజమానితో ఇబ్బందులపాలైతే అతనికి యజమానుల పట్ల కొన్ని పూర్వ భావనలు ఉంటాయి. అదే విధంగా అతను యజమాని అయి ఉండి కిరాయిదారునితో ఇబ్బందులు పడినప్పుడు అతనికి కిరాయిదారుల పట్ల కొన్ని పూర్వభావనలు ఉంటాయి. అదే విధంగా పోలీసులతో ఇబ్బందులు పడ్డ న్యాయమూర్తికి వాళ్ళ పట్ల పూర్వభావనలు ఉండే అవకాశం ఉంది. ఈ భావనలను గుర్తించి వాటినుంచి బయట పడాల్సింది. గుర్తించినప్పుడు ఈ పూర్వభావనలు తీర్పుల్లో ప్రతిబింబించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పూర్వభావనలు, పక్షపాత దృష్టి బయటపడడం సులువుకాదు గానీ దుస్సాధ్యం మాత్రం కాదు. కోర్టులు అందరి హక్కులను కాపాడాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు. కోర్టుకు వచ్చే వ్యక్తులందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. వారి సాధక బాధకాలను సానుభూతితో అనే బదులు చట్టపరంగా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నట్టు అనిపిస్తుంది.సుప్రీకోర్టు- స్టేట్‌ ఆఫ్‌ యుపి వర్సెస్‌ శంభూనాథ్‌ సింగ్‌ మరి ఇతరులు (ఏఐఆర్‌ 2001 సుప్రీంకోర్టు 403) కేసులో అభిప్రాయపడినట్టు ‘కోర్టు నుంచి సమన్లు రాగానే సాక్షులు వణికిపోతారు. కోర్టుల్లో జరిగే విచారణకు వాళ్ళ కాళ్ళు వణికిపోవడం లేదు, కోర్టు చుట్టూ ఎన్నిరోజులు తిరగాల్సి ఉంటుందోనని వాళ్ళు వణికి పోతారు. ఎందుకంటే వాళ్ళు తమ పనులను వదిలివేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్క సారితో అయిపోదు. మన దేశంలోని ప్రతి కోర్టులో కనుపించే దృశ్యమే ఇది. కోర్టులు ఓ నిర్ణయానికి రావడానికి వచ్చిన అతిథులని విచారించే కోర్టులు భావించాల్సిన సమయం ఆసన్నమైంది..’. కోర్టుల్లో సాక్షులు కూర్చోవడానికి సరైన స్థలం ఉండదు. తాగడానికి నీటి సౌకర్యం ఉండదు. మరుగుదొడ్లు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటాయి. కోర్టు అటెండర్లు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. భయానికి గురి చేస్తూఉంటారు. వారి పరిస్థితులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని వారి రోజు వారి కూలి దెబ్బతినకుండా, వాళ్ళు ఎక్కువసార్లు కోర్టుకి తిరగకుండా తేదీలను వేస్తే అది కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టనిపిస్తుంది. కోర్టుకు హాజరైనప్పుడు వారికి ఇవ్వాల్సిన వేతనం ఇస్తే కూడా అది నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది. నిష్పక్షపాతంగా ఉండడం ఎంత అవసరమో కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా ఉండడం కూడా నిష్పక్షపాతంగా ఉండడంగా భావించాల్సి ఉంటుంది. బీద వాళ్ళ పట్ల, పిల్లల పట్ల, మహిళలపట్ల పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగం పట్ల పక్షపాతంతో ఉండాలి. రాజ్యంగం వీరి హక్కులను గౌరవిస్తుంది. ప్రత్యేకమైన అధికరణలు కూడా రాజ్యాంగంలో ఉప్పాయి అదేవిధంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన వ్యక్తుల కోసం, మైనారిటీల కోసం కూడా రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. వీరికి కోర్టు గురించి, అక్కడ జరిగే ప్రొసీడింగ్స్‌ గురించి ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు సరైన న్యాయం పొందే విధంగా కోర్టు ప్రయత్నం చేయాలి. చర్యలు తీసుకోవాలి. కొన్ని చట్టాలు, కొన్ని నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంటుంది. అందులో కొంత వాస్తవం ఉందని అనుకున్నప్పటికీ ఏ చట్టం, ఏ నిబంధన దుర్వినియోగం కావడం లేదన్న ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు. మరీ ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి లోని సె.498 ఎ. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదన్న వాదనను చాలా మంది లేవనెత్తుతుంటారు. అది సరైనది కాదు. ఆ విధంగా ఉండడం అంటే పక్షపాతంతో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రతి కేసుని ఆ కేసులోని విషయాలను బట్టి చూడాల్సి ఉంటుంది. అప్పుడే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేసులను విచారించేటప్పుడు మిగతా కేసుల కంటె ఎక్కువ సున్నితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చే వ్యక్తులకు కోర్టు పద్ధతులు తెలియవు. చట్టమూ తెలియదు. వాళ్ళ హక్కులు బాధ్యతలు తెలియవు. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఎవరూనా కావచ్చు. అందుకని వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. నిబంధనల ప్రకారం బెయిలబుల్‌ నేరాలలో బెయిలు అనేది హక్కు. అది పోలీసులే ఇవ్వాలి. పోలీసులు ఇవ్వనప్పుడు మేజిస్ట్రేట్‌ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి బెయిల్‌ కోరినా కోరకపోయినా బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. అదేవిధంగా అరెస్టు అయిన వారం రోజుల్లోగా అతను జామీను పెట్టుకోనప్పుడు అతన్ని నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలి పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా చార్జిషీటును పోలీసులు 60, 90 రోజుల్లో దాఖలు చేయలేనప్పుడు కూడా వాళ్ళని బెయిలు పైన విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలి. వాళ్ళు కోరినా కోరకపోయినా ఈ బెయిళ్ళను మంజూరు చేయాల్సి ఉంటుంది. కోర్టు పద్ధతులు, నియమాలు, నిబంధనలు చాలా మందికి తెలియవు. కోర్టు పద్ధతులను అందరూ పాటించాలి. అందరూ పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. కోర్టు అనేది పూర్తిగా ఆ కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఉంటుంది. అందుకని అందరూ కోర్టు పద్ధతులను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ కోర్టు న్యాయమూర్తిపై ఉంటుంది. ఇవన్నీ పాటించినప్పుడే ఆ విచారణ, ఆ కోర్టు నిష్పక్షపాతంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. రూల్‌ఆఫ్‌లామంగారిరాజేందర

Tuesday, April 17, 2012

Trafficking

మనుషుల క్రయ విక్రయాలు

వ్యభిచారం, మనుషుల క్రయ విక్రయాలు అన్న విషయాలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవినీతికర పనుల కోసం మహిళలను, చిన్న పిల్లలను అక్రమ రవాణా చేయడం అనేది అనాదిగా ఉంది. ఈ ఆధునిక కాలంలో అది వికృత రూపం దాలుస్తున్నది. అందుకు కారణాలు అనేకం. ఆర్ధిక పరమైన ఒత్తిడులు, సాంఘిక పరమైన ఒత్తిడులు, పేదరికం, నగరీకరణ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వంటి కారణాలు ఎన్నో. వ్యభిచారం అనేది మన సమాజంలో అనాదిగా ఉంది. అనాదిగా ఉన్న వ్యభిచారాన్ని రద్దు చేయలేం. కాని నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల క్రయ విక్రయాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యభిచారాన్ని రద్దు చేయలేం కానీ దాన్ని తగు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని లా కమిషన్‌ తన 64వ నివేదికలో పేర్కొంది. నియంత్రణలో ఉంచాల్సిందని ప్రభుత్వానికి సూచించింది. ‘సీటా’ బిల్లును ప్రవేశపెట్టే ముందు హోమ్‌ మంత్రి లోక్‌సభలో ఈ విధంగా అన్నారు ‘వ్యభిచారాన్ని నియంత్రించలేమని కాదు, కానీ సులభంగా అందుబాటులో ఉంచకుండా ఉంచే ప్రయత్నమే ఈ బిల్లు’. సీటా చట్టం వ్యభిచారాన్ని రద్దు చేయలేదు. అది మానవ అక్రమ రవాణాను రద్దు చేస్తుంది. బహిరంగ స్థలాల్లో వ్యభిచారాన్ని రద్దు చేస్తుంది. నేరంగా గుర్తిస్తుంది.

సీటా చట్టం పరోక్షంగా మగవాళ్ళని సమర్ధించి, వ్యభిచారం చేస్తున్న ఆడవాళ్ళని సంఘ బహిష్కృతులుగా భావిస్తుంది. ఈ చట్టం ద్వంద్వ విలువలను ప్రతిపాదించింది. సీటా చట్టానికి 1986 మార్పులు తీసుకు వచ్చారు. వ్యభిచారం అన్న నిర్వచనం కూడా మారిపోయింది. చట్టం పేరు కూడా మారిపోయింది. అణిచివేత అన్న పదం చట్టం నుంచి తొలగిపోయింది. అది అవినీతి పనులకోసం మనుషుల క్రయ విక్రయాల (నిరోధక) చట్టంగా మారిపోయింది. అది ‘పీటా’ చట్టంగా మారింది. నిర్వచనాన్ని, చట్టాన్ని మార్చినప్పటికీ అది మహిళల క్రయ విక్రయాలను తగ్గించలేకపోయింది. భారతీయ శిక్షా స్మృతికి అనుబంధంగా మారింది తప్ప అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 23 ప్రకారం- శరీర క్రయ విక్రయాలను నిషేధించారు. ఆర్టికల్‌ 39 (ఇ) ప్రకారం మహిళల ఆరోగ్యాన్ని అదే విధంగా పిల్లలని వాళ్ళ ఆర్ధిక అవసరాలకు గాను దోపిడీకి గురి చేయకూడదు. పీటా చట్టమే కాకుండా భారతీయ శిక్షా స్మృతిలో కూడా వ్యభిచారాన్ని మనుష్యుల క్రయ విక్రయాలని అరికట్టడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాలలోని సె. 366 ఎ, 366 బి, 373 ప్రకారం వ్యభిచారం కోసం ఆడపిల్లలను కొనడం, అమ్మడం హీనమైన నేరంగా పరిగణిస్తుంది. వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ మనుష్యుల క్రయవిక్రయాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో మనుషుల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఖండాంతరం వ్యాపించలేదు. ఈ క్రయ విక్రయాలు 90 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి.

ఇవి మన దేశంలో జరుగుతున్న సరియైన చర్యలని ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేక పోతోంది. ఈ క్రయ విక్రయాలు వ్యభిచారం కోసమే కాదు, పనుల కోసం బానిసలుగా ఉపయోగించుకోవడానికి కూడా నిర్వహిస్తున్నారు. నేరస్థులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సయోధ్య వల్ల ఈ క్రయ విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నేరస్థుల మధ్య, ప్రభుత్వ యంత్రాంగం మధ్య లాలూచీ ఎంత ఉందో తెలపడానికి ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఉదంతం చాలు. 2012 ఫిబ్రవరి 10 తేదీన ఇమ్రాబీ కుమార్తెను ఓ గూండా రేప్‌ చేశాడు. భోపాల్‌ నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీటల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాణీ యాదవ్‌ అనే యువతి సహాయంతో 15 సంవత్సరాల బాలికను రాజేశ్‌ హీరోలే తన సైకిల్‌ మోటారు మీద కిడ్నాప్‌ చేసి ఆమె పై రేప్‌ చేశాడు.

ఆమెను అతను అపహరించుకొని పోతున్నప్పుడు దాదాపు 1200 మంది చూశారు. కానీ ఎవరూ దానిని ప్రతిఘటించలేదు. ఆ ప్రాంతంలో రాజేశ్‌ హీరోలేకి తిరుగు లేదు. అతను భూ ఆక్రమణ దారుడు, వడ్డీ వ్యాపారి. అతన్ని ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. అయినా ఇమ్రాబీ బాయి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే 2006 సంవత్సరంలో ఆమె మరో కుమార్తె కనుపించకుండా పోయింది. రాణీ యాదవ్‌ ఆమెని వైష్ణవీ దేవి గుడికి అని తీసుకు వెళ్ళి వ్యభిచార గృహంలో అమ్మేశారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇమ్రాబీ బాయికి తెలిసింది. ఆ కుమార్తె పారిపోయి రావడం వల్ల ఈ సంగతి ఇమ్రాబీ బాయికి తెల్సింది.

రెండవ కుమార్తెకు కూడా అలాంటి పరిస్థితి రావద్దని ఆమె రాజేశ్‌ హీరోలేకి ఎదురు తిరగాలని అనుకొని రాజేశ్‌ హీరోలేపైన ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సె. 376, 342 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఆమె నోరు మూయించడానికి రాజేశ్‌ హీరోలే తన గ్యాంగ్‌తో ఆమె దగ్గరకు వచ్చాడు. అతని గ్యాంగ్‌ లోని మంటూ యాదవ్‌ అనే వ్యక్తి ఆమె కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపాడు. రేప్‌ కేసు నమోదైన తరువాత రాజేశ్‌ హీరోలే ఇమ్రాబీ బాయి దగ్గరకొచ్చి కేసును వదిలించుకోవడానికి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఫలితం లేకపోవడంతో ఆమెను బెదిరించాడు. ఆ తరువాత కాల్చి చంపారు. అతను ఒత్తిడి చేయడం మొదలు పెట్టిన తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులనుంచి సరైన స్పందన రాలేదు. ఆమెను రక్షించడానికి పోలీసులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఆమె హత్యకు గురైంది. షెడ్యూల్డు తెగకు చెందిన ఇమ్రాబీ బాయి హత్య మన 60 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ప్రశ్నిస్తున్నది. మన చట్టాన్ని ప్రశ్నిస్తున్నది. కఠినమైన శిక్షలను ఏర్పరచినంత మాత్రాన చట్టం సమర్ధవంతంగా అమలు జరగదు. చట్టాన్ని అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తేనే ఏ చట్టానికైనా పరమార్ధం.

Saturday, March 31, 2012

విడాకులు సులభతరం

విడాకులు సులభతరం

వివాహ బంధంలో ఉన్న దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు-2010ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2010లో మొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లా కమిషన్‌ తన 271వ నివేదికలో వివాహాల (సవరణల) బిల్లు-2010ను సూచించింది. సరిదిద్దడానికి వీలు లేని వివాహాలను- విడాకులు పొందడానికి ఒక ఆధారంగా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే కలుగచేసే ప్రభావాలను సభ్య సమాజం చర్చించింది. కొందరు భయాందోళనలను కూడా వ్యక్తం చేశా రు. చాలామంది న్యాయ కోవిదులు, వ్యాసకర్తలు ఈ బిల్లులోని అంశాలను వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపి తగు సూచనలు, సలహాలు ఇవ్వమని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీ ప్రజలనుంచి సూచనలు, అభ్యంతరాలు కోరి వాటిని పరిశీలించి తన 45వ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జయంతి నటరాజన్‌ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 2011 మార్చి 1న సమర్పించిన తన నివేదికలో ఈ బిల్లులో తీసుకురావలసిన మార్పుల్ని సూచించింది. మార్పులు తీసుకొచ్చిన వివాహాల సవరణల బిల్లు- 2010ను కేంద్ర ప్రభుత్వం మార్చి 22న ఆమోదించింది. ఇక పార్లమెంట్‌ ఆమోదం పొంది రాష్టప్రతి ఆమోదముద్ర పొందితే చట్ట రూపం దాలుస్తుంది.

ఈ మార్పులపై కూడా విభిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. హిందూ సమాజం విడాకుల్ని ఆమోదించలేదు. అలాంటి భావన 19వ శతాబ్దం తొలి దశలో మన చట్టంలో లేదు. ఆ తర్వాత కాలంలో అది చట్టంలో చోటు చేసుకుంది. హిందువులకు సంబంధించి హిందూ వివాహ చట్టం, మతంతో సంబంధంలేకుండా ప్రత్యేక వివాహ చట్టం అమలులోకి వచ్చాయి. ఈ రెండు చట్టాల్లో విడాకులు పొందడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాలక్రమంలో పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి కూడా అవకాశం కల్పిస్తూ సవరణలు తీసుకొచ్చారు. ఆ అవకాశం ఉండగా మళ్ళీ ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహం’ అన్న కొత్త ఆధారం ఎందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడున్న చట్టాల ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదం చేసినప్పుడే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులు విడాకులు మంజూరు చేస్తున్నాయి. ఈ ఆధారాలకు మరో ఆధారం తోడైంది.

అదే పరస్పర ఆమోదంతో విడాకులు. దీనికి కూడా అదనంగా ఇప్పుడు మరో కొత్త ఆధారం 13 సి రూపంలో రాబోతోంది. ఈ నిబంధన ప్రకారం మొదట ప్రతిపాదించిన ప్రకారం మూడు సంవత్సరాలు భార్యా భర్తలు వేరుగా ఉంటే వారు విడాకులు పొందడానికి ఆస్కారం ఉంది. వైవాహిక తప్పిదం చేసిన వ్యక్తి కూడా వివాహం రద్దు చేయమని, తమది సరిదిద్దడానికి వీల్లేని వివాహమనీ కోరడానికి అవకాశం ఉంది. ఇది మహిళలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం రావడంతో సరికొత్త రూపంలో బిల్లును తీసుకురావాలని జయంతీ నటరాజన్‌ కమిటీ తన నివేదికలో కోరింది. ఈ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది.అవి- 1.సరిదిద్దడానికి వీల్లేని వివాహాలు అన్నది విడాకులు పొందడానికి ఒక ఆధారం కావాలి 2. భార్యకు, పిల్లలకు పోషణ కోసం తగు రక్షణలు కల్పించాలి.3. పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినప్పుడుదంపతులుతప్పకుండా ఆరు మాసాలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. దానిని తొలగించాలి.

సరిదిద్దడానికి వీల్లేని వివాహం అంటే ఏమిటో ప్రతిపాదిత బిల్లులో పేర్కొనలేదు. కాని ఈ ఆధారంతో దంపతులు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు వేరుగా ఉంటున్న దంపతులు ఈ ఆధారం ప్రకారం విడాకులు కోరడానికి అవకాశం ఉంది. సవరించి ప్రతిపాదిత బిల్లులోని నిబంధన ప్రకారం ఈ ఆధారం ప్రకారం భర్త విడాకులు కోరినప్పుడు భార్య ఆ విడాకులను వ్యతిరేకించవచ్చు. సరిదిద్దడానికి వీల్లేని వివాహం అన్న ఆధారంగా భార్య విడాకులు కోరినప్పుడు మాత్రం భర్త వ్యతిరేకించడానికి వీల్లేదు. ఈ నిబంధన మగవారిపట్ల వివక్షతో ఉన్నదని కొందరి వాదన. ఈ వాదనలో బలంలేదు. ఎందుకంటే, రాజ్యాంగంలోని అధికరణ 15 ప్రకారం పిల్లలు, స్ర్తీల కోసం ప్రత్యేక చట్టాలను రాజ్యం తయారు చేయవచ్చు.

భారతీయ శిక్షా స్మృతిలోని సె. 498 ఎ మాదిరిగా ఇది కూడా దుర్వినియోగం అవుతుందన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు. ఆ వాదనలో కూడా పస లేదు. పురుషులకు అందుబాటులో ఉన్నంతగా కోర్టులు స్త్రీలకు లేవు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే స్ర్తీలు కోర్టుకు వస్తారు. పురుషులు మోజు తీరిన తర్వాత మూడు సంవత్సరాలు విడిగా ఉండి విడాకులు కోరే అవకాశం ఉంది. అందువల్ల మార్పు చేసిన నిబంధన మహిళల పక్షం ఉండడం సమంజసం. ఈ ఆధారమే సరైనది కాదన్న వాదన కూడా హేతుబద్ధం కాదు. కోర్టుల్లో కేసుల విచారణకు చాలా సమయం పడుతుంది. కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసినప్పటికీ, సత్వరంగా కేసుల పరిష్కారం జరగడంలేదు. ఫలితంగా యవ్వనం కోల్పోయిన తర్వాత కేసుల పరిష్కారం వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరదు.

ఇక రెండవ సూచన కూడా అవసరమనిపిస్తుంది. పిల్లలకు, భార్యకు మనోవర్తి భరణం వంటి అంశాలు అమల్లో ఉన్న చట్టంలో ఉన్నప్పటికీ దానివల్ల మహిళలకు పూర్తి న్యాయం జరగడం లేదు. కోర్టులు మంజూరు చేసే మొత్తాలు సహేతుకంగా ఉండడం లేదు. వివాహ బంధంలో ఉన్న సమయంలో భర్త ఆర్జించిన ఆస్తిలో భార్యకు హక్కు కల్పించాలని కమిటీ సూచించింది. ఆ ఆస్తి సముపార్జనలో భార్య సహాయం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆమె ఉద్యోగి అయితే డబ్బు సహాయం చేస్తుంది. సహజంగా ఆ ఆస్తి భర్త పేరుతోనే రిజిస్టరయ్యే అవకాశం ఉంటుంది. ఆమె ఉద్యోగి కానప్పుడు గృహిణిగా ఆస్తి సంపాదనలో ఆమె వంతు సహాయం పరోక్షంగా ఉంటుంది. అందువల్ల, ఈ నిబంధనను ప్రతిపాదించడంలో సహేతుకత ఉంది. ఈ ప్రయోజనాన్ని దత్తత పిల్లలకు కూడా ఇవ్వాలని సూచించారు. అది కూడా సమంజసమే.

అయితే ఈ హక్కు భర్త ఉమ్మడి ఆస్తిలో, వివాహానికి ముందు ఆర్జించిన ఆస్తిలో ఉండదు. వివాహబంధంలో ఆర్జించిన ఆస్తి లేనపుడు భరణం మాత్రమే కోరే అవకాశం ఉంది.
మూడవ ప్రతిపాదిత అంశం పరస్పర ఆమోదంతో విడాకులు. ఈ మేరకు దరఖాస్తు చేశాక, ఆరు మాసాలు వేచి ఉండాలి. 6 నుంచి 18 మాసాలలోపు ఈ విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీనివల్ల దంపతులు ఇబ్బందులకు లోనవుతున్నారు. 6 మాసాల కాలాన్ని తగ్గించే విధంగా కోర్టులకు విచక్షణాధికారం ఇవ్వడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఈబిల్లు చట్టరూపం దాలుస్తే మహిళలకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తునర్‌

రూల్‌ఆఫ్‌లా మంగారి రాజేందర్‌


Wednesday, March 21, 2012

మధ్య వర్తిత్వమే మేలు!

మన దేశంలో మూడు రకాలైన కేసులు ఎక్కువగా దాఖలవుతున్నాయి. అవి- రోడ్డు ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, చెక్కులు చెల్లలేదన్న కేసులు, వివాహాలకు సంబంధించిన కేసులు. ఈ కేసుల సంఖ్య మిగతా కేసులతో పోలిస్తే చాలా ఎక్కువ. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా జరగకుండా కాకపోయినా, కొంత వరకూ నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా! చెక్కుల్ని నిరాకరించినప్పుడు దాఖలయ్యే కేసులు ఎక్కువగా ఫైనాన్స్‌ సంస్థలు దాఖలు చేస్తున్న కేసులు. చెక్కు చెల్లనప్పుడు గతంలో సివిల్‌ కేసులు మాత్రమే దాఖలయ్యేవి. 1988లో నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టానికి మార్పులు తీసుకొచ్చి క్రిమినల్‌ చర్యలు తీసుకునే విధంగా మార్చారు. ఫలితంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఫైనాన్షియల్‌ సంస్థలు, బ్యాంకులు రుణాలు ఎంత సులువుగా ఇస్తున్నాయో వసూలు చేయడంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదా వాయిదాకి చెల్లించాల్సిన డబ్బు గురించి ముందుగానే చెక్కులు తీసుకుంటున్నాయి. ఆ చెక్కులు చెల్లనప్పుడు క్రిమినల్‌ కేసులు దాఖలు చేస్తున్నాయి. ఈ విధంగా ఆ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. ఫలితంగా ప్రత్యేక కోర్టుల్ని నగరాల్లో ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటిని కూడా ప్రభుత్వం కొంత నియంత్రించే అవకాశం ఉంది.
మూడవ రకమైన కేసులు వివాహ సంబంధ కేసులు. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఖ్యని నియంత్రించడం ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు, సమాజంలో వచ్చిన మార్పులు, వ్యక్తుల ఆలోచనా ధోరణుల్లో వచ్చిన మార్పులు వీటికి కారణాలు. కారణాలు ఏమైనప్పటికీ వీటి సంఖ్య పెరగడం అందరినీ కలవర పెడుతున్న విషయం.

ఈ మూడు రకాలైన కేసులు పెరగడం వల్ల కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఫలితంగా కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మూడు రకాలైన కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆ పని అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఆ విధంగా పరిష్కారం చేసుకోకపోతే కేసులు సంఖ్య పెరిగి విచారణలో జాప్యం జరిగి కోర్టుల మీద విశ్వాసం, నమ్మకం పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
రోడ్డు ప్రమాదాల కేసుల విచారణల్లో జాప్యం కంటె, చెక్కుల కేసుల విచారణల్లో జాప్యం కంటె- వివాహాలకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరిగితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. వయస్సు దాటిపోయిన తర్వాత విడాకులు మంజూరు చేసి ఫలితం ఉండదు. ఈ విషయాన్ని గమనించే శాసన కర్తలు హిందూ వివాహ చట్టంలో, ప్రత్యేక వివాహ చట్టంలో పార్టీల మధ్య సామరస్యం నెలకొల్పడానికి కోర్టులు చర్యలు తసుకోవడానికి సె.23, సె.34 వంటి నిబంధనల్ని ఈ రెండు చట్టాల్లో ఏర్పరచారు.

అయినా కూడా అనుకున్న పద్ధతిలో వేగంగా కేసుల పరిష్కారాలు జరగడం లేదని లా కమిషన్‌ తన 59వ నివేదికలో కొన్ని సూచనలు చేసింది. ఈ ఆర్డర్‌ ప్రకారం వివాహ వివాదాలను ప్రత్యేక పద్ధతిలో పరిష్కరించాలి. ఈ ఆర్డర్స్‌ని సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఏర్పాటు చేసినప్పటికీ వివాదాల పరిష్కారం మామూలు పద్ధతిలో కోర్టులు పరిష్కరించాయి. ఈ విషయాన్ని గమనించి ప్రత్యేక చట్టం ఆవశ్యకతను గుర్తించి శాసనకర్తలు కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని తీసుకువచ్చారు.
భార్యా భర్తల వివాదాలను సామరస్యకంగా మధ్యవర్తిత్వం నెరపి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఒక మిలియన్‌ జనాభా దాటిన నగరాల్లో విధిగా కుటుంబ న్యాయస్థానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సె.9 ప్రకారం కుటుంబ న్యాయస్థానం ముందుకు వచ్చిన కలహాలను సామరస్యకంగా పరిష్కరించడానికి విధిగా ప్రయత్నించాలి. పార్టీలు సదవగాహనకు రావడానికి కేసు పూర్వపరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలను ఒప్పించడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాలి. అంతే కాకుండా పార్టీల మధ్య సదవగాహన రావడానికి న్యాయస్థానం తోడ్పడాలి.
హిందూ వివాహ చట్టంలోని సె.23 (2) ప్రకారం, దాఖలయ్యే దరఖాస్తులను పరిష్కరించే ముందు ఆ దంపతుల మధ్య సామరస్యం నెలకొల్పడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. కుటుంబ న్యాయస్థానంలోని నిబంధన 9 అటువంటిదే. వివాహ వ్యవస్థను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనను ఈ చట్టంలో పొందు పరచారు. భార్య భర్త మధ్య ఏర్పడిన వివాదాలను సామరస్యంగా మధ్యవర్తిత్వం జరిపి పరిష్కరించవలసిన ఆవశ్యకతను గుర్తించి ఈ చట్టాన్ని తయారు చేశారు.

అన్ని మతాలకు సంబంధించి ఒకే రకమైన పద్ధతిలో కేసుల విచారణ జరగాలని, అది కూడా లింగ వివక్ష లేకుండా విచారణలు జరగాలన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనను ఏర్పాటు చేశారు. కుటుంబ న్యాయస్థానాల్లో అన్ని వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన కేసులు వస్తాయి. కొన్ని చట్టాల్లో సామరస్యం, రాజీ కుదిర్చే నిబంధనలు లేవు. కానీ కుటుంబ న్యాయస్థానాల్లో ఏర్పడిన నిబంధన 9 ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాల్సి ఉంటుంది.

దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీలు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్టికల్‌32 ఎ, కుటుంబ న్యాయస్థానంలోని సె.9, హిందూ వివాహ చట్టంలోని సె. 23, ప్రత్యేక వివాహ చట్టంలోని సె.34 చెబుతున్నది ఇదే విషయం. హిందూ వివాహ చట్టంలోని సె.23, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 32ఎ నిబంధనలను సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి జిగ్‌రాజ్‌ సింగ్‌ వర్సెస్‌ బీర్‌పాల్‌ కౌర్‌ (జె.టి. 2007 (3) సుప్రీంకోర్టు 389) ఏర్పడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు- ‘ఈ రెండు నిబంధనల ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మొదటి దశలో కోర్టులు ప్రయత్నం చేయాలి. ఈ ఉద్దేశంతోనే పార్టీలు కోర్టుముందు వ్యక్తిగతంగా హాజరు కావలసి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పార్టీలు హాజరు కాకపోతే వారి ‘ఏకపక్షం’ చేయాలన్న వాదన ఆమోదించలేము. ఆ విధంగా ఆమోదిస్తే ఈ ఉపయుక్తమైన నిబంధన ఎందుకూ పనికిరానిదిగా మారిపోతుంది.


ఫలితంగా పార్టీల మధ్య సయోధ్య కుదర్చాలన్న ఉద్దేశమే దెబ్బతింటుంది’. అందుకని ప్రతివాది హాజరుకోసం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను హైకోర్టు జారీ చేయడం సమంజసమని, చట్టం ఉద్దేశం నెరవేర్చడానికి అది ఉద్దేశించినదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.హిందూ వివాహ చట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి చాలా ఆధారాలున్నాయి. దంపతుల్లో ఎవరైనా మతం మారినప్పుడు, వక్రమైన మానసిక అస్వస్థతకు గురైనప్పుడు, సుఖ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు- మరొకరు విడాకులు పొందవచ్చు. ఈ ఆధారాలతో విడాకులు కోరినప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత, రాజీ కుదర్చాల్సిన బాధ్యత కోర్టులమీద లేదు.

ఈ విషయం గురించి కేరళ హైకోర్టు బివి వర్సెస్‌ కేవి. సుందరన్‌ కేసులో చర్చించి ఆ పరిస్థితుల్లో కూడా కోర్టు మధ్యవర్తిత్వం నెరపాలని వ్యాఖ్యానించింది. కోర్టు మాటల్లో- ‘మతం మార్పిడి జరిగినంత మాత్రాన పార్టీలు సుఖప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపలేరని అనుకోవడానికి అవకాశం లేదు. సయోధ్య నెరపడానికి హిందూ వివాహ చట్టం కొన్ని ఆధారాలకు మినహాయింపులను ఇచ్చింది. కానీ కుటుంబ న్యాయస్థానం అలాంటి మినహాయింపులను ఇవ్వలేదు. కుటుంబ న్యాయస్థానాల చట్టం ప్రకారం అన్ని వివాహ సంబంధమైన కేసుల్లో మధ్యవర్తిత్వం నెరపి పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

ఇది తప్పక చేయాల్సిన చర్య. ఈచట్టం ద్వారా వచ్చిన మార్పు ఇదే’!
ఈ తీర్పుల ద్వారా, చట్టాల ద్వారా అర్ధం అవుతున్న విషయం ఒక్కటే. వివాహ సంబంధ విషయాల్లో పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి, రాజీ కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సత్వరం పరిష్కరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల సమయం, డబ్బు, ఖర్చులు మిగులుతాయి. ఇది మన దేశానికి కొత్తదేమీ కాదు, ఎప్పటినుంచో ఉన్నదే.

రూల్‌ఆఫ్‌లా మంగారి రాజేందర్‌

Saturday, March 17, 2012

విరోధి పద్ధతి విచారణ

పోలీసులు, కోర్టుల నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ విషయానికి వస్తే ఎవరైనా నిష్పక్షపాతంగానే ఉండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరిపట్లా ఉండాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు. చాలా నేరాలు సమాజానికి వ్యతిరేకంగా జరిగినవి కాబట్టి, ఆ సమాజం పట్ల కూడా పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా ఉండాలి. క్రిమినల్‌ కేసుల విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ చెబుతున్నది కూడా ఇదే. ఈ శాసనం ప్రకారం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. మన దేశంలో ‘ఏడ్వర్సరీ సిస్టం’ (ప్రతికూల పద్ధతి) అమలులో ఉంది.

అంటే ప్రతికూల వ్యవస్థ అన్నమాట. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకు నిష్పక్షపాతంగా ఉండాలి. ఆయన కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనకూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్‌ లా’ దేశాలలో ఉంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు ఉంటాయి. ముద్దాయి పక్షం ఒకటి, ప్రాసిక్యూషన్‌ పక్షం ఒకటి. కేసును రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ముద్దాయిని సాక్ష్యం పెట్టాలని ఒత్తిడి చేయడానికి వీలు లేదు. అతని ప్రాసిక్యూటర్‌ (అభియోక్త) ప్రశ్నించడాకి వీల్లేదు. కానీ ముద్దాయి తనను తాను విచారించుకోవడానికి అతనికి విచక్షణాధికారం ఉంది. ఆ విధంగా అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అతని అభియోక్త క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మౌనంగా ఉండే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రతికూల పద్ధతిలో న్యాయమూర్తి చురుకుగా పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో న్యామూర్తి విచారణ క్రమంలో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించే నిబంధనలు కొన్ని ఉన్నాయి. కొన్ని నిబంధనలు అపారమైన అధికారాలను కూడా న్యాయమూర్తికి ఇచ్చాయి. అందుకు ఉదాహరణే భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.165. ఈ నిబంధన కేసు విచారణ క్రమంలో సంబంధం ఉన్న, సంబంధం లేని విషయాలను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనని ఉపయోగిస్తున్న న్యాయమూర్తులు చాలా అరుదు. ఈ నిబంధనే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా చాలా నిబంధనలు ఉన్నాయి ఈ ఏడ్వర్సరీ సిస్టంలో ఇరు పక్షాల న్యాయవాదులు ఇరుపక్షాల సాక్షులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ముద్దాయి సాక్షులను విచారించినప్పుడే ప్రాసిక్యూషన్‌కి అవకాశం లభిస్తుంది.

ఇక ఇన్క్విస్టోరియల్‌ విధానం (పరిశోధన పద్ధతి)లో చాలా చురుకైన పాత్ర పోషించేది న్యాయమూర్తి. విచారణలో సాక్షులను విచారించేది న్యాయమూర్తే. ఈ పద్ధతి ఉద్దేశం సత్యాన్ని తెల్సుకోవలసిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది. ఏడ్వర్సరీ విధానంలో నేరం నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని అమాయకుడుగా పరిగణిస్తారు. ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయి నేరం చేశాడన్న భావనలో కోర్టులు ఉంటాయన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అతను నిరపరాధి అన్న విషయం రుజువు చేసుకోవలసిన బాధ్యత అతనిపైనే ఉన్నదని కూడా చాలా మంది అనుకుంటారు. ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో ఇన్క్విస్టోరియల్‌ విధానం గత వంద సంవత్సరాలకు పైబడి ఉంది. అక్కడ నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంది. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి.

అంతర్జాతీయ సివిల్‌, రాజకీయ హక్కుల ఒప్పందంలోని అధికరణ ప్రకారం నేరం నిరూపణ అయ్యేవరకే ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాలి. ఈ సూత్రానికి అనుగుణంగానే ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని పాటిస్తున్న యూరోపియన్‌ దేశాల్లో చట్టాలున్నాయి. ఈ రెండు పద్ధతులకు ప్రధానమైన భేదం ఒకటుంది. ఏడ్వర్సరీ విధానంలో ముద్దాయిని అతను అనుకున్నప్పుడు తప్ప మరో సందర్భంలో ప్రాసిక్యూషన్‌ విచారించే అవకాశం లేదు. సాక్ష్యం ఇవ్వాలని అతణ్ణి ఒత్తిడికి గురిచేసే అవకాశం లేదు. రాజ్యాంగం, అదే విధంగా ఇతర శాసనాలు ముద్దాయికి ఈ హక్కులను ప్రసాదించాయి. ఇదే పద్ధతి ఈ ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని అనుసరిస్తున్న దేశాల్లో ఉంది.ఇన్క్విస్టోరియల్‌ విధానంలో కూడా దాదాపు ఇదే పద్ధతి ఉంటుంది. దర్యాప్తు క్రమంలో, కేసు విచారణ క్రమంలో ముద్దాయిని మాట్లాడమని ఒత్తిడి చేసే అవకాశం లేదు.

ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకు కారణాలు రెండు- ముద్దాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రాసిక్యూషన్‌ పరిశోధనను, సోదాలను నిర్వహిస్తుంది. విచారణ సమయంలో ముందుగా ముద్దాయిని న్యాయమూర్తి విచారిస్తాడు. కేసుకు సంబంధించిన కాగితాలను న్యాయమూర్తి ముద్దాయికి అందచేసి, అతని కథనాన్ని, అదే విధంగా అతని మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దీన్ని బట్టి ఈ ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారనే అపప్రథ ఏర్పడింది.

విరోధి పద్ధతి ముద్దాయికి అనుకూలంగా ఉందని, దానివల్ల చాలామంది శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కాని నేర న్యాయ వ్యవస్థని దగ్గరగా చూసిన వ్యక్తుల అభిప్రాయం వేరుగా ఉంటుంది. లోపభూయిష్టమైన దర్యాప్తు, సాక్షులు సహకరించకపోవడం, దర్యాప్తు విచారణలో జాప్యం వంటి కారణాలు ఎన్నో. కేసు నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న అభిప్రాయం ‘విరోధి పద్ధతి’లో ఉండడం వల్లే కేసులు వీగిపోతున్నాయని, దీనిని మార్చాలని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇదికూడా సరైన పద్ధతి కాదు. రెండు రకాలైన వ్యవస్థలకు ఇది వర్తిస్తుంది.
మన దేశంలో అభివృద్ధి చెందిన జ్యూరిస్‌ప్రుడెన్స్‌ ప్రకారం అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా ఉందో, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని నిరపరాధిగానే భావించాల్సి ఉంటుంది. నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌ది.

బాధితుడికి, సమాజానికి కష్టం, నష్టం కలిగించే విధంగా ఈ నిబంధన ఉందనే భిన్నాభిప్రాయాన్నీ చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను, సాక్ష్యాధారాల చట్టాన్ని ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చే విధంగా తయారు చేయలేదు. అందరికీ తగు న్యాయం జరిగే విధంగానే తయారు చేశారు. నేరనిరూపణ బాధ్యత ప్రాసిక్యూషన్‌పై కాక తాను నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిపై ఉంచాలన్న వాదన తరచు వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నేరాలు, హీనమైన నేరాలు జరిగినప్పుడు ఈ వాదన వస్తుంది. ఏమైనప్పటికీ ఈ వాదనతో ఏకీభవించలేం. ఎందుకంటే మన దేశంలోని నేరస్థుల్లో ఎక్కువమంది నిరుపేదలు, దిక్కు దివాణం లేని వ్యక్తులు. నేరం తాము చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి వారికి శిక్ష విధించాల్సి వస్తుంది. అమాయకులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని, నేరం నిరూపణ అయ్యేవరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న సూత్రానికి ఆవశ్యకత ఉంది. శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కొనడానికి అది కవచంలా ఉపయోగపడుతుంది.
మంగారి రాజేందర్‌

Thursday, March 8, 2012

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

ఓచిన్న దొంగతనం చేశాడని ఓ కుర్రవాడిని నెల రోజులు బంధించారన్న వార్త కనిపించింది. అది జరిగిన నాలుగు రోజులకి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో మరో సంఘటన జరిగింది. మొదటి పని చేసింది ఆ ఊరి గ్రామస్థులు. రెండవ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌. ఇది అమానుష చర్య. వచ్చిన వార్తల ప్రకారం ఆ పిల్లవాడు చేసిన నేరం మోటారు వాహనాల్లో పెట్రోల్‌ దొంగతనం. ఆ నేరానికి ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్‌ అతన్ని రోడ్డుమీద చితకబాదారు. అది రివాల్వార్‌ చూపిం చడం దాకా వెళ్ళింది. మీడియా చాలా క్రియాశీలంగా ఉందన్న విషయం తెలిసి కూడా పోలీసులు ఎలాంటి మొహమాటం పోలేదు.

ఈ విషయమై ఓ చానల్‌ యాంకర్‌ ఆ ఇన్స్‌పెక్టర్‌ను ప్రశ్నించింది. అతను సరైన సమాధానాలు చెప్పలేదు, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని ఖండించనూ లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్‌ బి. లోకూర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జువెనైల్‌ జస్టిస్‌ గురించి వర్క్‌ షాపుల్ని జ్యుడిషియల్‌ అకాడమీ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.జువెనైల్‌ జస్టిస్‌ చట్టాన్ని మన దేశం 1986లో తీసుకొని వచ్చింది. ఆ చట్ట ప్రకారం 16 సంవత్సరాల లోపున్న పిల్లవాడిని, 18 సంవత్సరాల లోబడి ఉన్న ఆడపిల్లను ఈ చట్టం జువెనైల్‌గా పరిగణించింది. మగ పిల్లల వయస్సును కూడా 18 సంవత్సరాలకు పెంచాలని పిల్లల గురించి పనిచేస్తున్న వ్యక్తులు కోరుతున్నారు.

భారత దేశం 1992 డిసెంబర్‌ 11న పిల్లల హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. 2000లో ఈ చట్టాన్ని ఆ ఒప్పందానికి అనుగుణంగా మార్చింది. మగ పిల్లలకి కూడా 18 సంవత్సరాల వయస్సును నిర్ధారించారు. ఆర్టికల్‌ 1 సిఆర్‌సి ప్రకారం 18 సంవత్సరాలకు లోబడిన వ్యక్తులందరూ పిల్లలే. 2006లో ఈ చట్టానికి మళ్ళీ మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం రెండు రకాల పిల్లలున్నారు. వాళ్ళు చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలు- రక్షణ, పోషణ లేని పిల్లలు. నేరం చేసిన పిల్లలని చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలని, ఆలనా పాలన లేని ప్లిలలను రక్షణ, పోషణ లేని పిల్లలని అంటారు. అలాగే రెండు రకాలైన నేరాలనూ చట్టం గుర్తించింది.

అవి బాలలు చేసే నేరాలు- బాలలపై జరిగే కొన్ని ప్రత్యేక నేరాలు.
పైన పేర్కొన్న ఇన్స్‌పెక్టర్‌ చేసిన నేరం బాలలపై జరిగిన ప్రత్యేకమైన నేరం. ఈ నేరాలను జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సె.23 నుంచి 26 వరకు పేర్కొన్నారు. సె.27 ప్రకారం ఈ నేరాలు కాగ్నిజబుల్‌ నేరాలు. అంటే మేజిస్ట్రీట్‌ అనుమతి లేకుండా పోలీసులు దర్యాప్తు చేయడానికి అవకాశం ఉన్న నేరాలు. సె. 23 ప్రకారం బాలల పట్ల క్రూరంగా వ్యవహరించడం నేరం. బెదిరించడం, వదిలిపెట్టడం, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం లేదా బెదిరించే ప్రయత్నం చేయడం, వదిలి పెట్టడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలకి శారీరకంగా, మానసికంగా బాధ కలగచేయడం. ఎవరైనా సరే, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే వారికి 6 మాసాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

బాలల్ని బిచ్చం ఎత్తుకునే వృత్తిలో నియమించి వారి ఆదాయాన్ని వాడుకున్న వ్యక్తులను, ఆ విధంగా బిచ్చం ఎత్తుకునే వ్యక్తులకు సహకరించిన వక్తులకు సె.24 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. డాక్టర్లు నిర్దేశించినప్పుడు కాకుండా ఇతర సందర్భాలలో పిల్లలకి మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు ఇచ్చిన వ్యక్తులకు సె. 25 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. బాలలను ఉద్యోగాలలో నియమించి దోపిడీకి గురి చేసినప్పుడు, అపాయకరమైన వృత్తిలో నియమించినప్పుడు, వారి ఆదాయాన్ని నిలిపివేసినప్పుడు సె. 26 ప్రకారం వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

నేరం చేసిన పిల్లలు మొదట తారసపడేది పోలీసుతోనే. మామూలు వ్యక్తులు వాళ్ళని పట్టుకున్నా వారిని పోలీసులకు అప్పగిస్తారు. వారు చేసిన నేరాలను విచారించే అధికారం పోలీసులకు ఉంది. అయితే నేరాలు చేసిన పెద్దవాళ్ళని ట్రీట్‌ చేసిన విధంగా పిల్లలను పోలీసులు ట్రీట్‌ చేయకూడదు. ఈ చట్టప్రకారం- పిల్లలు చేసిన నేరాలను విచారించే అధికారులుగా మానవ దృక్పథంతో ఉన్న వ్యక్తులను, సున్నితంగా ఆలోచించే వ్యక్తులను నియమించాలి. ఈ చట్ట ప్రకారం పిల్లల పట్ల సున్నితంగా నడుచుకోవాలి. అయితే ఈ మధ్య మీడియాలో కనుపించిన దృశ్యం ఆ విధంగా కనుపించదు. పిల్లలను నేరస్థుల కంటె అధ్యాన్నంగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే హింసను ప్రదర్శించే, ఉపయోగించే అధికారం పోలీసులకు లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్బాలలోనే పోలీసులు బలప్రయోగాన్ని ఉపయోగించుకోవచ్చు.

బాలలు ఏదైనా నేరం చేసినప్పుడు ఆ దర్యాప్తును పోలీసులు సాధారణంగా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలు చేసిన నేరాలు ఎంతో తీవ్రమైనవైనా వారికి బెయిలు మంజూరు చేసే అధికారం పోలీసులకు ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే బెయిల్‌ను పోలీసులు తిరస్కరించాల్సి ఉంటుంది. నేరం చేసిన వ్యక్తుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించకూడదు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేయకూడదు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు మరీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బాలల చట్టంలోని సె. 23 ప్రకారం నేరమే కాక, ఆ నేరం రుజువైతే వారు తమ ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. మామూలు వ్యక్తులకు, పిల్లలకు బేధం ఉంది.

మామూలు వ్యక్తులు సె. 23 ప్రకారం విచారణను మాత్రమే ఎదుర్కొంటారు. నేర నిరూపణ జరిగితే శిక్ష పడే అవకాశం ఉంది.. పోలీసుల విషయానికి వస్తే శిక్ష మాత్రమే కాక ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. నియమాలు ఏర్పరచడంతోనే సరిపోదు. అవి సక్రమంగా అమలు జరిగినప్పుడే అందరిలో, ముఖ్యంగా పోలీసుల్లో మార్పు వస్తుంది.

Thursday, February 23, 2012

దత్తతకో లౌకిక చట్టం

దత్తతకో లౌకిక చట్టం

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి చాలా సంవత్సరాలు గడచినా, ఇంకా అన్ని మతాలకు వర్తించే సివిల్‌ కోడ్‌ రాలేదు. ఒక్కో మతానికి ఒక్కో రకమైన వ్యక్తిగత చట్టం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజ్యాగంలోని అధికరణ 44 ప్రకారం భారత పౌరులందరికీ ఒకే రకమైన సివిల్‌ కోడ్‌ ఉండే విధంగా రాజ్యం కృషి చేయవలసి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన సివిల్‌ కోడ్‌ తీసుకురానున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే అందుకు వ్యతిరేకంగా తీవ్రమైన స్పందన వస్తుంది. ప్రత్యక్షంగా తీసుకుని రావడం కష్టం. కానీ, పరోక్షంగా అందరికీ వర్తించే విధంగ కొన్ని అంశాలతో చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ బాలల చట్టంలోని దత్తత అంశం.

పిల్లలు లేని దంపతులకు, పెళ్ళి చేసుకోని వ్యక్తులకు దత్తత అవసరం. దత్తత తీసుకోవడం వల్ల ఒక వ్యక్తికి మంచి భవిష్యత్తు ప్రసాదించే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి ఇల్లు, తల్లిదండ్రులు లేని అనాథలైతే వారికి మంచి జీవితాన్ని ప్రసాదించినట్టవుతుంది. అయితే దత్తత తీసుకోవడానికి ఒక్క హిందువుల వ్యక్తిగత చట్టాలే అనుమతిస్తాయి. మిగతా మతాలకి సంబంధించిన వ్యక్తిగత చట్టాల్లో అలాంటి నిబంధనలు లేవు.

దత్తత తీసుకునే విషయంలో లౌకిక చట్టాన్ని తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. కానీ అవి ఏవీ ఫలప్రదం కాలేదు. 1972లో పిల్లల దత్తత చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దానికి ముస్లింలనుంచి వ్యతిరేకత వచ్చింది. ముస్లింలను మినహాయించి మిగతా మతాలవారికి దత్తత చట్టం తేవడానికి ప్రభుత్వం 1980లో పిల్లల బిల్లును ప్రతిపాదించింది. దానికి పార్టీలనుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి వ్యతిరేకతల వల్ల లౌకిక దత్తత చట్టం అమల్లోకి రాకుండా పోయింది. ఈ పరిస్థితి వల్ల మిగిలిన చట్టాలు రెండే రెండు. అవి- హిందూ దత్తత మనోవర్తి చట్టం- 1956, గార్డియన్‌, వార్డుల చట్టం- 1890. హిందువులు మాత్రమే దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా మతాలకు చెందిన వారు సంరక్షకులుగా మాత్రమే ఉండే అవకాశం ఉంది.

హిందూ దత్తత మనోవర్తి చట్ట ప్రకారం హిందువులు తీసుకున్న దత్తత వల్ల ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రుల వారసత్వ హక్కులు సహజంగా వస్తాయి. దత్తత తీసుకునే విషయంలో చట్టం కొన్ని ఆంక్షలను ఏర్పరచింది. హిందువులు కాకుండా ముస్లిం, క్రైస్తవ, పార్సీ, యూదు మతాలకు చెందిన వ్యక్తులు దత్తత తీసుకునే అవకాశం లేదు. వారు సంరక్షకులుగా నియామకం కావడానికి అవకాశం గార్డియన్‌ అండ్‌ వార్డ్‌ చట్టం ప్రకారం ఉంది. అయితే ఆ వ్యక్తికి 21 సంవత్సరాలు వచ్చాక సంరక్షకుని బాధ్యత ఉండదు. అదే విధంగా వారికి వారసత్వపు హక్కులు కూడా లభించవు.

స్వాధీనం చేసిన అనాథలు, వదిలివేసిన పిల్లల విషయంలో ఆ రెండు చట్టాల్లో ఎటువంటి నిబంధనలు లేవు. దానివల్ల వారి దత్తత, సంరక్షకుని విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం బాలల చట్టంలో అధ్యాయం ఐగను చేర్చి ఇలాంటి వ్యక్తులను దత్తత తీసుకోవడానికి అవకాశం కల్పించింది. మరోరకంగా చెప్పాలంటే దత్తత విషయంలో ఇది లౌకిక చట్టం. ఇందులోని ముఖ్య విషయం ఆ చట్టం ‘దత్తత’ అనే పదాన్ని నిర్వచించి వారి హక్కులను కూడా స్పష్టం చేసింది. సె.2 (ఎఎ) ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తి తన స్వంత తల్లిదండ్రులతో శాశ్వతంగా వేరుపడి దత్తత తీసుకున్న తల్లిదండ్రుల పిల్లవాడు అవుతాడు. వారి పిల్లలకు ఉండే హక్కులు, ప్రత్యేక హక్కులు, బాధ్యతలు వారికి లభిస్తాయి. దిక్కు దివాణం లేని పిల్లలకు అవసరమైన పునరావాసాన్ని, గౌరవాన్ని ఇవ్వడం కోసం ఆ నిబంధనను ఏర్పరచారు. ఒక రకంగా ఈ నిబంధన వల్ల ప్రభుత్వం వ్యక్తిగత చట్టాల్లోకి చొరబడిందని చెప్పవచ్చు.

అనాథలు, పారేసిన పిల్లలని, స్వాధీనం చేసిన పిల్లల రక్షణను చూసే బాధ్యత పిల్లల సంరక్షణ కమిటీలకు బాలల చట్టం సంక్రమింపచేసింది. బాలలచట్ట ప్రకారం పిల్లల సంక్షేమ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. పారేసిన పిల్లలను దత్తత తీసుకోవడాన్ని కమిటీలోని ఇద్దరు సభ్యులు ప్రకటించాల్సి ఉంటుంది. స్వాధీనం చేసిన పిల్లల విషయంలో ఈ విధంగా ప్రకటించడానికి, ఆ తల్లిదండ్రులు పునరాలోచించుకోవడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. సమ్మతి చెప్పే పరిస్థితిలో ఉన్న వ్యక్తుల విషయంలో ఆ వ్యక్తి సమ్మతి తీసుకున్న తర్వాత అతన్ని దత్తత తీసుకోవచ్చునని ప్రకటించే అవకాశం ఉంది. ఇంత గురుతరమైన బాధ్యతను అప్పగించిన కమిటీకి సరైన వనరులను సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. దత్తత తీసుకునే వ్యక్తుల విషయంలో కూడా ఈ చట్టం ఉదారంగావ్యవహరించింది. వివాహంతో సంబంధం లేకుండా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. జువెనైల్‌ జస్టిస్‌ (రక్షణ, సంరక్షణ) చట్టం- 2000ని మార్పులు చేసి పిల్లల్ని రక్షించే విధంగా, పిల్లల సంక్షేమ దృష్ట్యా తయారు చేశారు. ఇది లౌకిక చట్టమని ఒప్పుకోక తప్పదు. కానీ ఈ చట్టంలో కూడా కొన్ని తప్పిదాలు దొర్లినాయని చెప్పక తప్పదు. వాటిని సరిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

వివాహం అయిన వ్యక్తి దత్తత తీసుకోవచ్చు. కాని దంపతుల్లో రెండో వ్యక్తి సమ్మతి అవసరం లేదు. ఇది హిందూ దత్తత, మనోవర్తి చట్టానికి విరుద్ధం. ఇలాంటి నిబంధన ఉండడం వల్ల భార్యా భర్తల మధ్య దత్తత విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. దత్తత తీసుకునే వ్యక్తికి, పిల్లవానికి మధ్య ఉండే వయస్సును కూడా చట్టం పేర్కొనలేదు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. హిందూ దత్తత మనోవర్తి చట్ట ప్రకారం మగవాడు ఆడపిల్లను దత్తత తీసుకున్నప్పుడు వారి మధ్య 21 సంత్సరాల భేదం ఉండాలి. అదే విధంగా స్త్రీ మగపిల్లవాడిని దత్తత తీసుకున్నప్పుడు కూడా వారి మధ్య 21 సంవత్సరాలు భేదం ఉండాలి. ఇది లేనప్పుడు పిల్లల సంక్షేమం దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Wednesday, November 9, 2011

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!





‘‘న్యాయాన్ని ఎవరికీ అమ్మం
న్యాయాన్ని ఎవరికీ నిరాకరించం
న్యాయాన్ని ఎవరికీ ఆలస్యం చేయం
న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం’’

ఏడు శతాబ్దాల క్రితం ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ జాన్‌ తన సామంతులకు న్యాయాన్ని వాగ్దానం చేస్తూ జారీ చేసిన ‘మాగ్నాకార్టా’ చార్టర్‌లోని ఈ వాక్యాలు నేటికీ చర్చనీయాంశాలు కావడం విశేషం. న్యాయసహాయం, న్యాయసేవ అన్న పదాలు ఆ వాక్యాల్లో లేకున్నా, అలాంటి అర్థం అందులో స్పష్టంగానే ఇమిడి ఉంది. న్యాయసహాయం అన్న భావన అలా అంకురించి, శతాబ్దాల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు. అందులో భాగమే, నేడు దేశంలో ప్రతి ఏడూ నవంబర్‌ 9న ‘న్యాయసేవా దినం’గా పాటించడం.

భారత రాజ్యాంగంలోని ప్రవేశిక దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తానని అభయం ఇచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు సమాన న్యాయం అందించడానికి కృషి చేయాలన్న భావన రాజ్యాంగంలోని 14, 16 అధికరణల్లో మిళితమై ఉంది. రాజ్యాంగం అమల్లోకొచ్చిన తొలిరోజుల్లో న్యాయసహాయం పట్ల అంత స్పష్టత లేకున్నప్పటికీ, 1951లో ‘జనార్ధన్‌రెడ్డి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ కేసులో సుప్రీంకోర్టు పరిమితంగానే అయినప్పటికీ ‘న్యాయసహాయం’ ఆవశ్యకతను వివరిస్తూ ‘న్యాయవాదిని నియమించుకోవడం ముద్దాయి హక్కు. అది అతను సొంతంగా లేదా బంధువుల ద్వారా గానీ నియమించుకోవచ్చు. ఆ అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత సంబంధిత మేజిస్ట్రేట్‌పై ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద మోపకున్నా, అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష విధించే కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్య క్తం చేస్తూ, న్యాయవాదిని నియమించుకోనంత మాత్రాన కోర్టులు కేసును కొట్టివేయడం కుదరదని అభిప్రాయపడింది. కాలక్రమంలో అలాంటి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడమే కాక ‘న్యాయసహాయం, న్యాయసేవలు’ అన్నవి ప్రతి పౌరుడి హక్కుగా రూపొంది ఎనలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

1978లో ‘సునీల్‌ భట్రా వర్సెస్‌ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్‌’ కేసులో జైలు నిర్బంధాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు న్యాయ సహాయం జీవించే హక్కులో భాగంగా ఉంటుం దని సుప్రీంకోర్టు గుర్తించింది. జైలు అధికారుల దగ్గర న్యాయం పొందడానికి, జైలు అధికారుల నిర్ణయాలను సవాలు చేయడానికి న్యాయసహాయా న్ని అందించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇందులో న్యాయపరమైన, పాల నాపరమైన అంశాలు ఇమిడి ఉండటం తో, 1980లో ‘హుస్సేనియార ఖాటూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌’ కేసులో ‘జైలు నుంచి విముక్తి పొందడానికి అవసరమైన న్యాయసహాయం అందించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంది’ అని సుప్రీంకోర్టు అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది.

ఉచిత న్యాయసహాయాన్ని పొందడమనేది రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటిం చినా, దేశంలోని అనేక రాష్ట్రాలు ఆ ఆదేశాన్ని సరిగా పాటించలేదనే చెప్పాలి. అందుకే, న్యాయసహాయం అందరికీ సమానంగా అందేలా కృషి జరగాలని నిర్దేశించిన భారత రాజ్యాంగంలోని 39-ఏ అధికరణం ప్రకారం, ఆ అంశంపై సమగ్ర అధయయనం కోసం భారత ప్రభుత్వం 1980లో ‘సిలాస్‌’ కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా న్యాయసహాయం అందరికీ ఒకేలా అందుబాటులోకి తేవడానికి ఆ కమిటీ విస్తృతస్థాయిలో చర్చించి నివేదికను సమర్పించింది. 1986లో మరో సందర్భంలో ‘న్యాయసహాయం కావాలని ముద్దాయి కోర్టుని అభ్యర్థించాల్సిన అవసరం లేదు. న్యాయసహాయం అందించడం కోర్టు బాధ్యత’ అని చెప్పడమే కాక, ‘న్యాయసహాయాన్ని అందించకపోవడం న్యాయాన్ని అవహేళన చేయడమే’నని వ్యాఖ్యానిస్తూ, ముద్దాయి రిమాండ్‌ దగ్గర నుంచి అప్పీలు వరకూ న్యాయసహాయాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు ‘న్యాయసేవాధికార సంస్థల చట్టం - 1987’ను ఆమోదించింది. 1987 అక్టోబర్‌ 12న గజెట్‌లో ప్రచురితమైన ఆ చట్టం ఎంతో కాలయాపన అనంతరం, 1995 నవంబర్‌ 9న అమలుకు నోచుకుంది. ముద్దాయిలకు న్యాయసహాయం అందించకుండా ఏ కోర్టు, ట్రిబ్యునల్‌, అథారిటీ గానీ విచారణ జరపడానికి వీలు లేదు. న్యాయసహాయం అందించడమన్నది సంక్షేమ చర్య కాదు. ధర్మం అంతకన్నా కాదు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం దఖలుపడ్డ ‘హక్కు’. అంతేకాదు, యోగ్యత కలిగిన న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపైనే ఉంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో న్యాయసహాయకులుగా వ్యవహరించడానికి సీనియర్‌ న్యాయవాదులు ముందుకు రావడం పరిపాటి. మన దేశంలో కూడా న్యాయసహాయాన్ని అందించడానికి పెద్ద మనసుతో విజ్ఞులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది గుర్తించాలి.

-మంగారి రాజేందర్‌, 3వ అదనపు జిల్లా జడ్జి, వరంగల్‌
(నేడు ‘జాతీయ న్యాయసేవల దినం’)

Thursday, October 27, 2011

బెయిల్ కాదిక అంత సులువు!







-విశ్లేషణ
మంగారి రాజేందర్‌అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, వరంగల్

‘‘వ్యక్తి స్వేచ్ఛ, న్యాయం, ప్రజల రక్షణ, ప్రజాధనం మీద భారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న అంశం బెయిల్.’’
- జస్టిస్ వి.ఆర్.క్రిష్ణయ్యర్,గుడికంటి నర్సింహులు కేసులో (1977)

‘‘బెయిల్ ఇవ్వడంలోనూ, నిరాకరించడంలోనూ సమాజ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నేరం సమాజానికి వ్యతి రేకంగా జరిగేదే. అందుకని బెయిల్ ఉత్తర్వు వ్యక్తి స్వేచ్ఛనూ, సమాజ హితాన్నీ సమతూకం చేసేదిగా ఉండాలి’’.
- జస్టిస్ దల్వీర్ భండారీ, ఎస్‌ఎస్ మెహ్రా కేసులో (2010)

అరెస్టు, బెయిల్ అనే పదాలు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో తరచూ కనిపిం చేవే. అందుకు కారణం ఎందరెందరో రాజకీయ ప్రముఖులు అరెస్టు కావడం, బెయిల్ రాక వారు జైళ్లలో ఉండటం. ఈ నేపథ్యంలో బెయిల్‌కు సంబంధించి న్యాయపరంగా నెలకొని ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఎస్ మెహ్రా కేసులో సుప్రీంకోర్టు ‘అరెస్టు-బెయిల్’ గురించి ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక ప్రకారం అరెస్టు చేసే అధికారం విపరీ తంగా దుర్వినియోగం అవుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులు ఈ చర్యలు చేపడుతున్నారు. కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షలు పడే అవకాశం 10 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు అరెస్టు విషయంలో కూడా పోలీసులు సంయమనం పాటించాలి. నేరం రుజువయ్యే దాకా ముద్దాయి అమాయకమైన పౌరుడు అని చెప్పే క్రిమినల్ జురిస్‌ప్రుడ్సెన్‌ను, సమాజహితాన్ని, ముద్దాయి స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.’’

బెయిల్ పొందే హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమై ఉంది. రాజ్యాం గంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టయిన వ్యక్తికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలోని హక్కులని గమనించి క్రిమినల్ కోర్టులు వ్యవహరించాల్సి ఉంటుంది. ముద్దాయిని నిర్బంధంలో ఉంచేది... అతను విచారణను ఎదుర్కొని దోషి అని తేలితే కోర్టు అతనికి విధించే శిక్షను స్వీకరించడానికేనన్నది తెలిసిందే. విచారణ సమయంలో అతను హాజరవుతాడని, నిర్బంధం అవసరంలేదని కోర్టు భావిం చినప్పుడు అతని స్వేచ్ఛను హరించడం సరైంది కాదని న్యాయ శాస్త్రకోవిదులు అభిప్రాయపడ్డారు. అందుకని బెయిల్ మంజూరు చేయాలని, రాజ్యాంగం ఆర్టికల్ 21లో ప్రసాదించిన హక్కులకు రక్షణ కల్పించాలన్నది వారి భావన. ఈ భావన మన రాజ్యాంగంలోనే కాదు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (1948)లో కూడా పొందుపరచారు.

ఆ ప్రకటనలోని ఆర్టికల్ 9 ప్రకారం - ఏ వ్యక్తినీ సరైన కారణం లేకుండా అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి, లేక దేశం నుంచి బహిష్కరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 10 ప్రకారం - తన హక్కుల గురించి, బాధ్యతల గురించి, తన మీద వచ్చిన నేరారోపణల గురించి స్వతంత్రమైన, నిష్పాక్షికమైన న్యాయ స్థానాల ద్వారా బహిరంగ విచారణ జరపాలని కోరే హక్కు ప్రతి వ్యక్తీ కలిగి ఉంటాడు. ఆర్టికల్ 11(1) ప్రకారం - నేరం ఆరోపించబడిన వ్యక్తిని నేరారోపణ రుజువయ్యే వరకు నిరపరాధిగానే పరిగణించాలి. ఆ విచారణలో ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడానికి, రక్షణలు కల్పించుకోవడానికి అవసరమైన సదుపాయాన్ని అతనికి కల్పించాలి.

బెయిల్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలో చెప్పారు. కానీ బెయిల్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. కోర్టుముందు, దర్యాప్తు చేసే అధికారి ముందు హాజరు కావడానికి ఇచ్చే సెక్యూరిటీ (జామీను)ని బెయిలని అంటున్నాం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో బెయిల్‌ని నిర్వచించలేదు కానీ సెక్షన్ 2 (ఎ)లో బెయిలబుల్ నేరాన్ని, నాన్ బెయిలబుల్ నేరాన్ని నిర్వచించారు.

బెయిల్ పొందే హక్కు ఉన్న నేరాల్లో కోర్టులు, పోలీసులు తప్పక బెయి ల్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జామీను ఇవ్వలేని పరిస్థితులలో ఉండి బెయిలబుల్ నేరాల్లో అరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్బంధంలో ఉంటే అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 436తో సవరణలు తీసుకొ చ్చారు. నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా జామీను మొత్తం ఏకపక్షంగా ఎక్కువ ఉండకూడదని, సహేతుకంగా ఉండాలని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో అభి ప్రాయపడింది. మోతీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ (1978) కేసులో అవస రమైనప్పుడు నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా వ్యక్తిగత పూచీకత్తు మీద విడు దల చేయాలని, ఆ విధంగా చట్టంలో మార్పులు తీసుకొని రావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

అన్ని రకాలైన కేసుల్లో బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టులు ఉదారంగా వ్యవహరించాలని గతంలో అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, ఇటీవలి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో విముఖతని ప్రదర్శిస్తున్నది.

1977, డిసెంబర్ 6న గుడికంటి నర్సింహులు కేసులో జస్టిస్ క్రిష్టయ్యర్ బెయిల్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ‘‘బెయిలా లేక జెయిలా?’’ అనే ప్రశ్నపై బెయిల్ ఇవ్వడం వైపు మొగ్గుచూపాలని అన్నారు. బెయిల్ మీద ఉంటే తన మీద ఉన్న ఆరోపణలని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుం ది. కస్టడీలో ఆ అవకాశం ఉండదు.

ప్రజలకి న్యాయం జరగాలంటే, యాం త్రికంగా నిర్బంధంలో ఉంచడాన్ని నిరుత్సాహపరచాలి. ఈ తీర్పు వెలువడిన రెండు సంవత్సరాల తరువాత బెయిలా లేక జైలా? అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో గురుబక్ష్ సింగ్ సిబియా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1980, ఏప్రిల్ 9) కేసులో వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తూ - అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇలా అన్నారు. ‘‘అరెస్టు అయినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది. అరెస్టయ్యే క్రమంలో అతను బెయిల్ కోరితే అతని స్వేచ్ఛను కాపాడే విధంగా బెయిల్ మంజూరు చేయాలి. ఎందుకంటే నేరం రుజువయ్యే వరకూ అతన్ని నిరపరాధిగా పరిగణించాల్సి ఉంటుంది.’’

తరువాతి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహ రించాలని న్యాయస్థానాలు పలుమార్లు ఘోషించాయి. భగీరత్‌సింగ్ జడేజా, కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.ఎ.దేశాయ్ నవంబర్ 21, 1983న ఇలా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వడం వైపే కోర్టులు ఇటీవలి కాలంలో మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు పరిశీలిం చాల్సిన అంశం ఆ వ్యక్తి విచారణ సమయంలో అందుబాటులో ఉంటాడా... లేదా? సాక్ష్యాలను తారుమారు చేయడానికి స్వేచ్ఛను దుర్వినియోగపరు స్తాడా?’’ ఈ విషయాలను కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. ఉదారంగా బెయిల్ మంజూరు చేసే ధోరణి కొంత కాలం కొనసాగినా తరువాత పరిస్థితి మారుతూ వచ్చింది. 1990 దశకంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న తరువాత చంద్రస్వామికి బెయిల్ మంజూరయ్యింది. అప్పటికి 16 సంవత్సరాల క్రితం జరిగిన నేరానికి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. 1996లో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్మ, కిర్వాల్ ఈ విధంగా అన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తులను విడుదల చేయడం ద్వారా ప్రాసిక్యూషన్ కేసును ఇరుకునపెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు’’.

నాన్ బెయిలబుల్ నేరానికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో మూడు ప్రధానమైన నిబంధనలు ఉన్నాయి. అవి సెక్షన్ 437, 438, 439. ముం దస్తు బెయిల్ గురించిన నిబంధన 438 కాగా, మిగతా రెండు అరెస్టు అయిన తరువాత బెయిల్ మంజూరు చేసే నిబంధనలు. హైకోర్టు, సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసే నిబంధన సెక్షన్ 439. మేజిస్ట్రేట్లు, కొన్ని సందర్భాల్లో పోలీసులు బెయిల్ మంజూరు చేయడానికి ఉన్న నిబంధన సెక్షన్ 437. మహి ళలకు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు, దుర్భలంగా ఉన్న వ్యక్తులకు ఉదారంగా బెయిల్ మంజూరు చేయాలని సెక్షన్ 437 చెబుతుంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టుల ధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. నేరాల తీవ్రత ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఈ కొత్త ధోరణికి కారణమైన కేసులు చాలా ఉన్నప్పటికీ అందులో ప్రధానమైన కేసు ‘సత్యం కంప్యూటర్స్’ ప్రమోటర్ రామలింగరాజు బెయిల్ రద్దు కేసు.

2010, అక్టోబర్ 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్వీర్ భండారి, దీపక్ శర్మలు బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్లని ఆమోదిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారం ముద్దా యిలు చాలా ఘనమైన కార్పొరేట్ స్కామ్‌లో భాగస్వాములు. దాని వల్ల మన దేశంలో, ప్రపంచంలో కూడా ఆర్థిక తుపాను సంభవించింది. లక్షల మంది షేర్ హోల్డర్స్ మోసపోయారు. దేశ పరువు ప్రతిష్టలు మంటగలిశాయి. కేసు విచా రణలో ఉండగా మేం ఎలాంటి పరిశీలన చేయడం భావ్యం కాదు. దాని వల్ల విచారణ కోర్టు పక్షపాతానికి లోనుకాకూడదు. హైకోర్టు మంజూరు చేసిన బెయి ల్‌ను రద్దు చేసే విషయంలో సాధారణంగా ఈ కోర్టు (సుప్రీంకోర్టు) స్థిమితంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ని రద్దు చేస్తున్నాం’’.

అయితే 2010 డిసెంబర్‌లో మళ్లీ సిద్దారామ్ మెత్రే వర్సెస్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్బీర్ భండారీ, కె.పి.రాధాక్రిష్ణన్ హత్యకేసు లోని ముద్దాయి సిద్దారామ్ మెత్రే ముందస్తు బెయిల్‌ని ఆమోదిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అతి విలువైన ప్రాథమిక హక్కు.

అసా ధారణమైన పరిస్థితులు కేసులో ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛని నియంత్రిం చాలి’’. సమాజ హితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను సమతూకంగా చూడటం అంత సులువు కాదు. బెయిల్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. చివరగా రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడి చేసిన అభిప్రాయాలను ఇక్కడ మననం చేసుకుందాం. గురుబక్ష్‌సింగ్ కేసు (1980, ఏప్రిల్ 9)లో న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ విధంగా అన్నారు.

‘‘బెయిల్ వంటి విచక్షణా ధికారం ఉండే అంశాల్లో కచ్చితమైన సూత్రాలను ఏర్పరచడం సాధ్యం కాదు’’. అదేవిధంగా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో న్యాయమూర్తులు భగవతి, కోషల్ ఇలా అన్నారు. ‘‘ప్రజల పట్ల బాధ్యత వహించి అధికసంఖ్యలో కోర్టులను నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వా లపై ఉంది’’. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 సత్వర విచారణ, సత్వర దర్యాప్తులకు కట్టుబడి ఉంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొంటే తప్ప అందరికీ న్యాయం జరగదు.

Wednesday, September 14, 2011

హకుల పరిరక్షణ కోర్టుల బాద్యత

కోర్టుల్లో పనిభారం ఎక్కువ. విచారణ జాప్యం. కేసుల్లో శిక్షలు పడకపోవడం. ముద్దాయిలు శిక్షల నుంచి తప్పించుకుపోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది న్యాయవ్యవస్థను నిందించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఆ విమర్శలో ఎలాంటి సహేతుకతలేదు. కోర్టుల్లో కేసులు రుజువు కాకపోవడానికి, తక్కువ కేసుల్లో శిక్షలు పడటానికి, కేసుల విచారణల్లో జాప్యం జరగడానికి కారణాలు ఎన్నో. కేసుల దర్యాప్తులోని లోపాలు, ప్రాసిక్యూషన్ కేసుని సరిగ్గా నిర్వహించకపోవడం, సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం లాంటి కారణాలు ఎన్నో కోర్టుల్లో కేసులు విఫ లం కావడానికి కారణమతున్నాయి.తమ పరిధిలో ఉన్న అంశాల మీద న్యాయమూర్తుల నిర్వహణని బేరీజు వేసుకొని విమర్శలు చేస్తే దాన్ని సద్విమర్శ అనుకోవచ్చు. ఆ విధంగా గాకుండా కోర్టు నియంవూతణలోలేని అంశాలను ఆధారం చేసుకొని న్యాయమూర్తులని, న్యాయవ్యవస్థని విమర్శించడం సరైంది కాదు. దేశ న్యాయవ్యవస్థలో భాగస్వాములైన యంత్రాంగాల సమష్టి నిర్వహణే కేసుల్లో వచ్చే చిక్కులు. అవి శిక్షలు పడ డం కావచ్చు. శిక్షలు పడకపోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే ఉన్న విధులు ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కొన్ని విధులను న్యాయమూర్తులు మాత్రమే నిర్వహిస్తారు. అవి న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే వుంటాయి. అందులో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని ఇతర భాగస్వాముల ప్రమే యం ఉండదు. అందులో ముఖ్యమైనది హక్కుల పరిరక్షణ. అవి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులు కావ చ్చు. ఇతర శాసనాల ద్వారా నిర్వహించిన హక్కులు కావచ్చు.

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు, నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. అప్పు డు ఎలాంటి అవరోధాలు లేవు. వాళ్లకు తోచింది చేసే అవకాశం ఉండేది. అనుమానం మీద నేరారోపణల మీద శిక్షలు విధించే అవకాశం ఏర్పడింది. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండాపోయింది. నిరంకుశత్వం పెరిగింది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215 సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ‘ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా తన వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్షులు లేకుండా ఏ అధికారి కూడా ఏ వ్యక్తిని భవిష్యత్తులో విచారణకు నిలబెట్టకూడదు. ఎవరి స్వేచ్ఛనైనా హరించాలంటే దానికి న్యాయబద్ధమైన తీర్పు ఉండాలి.’
మాగ్నాకార్టాలో పొందుపరిచిన విషయాలకు మన రాజ్యాంగ కర్తలు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయాలను పొందుపరుస్తూ అధికరణలను ఏర్పాటు చేశారు.

అవి అధికరణం 20, 21, 22. అధికర ణం 20 ప్రకారం అమలులో ఉన్న శాసనాల ప్రకారం ఏదైనా చర్య నేరమైనప్పుడు మాత్రమే ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. అంతే అది నేరం కానప్పుడు శిక్షించడానికి వీల్లేదు. ఆ నేరం చేసినప్పుడు, ఆ వ్యక్తికి అమల్లో ఉన్న శాసనాల ప్రకారం ఎంత శిక్ష అయితే విధించడానికి అవకా శం ఉందో అంతే శిక్షను విధించాలి. అంతకన్నా ఎక్కువ శిక్షను విధించడానికి వీల్లేదు. ఎవరైనా వ్యక్తిపై అభియోగం మోపబడి శిక్ష పడిన తర్వాత మళ్లీ అదే నేరానికి రెండవసారి అభియోగం దాఖలు చేయడానికి వీళ్లేదు. ఆర్టికల్ 21 శాసనం ప్రకారం నిర్ణయించిన పద్ధతుల్లో తప్ప, ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 22 ప్రకారం-ఎవరైనా వ్యక్తి ఈ భూభాగంలోని సాధారణ శాసనాల ప్రకారం అరెస్టు అయినప్పుడు అరెస్టు చేసిన వెంటనే ఏ కారణాల ప్రకారం అరెస్టు చేశారో ఆ విషయం అతనికి తెలియజెయ్యాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం కల్పించాలి.

అరెస్టు చేసిన 24 గంటల్లో దగ్గర్లో ఉన్న మెజివూస్టేట్ ముందు హాజరు పరచాలి. అరెస్టు అయిన స్థలం నుంచి మేజివూస్టే ట్ కోర్టు వరకు తీసుకురావడానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటలని అర్థం చేసుకోవాలి. మేజివూస్టేట్ ఉత్తర్వులు లేకుండా అరెసై్టన వ్యక్తి 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు.
దేశంలో ఆమాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వతంవూతమైన న్యాయవ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధం లేకుండా న్యాయవ్యవస్థ వుంది. ఈ వ్యవస్థ దేశ పౌరులకు, ముద్దాయిలకు, అనుమానితులకు, బాధితుల కు, సాక్షులకు రాజ్యాంగం ద్వారా వివిధ శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల హక్కులకు సంరక్షకునిగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అందుకే ఈ వ్యవస్థ మీద అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉంది. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. హక్కులను కాపాడటం కోర్టుల మీద ఉన్న ప్రాథమిక బాధ్యత. హక్కులను, బాధ్యతలను కోర్టులు భారతీయ సాక్ష్యాధారాలు చట్టం ప్రకారం నిర్ధారించాలి. రాజ్యాంగం ద్వారా, శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేసిన శాసనం ద్వారానే నియంవూతించాల్సి ఉంటుంది. తొలగించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తుల మౌలికమైన హక్కు. స్వతంవూతమైన న్యాయవ్యవస్థ నిర్వహించాల్సిన విధి ఇదే.

వ్యక్తుల హక్కులను కాపాడటం, శాసనం నిర్దేశించిన పద్ధతిలో శిక్షలు విధించడం ద్వారా ప్రజల హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ చేయాల్సిన ప్రాథమికమైన విధి. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాత పూర్వకమైన రాజ్యాంగం ఉన్న మన దేశంలో నేరస్తులను శిక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. నేరం చేసిన వ్యక్తులని శిక్షించడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత కాదు. పోలీసులది అంత కంటే కాదు. రాజ్యాంగం రాక ముందు కొన్ని శతాబ్దాలుగా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ పని చేసింది. ఇప్పుడు చేయకూడదు. చేసే అవకాశం లేదు. చేయకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తిపై ఉంది. ముద్దాయిలను అరెస్టు చేసి మేజివూస్టేట్ మందు హాజరు పరుస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్ష న్ 57 ప్రకారం 24 గంటలు పూర య్యే వరకు ముద్దాయిలను తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవకా శం లేదు. కేసు దర్యాప్తుకు ఎంత కాలం అవసరం ఉందో అంత కాలం మాత్రమే తమ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది. అది కనిష్ఠ కాలపరిమితి.

24 గంటలు అనేది గరిష్ఠ కాలపరిమితి. అదే చట్టంలోని సెక్షన్ 50 ఎ ప్రకారం అరెస్టు చేసిన సమయాన్ని అరెసై్టయిన వ్యక్తి స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలి. ఏడేళ్లకు తక్కువ శిక్ష విధించే అవకాశం కేసుల్లో, అదే విధంగా ఏడేళ్లవరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో సెక్షన్ 41లో చేర్చిన కొత్త నిబంధనల ప్రకారం అరెస్టు చేయకూడదు. అరె స్టు చేస్తే వాటి చట్టంలో చెప్పిన కారణాలు వున్నాయో లేదో చూడా లి. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే, అదృశ్యం అయితే దానికి గురించి సెక్షన్ 176 ప్రకారం మేజివూస్టేట్ విచారణ జరగా లి. అక్రమ నిర్బంధం ఉన్నప్పుడు సెక్షన్ 97 ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రథమ సమాచార నివేదిక నుంచి చార్జిషీట్ దాఖలు అయ్యే వరకు మేజివూస్టేట్ పర్యవేక్షణ ఉంటుంది. జోక్యం ఉండదు.

హక్కుల పరిరక్షణ బాధ్యత ఆ తరువాత మిగతా కోర్టుల మీద ఉంటుంది. హక్కులు వ్యాఖ్యానించేటప్పుడు కూడా క్రియాశీలంగా వ్యవహరించి వ్యాఖ్యానించాలి. అంతే కానీ సాంకేతికంగా కాదు. క్రిమినల్ న్యాయ పరిపాలనలో రాజ్యాంగం విలువల్ని పరిరక్షిస్తూ వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. ఈ బాధ్యతను నిర్వహించనప్పుడు కోర్టులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ హక్కులు ముద్దాయిలవి కావొచ్చు, అనుమానితులవి కావొచ్చు, సాక్షులవి కావొచ్చు, బాధితులవి కావొచ్చు.

-మంగారి రాజేందర్

Thursday, August 4, 2011

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!
-విశ్లేషణ
మంగారి రాజేందర్, మూడవ అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ద్విగుణీకృతం చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్య కాలంలో రెండు ప్రధానమైన కేసుల్లో మరణశిక్షలు విధించడాన్ని ఖరారు చేసింది. అందులో మొదటిది ‘పరువు’ హత్యలకు చెందినది కాగా, రెండవది ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించినది. ఈ రెండు రకాల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ తీర్పులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి . పరువు హత్యలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేంద్రం ప్రతిపాదిస్తున్న నేపథ్యం కూడా ఒక సందర్భం. ఎన్‌కౌంటర్ హత్యలను నేరాలుగా నమోదుచేసి దర్యాప్తు చేయాలన్న వాదన గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది. వాటిని హత్యా నేరాలుగా నమోదు చేయాలని చట్టాలు నిర్దేశిస్తున్నప్పటికీ దర్యాప్తు ఆ వెలుగులో జరగడం లేదన్నది ప్రధాన విమర్శ.

‘భారత శిక్షాసృ్మతి’ ప్రకారం ఆరు రకాలైన నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవి- ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారన్న నేరారోపణలో (సెక్షన్ 121), సిపాయిలను రాజ్యంపై తిరగబడేలా ప్రేరేపించినపుడు (సె.132), మరణశిక్ష పడేలా తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు (సె.194), హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు (సె.302), 18 సంవత్సరాలు నిండని వారినీ, మానసిక రుగ్మతలున్న వారినీ ఆత్మహత్యకు ప్రేరేపించినపుడు (సె.305), దోపిడీకి పాల్పడుతూ హత్యగావించినప్పుడు (సె.396). కొన్ని సందర్భాల్లో ఎవరినైనా చంపడానికి ప్రయత్నించినపుడు సెక్షన్ 307 ప్రకారం కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే, ప్రత్యేక చట్టాల్లో కూడా అలాంటి శిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే ఈ నేరాలన్నింటిలో కూడా నేరం రుజుైవె నప్పటికీ మరణశిక్ష విధించాలన్న నియమం లేదు. కేసులోని తీవ్రతనుబట్టి జీవితఖైదు గానీ, మరణశిక్ష గానీ కోర్టులు విధిస్తాయి. కానీ జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఎవరినైనా చంపితే, సెక్షన్ 303 ప్రకారం విచారించి నేరం రుజువైతే వారికి కోర్టులు విధిగా మరణశిక్షను విధించాల్సి ఉంటుంది.

ఇలాంటి నేరాల్లో మరణశిక్ష విధించడం సహేతుకం కాదని అనడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదనీ, ప్రజాహితం కోసం ఈ శిక్ష ఉండాల్సిందేననీ, ఇది రాజ్యాంగంలోని జీవించే హక్కుకు వ్యతిరేకం కాదనీ గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గుర్తుచేయడం గమనార్హం. బచన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో దీన్ని మరింత స్పష్టంగా ప్రకటించింది . క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354 ప్రకారం హత్యానేరం రుజువైన వ్యక్తులకి జీవిత ఖైదు శిక్ష విధించడమనేది నియమంకాగా, మరణశిక్ష కూడా విధించవచ్చన్నది మినహాయింపు. అయితే సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్ష విధించడానికి గల ప్రత్యేకమైన కారణాలను తీర్పులో పేర్కొనాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కొలబద్దల్ని కూడా సుప్రీంకోర్టు బచన్‌సింగ్ కేసులో స్పష్టపరుస్తూ, మార్గదర్శకాలను నిర్దేశించింది (ఏఐఆర్ 1983 సుప్రీంకోర్టు 957).

అవి ప్రధానంగా- హత్య జరిగిన తీరు, నేరం జరగడానికి కారణం, సాంఘికంగా తిరస్కరించే విధంగా ఉన్న నేరాలు, నేర తీవ్రత, హత్యకు సంబంధించిన బాధితుల వ్యక్తిత్వం. అలాగే దుర్మార్గంగా, అస్వాభావికంగా, పైశాచికంగా, పిరికితనంగా లేక మోసపూరితంగా చంపినప్పుడు మరణశిక్ష విధించవచ్చు. ఉదాహరణకు- బాధితుడు నిప్పులో కాలి చనిపోవాలన్న ఉద్దేశంతో అతని ఇంటికి నిప్పు పెట్టి చంపినప్పుడు, బాధితులు చనిపోవాలని అతన్ని చిత్రహింసల పాల్జేయడం, అమానవీయంగా ప్రవర్తించడం, బాధితుల శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం లేక ఛిన్నాభిన్నం చేసి పైశాచికంగా ప్రవర్తించడం.

ఎన్‌కౌంటర్ మరణాల్లో, పరువు హత్యల్లో ఈ అంశాలు లేకపోవచ్చు. కానీ, ఈ నేరాలను కూడా సుప్రీంకోర్టు అరుదైన వాటిల్లో అరుదైనవిగా పరిగణించి మరణశిక్షలను ఖరారు చేసింది. ఎన్‌కౌంటర్ మరణాల పేరుతో అమాయకులను చంపే అధికారులకు ఒక హెచ్చరికగానూ, వెనుకంజవేసే విధంగానూ ఈ తీర్పులు తోడ్పడతాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా పరువు, ప్రతిష్టల పేరుతో నేడు జరుగుతున్న హత్యలని నిరోధించడానికి కూడా ఈ తీర్పులు దోహదపడతాయని భావించవచ్చు.

ప్రకాశ్ కదమ్ మరి ఇతరులు వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా మరి ఇతరులు (క్రిమినల్ అప్పీలు నంబరు 1174-1178 / 2011) కేసులో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసులో అరుదైనవిగా అభివర్ణించింది. ముంబైలో ప్రకాశ్ కదమ్ అనే పోలీసు అధికారి నేతృత్వంలో ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి కోసం అతని మిత్రుణ్ణి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. ఈ కేసులో అక్కడి సెషన్స్ కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీనిపై పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసుల్లో అరుదైనవిగా అభివర్ణించింది. ఆ నేర తీవ్రతను సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే-

‘‘ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులని చంపడం అతి హేయమైన నేరం.

ఈ నేరాన్ని కూడా అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. పోలీసు అధికారి నేరం చేశాడని రుజువైతే అతనికి మరణశిక్షను విధించాలి. మామూలు వ్యక్తి హత్య చేస్తే అది మామూలు హత్య. కానీ పోలీసు అధికారి చేస్తే, అది అతని విద్యుక్త ధర్మానికి వ్యతిరేకమైనది. సమాజంలో శాంతిభద్రలు కాపాడే విధంగా విధులను నిర్వర్తించాల్సిన వ్యక్తి వాటికి విఘాతం కలిగించినప్పుడు అతనికి మరణశిక్షే సరైన శిక్ష’’.తన పైఅధికారి చంపమని ఆదేశిస్తే ఎన్‌కౌంటర్ పేరుతో చంపకూడదు. దాన్ని తిరస్కరించాలి. ఆ విధంగా చేయనప్పుడు అతనికి మరణశిక్ష విధించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంటూ న్యూరెంబర్గ్ విచారణలను ఉదహరించింది. ‘‘ఆ విచారణల్లో ‘ఉత్తర్వులు ఉత్తర్వులే’ అని అధికారులు డిఫెన్స్ తీసుకున్నప్పటికీ ‘నాజీ’ అధికారులకు మరణశిక్షని విధించారు’’.

బూటకపు ఎన్‌కౌంటర్లంటే దారుణమైన హత్యలనీ, చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఉల్లంఘనలకు పాల్పడటం తగదని అభిశంసించింది. సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులే కిరాయి రౌడీలుగా మారి హతమార్చడం అత్యంత హేయమైన విషయమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక వ్యక్తిని చంపుతున్న పోలీసులు, మరో వ్యక్తిని రక్షించడానికి సాక్షులను కూడా చంపరన్న గ్యారంటీ ఏమిటి? అని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రశ్నించింది. తమని రక్షించుకోవడం కోసం తమ బంధువులని కూడా వాళ్లు చంపగలరని కోర్టు తీవ్రంగా స్పందించింది. సొహ్రాబుద్దీన్, ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసుల నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఇక పరువు హత్యలను కూడా అరుదైన కేసుల్లో అరుదైన వాటిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు భగవాన్‌దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, క్రిమినల్ అప్పీలు నంబరు 1117/11 కేసులో స్పష్టం చేసింది. ఈ కేసులోని విషయాలకు వస్తే, భగవాన్‌దాస్ తన సొంత కూతురినే చంపేశాడు. కూతురు భర్తను వదిలిపెట్టి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందన్న కోపంతో, అతను కుటుంబం పరువు పోయిందని ఆమెని చంపేశాడు. పరువు హత్యలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ పోలీసుల రక్షణలో బతుకుతున్నారు. ఏ కారణాలతో ఈ హత్యలు చేసినప్పటికీ, వీటిని అరుదైన కేసుల్లో అరుదైనవిగా బావించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అహంకారపూరితమైన, హీనమైన ఈ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. మేజరైన వ్యక్తులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే అధికారం ఉంది. పరువు ప్రతిష్టల పేరుతో ఈ హత్యలకు పాల్పడే వ్యక్తులు తమకు ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం గమనిస్తే మంచిదని సుప్రీంకోర్టు తీర్పులో హెచ్చరించింది.

బూటకపు ఎన్‌కౌంటర్‌లను, పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా భావించి మరణశిక్షని విధించాలని సుప్రీంకోర్టు ఈ రెండు తీర్పుల్లో నొక్కి చెప్పింది. బచన్‌సింగ్ కేసులో నిర్దేశించిన అంశాలకి మరో రెండు కొత్త అంశాలును జతచేయడం హర్షించదగిందే. పరువు హత్యల కన్నా, ఎన్‌కౌంటర్ హత్యల్లో కేసు నమోదు అవడం చాలా కష్టం. పొరపాటున నమోదైనా పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చెయ్యాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 132, 197 ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికే సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో అనుమతి రాక ఎన్నో కేసులు మూలన పడుతున్నాయి. వచ్చినా వాటి పరిష్కారానికి ఎంత కాలం పడుతుందో కళ్ల ముందు కనిపిస్తున్నదే. అలాగని నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాజ్యాంగలోని జీవించే హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. చట్టం నిత్యనూతనమైంది. కాలానుగుణంగా అది మార్పు చెందుతుంది. కోర్టుల వ్యాఖ్యానాలు కూడా దానికి దోహదపడతాయి. ఆ నేపథ్యంలో వచ్చినవే ఈ రెండు తీర్పులన్నది గుర్తించాలి.

బూటకపు ఎన్‌కౌంటర్లకి పాల్పడే వ్యక్తులు ఒక్క విషయం గమనంలో ఉం చుకోవాలి. ముంబైలో రాజ్‌బీర్‌సింగ్ అనే పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ప్రతీతి పొందాడు. రాష్ట్రపతి గేలంటరీ అవార్డు కూడా వచ్చింది. అతనికి రియల్ ఎస్టేట్ వ్యక్తులతో తెరచాటు సంబంధాలు ఉన్నాయన్నది ఆరోపణ.

అతన్ని మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్చిచంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్ పోలీసు అధికారి కూడా రాలేదనీ, కనీసం ఒక్క పుష్పగుచ్ఛానికీ నోచుకోలేదనీ విన్నప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ దేశంలో అది సాధ్యమా అని! సీనియర్లందరూ గతంలో అతన్ని అభినందించిన వారే. ఈ సంఘటనతోపాటు, సుప్రీంకోర్టు తీర్పుని కూడా దేశంలోని పోలీసులంతా ఒక బాధ్యతగా సంయమనంతో అధ్యయనం చేయగలిగితే భవిష్యత్ సమాజం వారికి నీరాజనాలు పడుతుందనడంలో సందేహం లేదు!

Friday, January 28, 2011

గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం

బెయిలు లేదిక అంతా బయలే!
గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం
విశ్లేషణ...29-1-2011 saakshi

ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంతో కీడూ అంతే.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ ‘అరెస్టు’కి సంబంధించిన ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సవరణల) చట్టం-2010’ గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ తెరపైకి రావడం వివాదంగా మారుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2008’ని రూపొందించింది. అయితే, దేశ వ్యాప్తంగా న్యాయవాదులు, మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రధానంగా 5, 6 (అరెస్టుకి సంబంధించినవి), 21 (బి) తప్ప మిగిలినవి అమల్లోకి వచ్చేవిధంగా ప్రకటన జారీ చేసింది. అరెస్టు నిబంధనలు మినహా ఆ చట్టం 2009 డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తరువాత వివిధ వర్గాలతో చర్చలు జరిపి అరెస్టుకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-2010’ రూపంలో ఆ సవరణలను చట్టంగా తీసుకొచ్చింది. ఈ సవరణలతో కూడిన కొత్త చట్టం 2010 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2010 నవంబర్ 1న ఎస్.ఓ.నెం.2689(ఇ)ను జారీ చేస్తూ, భారత గెజిట్‌లో ప్రచురించింది. ఎంతో వివాదాస్పదమైన అరెస్టుకు సంబంధించిన ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి కానీ, వాటి గురించి ప్రజలకి తెలియజేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిం చలేదు. ఎలాంటి అలికిడీ లేకుండా ఇవి అమల్లోకొచ్చాయి. గతంలో అన్ని వర్గాల వారు వ్యతిరేకించిన సవరణలు, నేడు ప్రజలకి, న్యాయవ్యవస్థకి ఏ మేరకు మేలు చేస్తాయన్న విషయాన్ని చర్చించవలసిన అవసరం ఉంది.

న్యాయశాస్త్ర పరిభాషలో ప్రతి నిర్బంధం అరెస్టు కాదు. వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయే విధంగా చేయడం అరెస్టు అవుతుంది. కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను పోలీసులు ఎలాంటి వారంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నేరానికి సంబంధించి ఎవరిపైనైనా సహేతుకమైన ఫిర్యాదు అందినప్పుడు లేదా విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. అనుమానంపై కూడా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే అరెస్టుకు దారితీసే సందర్భాలను చట్టం స్పష్టంగానే నిర్దేశించింది. కేసు విచారణ సమయంలో ముద్దాయి హాజరు కాడన్న అనుమానం ఉన్నప్పుడు; హత్య, రేప్, బందిపోటు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులతో సమాజంలో భయాందోళనలు నెలకొన్నప్పుడు అరెస్టు అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో నేరస్తుని ప్రాణాలు రక్షించడానికి కూడా అరెస్టు తప్పదు. నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయకుండా, సహ ముద్దాయిలకు వార్నింగ్ ఇవ్వకుండా, మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా అరెస్టు అవసరమవుతుంది.

ఇన్ని జాగ్రత్తలతో కూడిన నిబంధనలు ఉన్నప్పటికీ, అరెస్టుల విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అపవాదు తప్పలేదు. జాతీయ పోలీస్ కమిషన్ మూడవ నివేదికలో అక్రమ అరెస్టుల గురించి ఆందోళనను వెలిబుచ్చడం గమనార్హం. పోలీసులు చేస్తున్న అరెస్టుల్లో 60 శాతం అనవసరమైనవి, న్యాయబద్ధత లేనివని, వీటివల్ల జైళ్ల నిర్వహణా ఖర్చు పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. లా కమిషన్, మలిమత్ కమిటీ నివేదికలు కూడా అనవసర అరెస్టుల గురించి ప్రస్తావించాయి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అరెస్టులు, కస్టోడియల్ హింసపై ఆందోళన వెలిబుచ్చింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41కి సవరణలు తీసుకొస్తూ 2008లో చట్టాన్ని రూపొందించింది. అయితే ఆ సవరణలపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో, అవి అమల్లోకి రాలేదు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు అరెస్టు సవరణలను వ్యతిరేకించారు. ఈ సవరణలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొందరు సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం, 2008 చట్టం ద్వారా తీసుకొచ్చిన సవరణలను తప్పుగా అర్థం చేసుకుంటున్నార ంటూ హితవు పలికి, వాటిని స్వాగతించింది. దేశపౌరుల కష్టాలను, వేదనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలని వ్యతిరేకించకూడదని కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది. ఈ సవరణల మంచి చెడ్డలను చర్చిండానికి భారత ప్రభుత్వం 2009 ఆగస్టులో ఒక సమావేశాన్ని నిర్వహించి, కొన్ని నిబంధనలపై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఆ తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2010ని తీసుకొచ్చింది. ఈ సవరణలు నవంబర్ 2, 2010 నుంచి అమలులోకి వచ్చాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41 సబ్‌సెక్షన్ (1)లో ఉన్న ఎ, బి సబ్ క్లాజ్‌లను తొలగించి, ఈ సవరణల ద్వారా వాటికి ప్రత్యామ్నాయాలను ఏర్పరచారు. అదేవిధంగా (బి, ఎ) అన్న క్లాజ్‌ని 41ఎ, 41బి, 41సిలుగా ఏర్పరచారు. ముందుగా తొలగించిన క్లాజ్‌ల వివరాలను పరిశీలిస్తే, సె.41 ప్రకారం వారంట్ లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు.

ఆ సందర్భాలు-
ఎ) కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తిని, లేదా ఏ వ్యక్తికి వ్యతిరేకంగానైతే సముచితమైన ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని లేదా విశ్వసనీయ సమాచారం లేదా సముచితమైన అనుమానం ఉన్నప్పుడు (వారికి కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉందని అన్పించినప్పుడు);
బి) ఇళ్లకు కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు ఎవరైనా కలిగి ఉన్నప్పుడు (అవి కలిగి ఉండటానికి శాసన సమ్మతమైన కారణం ఉన్నదని రుజువు పరచుకునే బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది).

సవరణకు ముందు ఈ రెండు క్లాజుల ద్వారా పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేయడానికి విశేషమైన అధికారాలు ఉండేవి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం- ‘ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు చాలా ఉన్నాయి. వాస్తవంలో అవి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. ఈ రెండు క్లాజ్‌ల గురించి లా కమిషన్ 177వ నివేదికలో చర్చించింది’ అని వ్యాఖ్యానించారు.

కాగ్నిజబుల్ నేరం చేశాడన్న అనుమానం వచ్చినప్పుడు, ఆ నేరంతో సంబంధం ఉన్నప్పుడు, కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తినైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే, ఇళ్లకి కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు అంటే ఏమిటి? పనిముట్ల్లు కలిగివున్న వ్యక్తులనూ ఆ నెపం మోపి పోలీసులు అరెస్టు చేయవచ్చుకదా అన్న అనుమానం రాకతప్పదు. ఈ రెండు క్లాజ్‌ల ద్వారా పోలీసులకు అపరిమితమైన ఆధికారాలు లభించాయన్నది ప్రధాన విమర్శ. అందుకని ఈ రెండు క్లాజ్‌లను తొలగించి, కొత్త నిబంధనలతో వాటి స్థానంలో 2010 సవరణల చట్టం తీసుకొచ్చారు.

దాని ప్రకారం-
41 (1)(ఎ) పోలీసుల సమక్షంలో కాగ్నిజబుల్ నేరం చేసినప్పుడు;
(1)(బి) 7 సంవత్సరాల వరకు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షపడే అవకాశం ఉన్న నేరం చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా సముచితమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, నేరానికి సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందినప్పుడు లేదా సహేతుకమైన అనుమానం కలిగినప్పుడు, ఈ షరతుల పట్ల సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాగ్రత్తలూ పాటించాలి. 1) ఆ వ్యక్తి ఆ నేరం చేశాడనటానికి గట్టి ఆధారం ఉండాలి. (2) ఆ అరెస్టు, కింద పొందుపరచిన కారణాల వల్ల అవసరమని పోలీసు అధికారి సంతృప్తి చెందాలి.

అవి-
- ఆ వ్యక్తి తిరిగి అలాంటి నేరం చేయకుండా నిరోధించడానికి;
- దర్యాప్తు నిరాటంకంగా కొనసాగడానికి;
- సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండటానికి;
- సాక్షుల విషయంలో జోక్యం చేసుకోకుండా చూడటానికి;
- ఆ వ్యక్తిని అరెస్టు చేస్తే తప్ప కోర్టు ముందు హాజరుపెట్టలేమని భావించినప్పుడు.

ఈ కొత్త నిబంధనల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను, అదేవిధంగా 7 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న వ్యక్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయాలి. అది కూడా తగు కారణాలను నమోదు చేసిన అనంతరమే అరెస్టు చేయాలి. దీంతో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498-ఎ (వేధించడం), 379 (దొంగతనం) వంటి కేసుల్లో అరెస్టులకు అవకాశం ఉండదు. మోసం, నమ్మక ద్రోహం వంటి కేసుల్లో కూడా అతి కష్టంగా అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్టు చేసినప్పుడు, అదేవిధంగా అరెస్టు చేయనప్పుడు కూడా తగు కారణాలను పోలీసులు నమోదు చేయాలి. ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంత ఉందో కీడూ అంతే ఉంది.

అరెస్టు చేయకుండా పోలీసులు దర్యాప్తు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని అధిగమించడానికి సె.41(ఎ)ని కూడా చట్టం లో పొందుపరిచారు. సె.41(1) ప్రకారం అరెస్టు చేయనప్పుడు, ముద్దాయిలు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులో చెప్పిన ప్రకారం నేరస్తులు పోలీసు అధికారి నిర్దేశించిన ప్రదేశంలో హాజరుకావాలి. దాని ప్రకారం హాజరైతే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీల్లేదు. అయితే , ఆ వ్యక్తిని కూడా యోగ్యతగల కోర్టు అనుమతి తీసుకుని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

ఈ కొత్త నిబంధనల ద్వారా పోలీసులకు గతంలో ఉన్న విశేష అధికారాలను తొలగించి, నోటీసు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. కానీ దాన్ని పోలీసులు ఆయుధంగా వాడుకుని నేరస్తులను వేధించే అవకాశం ఉంది. దీని నియంత్రణకి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే నోటీసుని ఉల్లంఘించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటే యోగ్యతగల కోర్టు ఉత్తర్వుల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. యోగ్యత గల కోర్టు ఏదీ అన్నది స్పష్టంగా చెప్పలేదు. అది సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, నోటీసును పాటిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి అవసరంలేదు. అందుకు గల కారణాలను నమోదు చేస్తే సరిపోతుంది. అరెస్టు స్ఫూర్తికి ఇది విరుద్ధం. నోటీసు పేరుతో ముద్దాయిలపై పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 157 ప్రకారం దర్యాప్తులో చివరి దశ అరెస్టు. మొదటి దశ ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడం. నేరస్థలాన్ని సందర్శించడం రెండవ దశ. కేసుకి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం మూడవ దశ. చివరి దశ- ముద్దాయిని అరెస్టు చేయడం. అది కూడా అవసరమైతేనే. కానీ ముద్దాయిని అరెస్టు చేయడం మొదటి దశగా మారింది. సె. 41 ఆధారంగా అక్రమ అరెస్టులు, అనవసర అరెస్టులు కొనసాగేవి. ఈ సవరణల ద్వారా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేసే అవకాశం తగ్గవచ్చు. ఈ కొత్త నిబంధనలు పోలీసు కమిషన్, లా కమిషన్‌ల నివేదిక, డీకే బసు కేసు తీర్పు ఆధారంగా రూపొందాయి. వీటివల్ల పోలీసుల అధికారాలు పూర్తిగా పోయాయనిగానీ, విశేష అధికారాలు వచ్చాయనిగానీ కాదు.

ఈ నిబంధనల పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పవచ్చు:
***పోలీసులు వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా సులభంగా అరెస్టు చేయడానికి అవకాశం లేదు.
***7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో తగు కారణాలు ఉన్నప్పుడే, వాటిని నమోదు చేసి అరెస్టు చేయాలి. ఈ కారణాలను రిమాండ్ చేసే ముందు మేజిస్ట్రేట్ గమనంలోకి తీసుకోవాలి.
***కాగ్నిజబుల్ నేరాలు చేసిన వ్యక్తుల హాజరుపై పోలీసులు నోటీసు జారీ చేస్తారు. దానిని పాటించనప్పుడు, కోర్టు అనుమతితో మాత్రమే అరెస్టు చేయవచ్చు. నోటీసును పాటిస్తున్నప్పటికీ తగు కారణాలను చూపి అరెస్టు చేయవచ్చు. నోటీసు పేరుతో అరెస్టుకన్నా ఎక్కువ వేధించే అధికారం పోలీసులకు న్యాయబద్ధంగానే లభిస్తుంది.
***పోలీసులకి ఉన్న అరెస్టు అధికారాన్ని ఈ నిబంధనలు పూర్తిగా తీసివేయలేదు. కాకపోతే ఆ అధికారం మీద నిఘా ఉంటుంది.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ అంశానికి చెందిన కీలకమైన సవరణలను గుట్టుచప్పుడు కాకుండా అమలుచేయడం అంత మంచి సంప్రదాయం కాదు. ఈ సవరణల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్యన ఉన్న దూరం తగ్గుతుందా, పెరుగుతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి!

మంగారి రాజేందర్
మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

Monday, November 29, 2010

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines
వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines

Followers