Saturday, March 17, 2012

విరోధి పద్ధతి విచారణ

పోలీసులు, కోర్టుల నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ విషయానికి వస్తే ఎవరైనా నిష్పక్షపాతంగానే ఉండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరిపట్లా ఉండాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు. చాలా నేరాలు సమాజానికి వ్యతిరేకంగా జరిగినవి కాబట్టి, ఆ సమాజం పట్ల కూడా పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా ఉండాలి. క్రిమినల్‌ కేసుల విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ చెబుతున్నది కూడా ఇదే. ఈ శాసనం ప్రకారం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. మన దేశంలో ‘ఏడ్వర్సరీ సిస్టం’ (ప్రతికూల పద్ధతి) అమలులో ఉంది.

అంటే ప్రతికూల వ్యవస్థ అన్నమాట. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకు నిష్పక్షపాతంగా ఉండాలి. ఆయన కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనకూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్‌ లా’ దేశాలలో ఉంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు ఉంటాయి. ముద్దాయి పక్షం ఒకటి, ప్రాసిక్యూషన్‌ పక్షం ఒకటి. కేసును రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ముద్దాయిని సాక్ష్యం పెట్టాలని ఒత్తిడి చేయడానికి వీలు లేదు. అతని ప్రాసిక్యూటర్‌ (అభియోక్త) ప్రశ్నించడాకి వీల్లేదు. కానీ ముద్దాయి తనను తాను విచారించుకోవడానికి అతనికి విచక్షణాధికారం ఉంది. ఆ విధంగా అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అతని అభియోక్త క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మౌనంగా ఉండే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రతికూల పద్ధతిలో న్యాయమూర్తి చురుకుగా పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో న్యామూర్తి విచారణ క్రమంలో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించే నిబంధనలు కొన్ని ఉన్నాయి. కొన్ని నిబంధనలు అపారమైన అధికారాలను కూడా న్యాయమూర్తికి ఇచ్చాయి. అందుకు ఉదాహరణే భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.165. ఈ నిబంధన కేసు విచారణ క్రమంలో సంబంధం ఉన్న, సంబంధం లేని విషయాలను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనని ఉపయోగిస్తున్న న్యాయమూర్తులు చాలా అరుదు. ఈ నిబంధనే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా చాలా నిబంధనలు ఉన్నాయి ఈ ఏడ్వర్సరీ సిస్టంలో ఇరు పక్షాల న్యాయవాదులు ఇరుపక్షాల సాక్షులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ముద్దాయి సాక్షులను విచారించినప్పుడే ప్రాసిక్యూషన్‌కి అవకాశం లభిస్తుంది.

ఇక ఇన్క్విస్టోరియల్‌ విధానం (పరిశోధన పద్ధతి)లో చాలా చురుకైన పాత్ర పోషించేది న్యాయమూర్తి. విచారణలో సాక్షులను విచారించేది న్యాయమూర్తే. ఈ పద్ధతి ఉద్దేశం సత్యాన్ని తెల్సుకోవలసిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది. ఏడ్వర్సరీ విధానంలో నేరం నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని అమాయకుడుగా పరిగణిస్తారు. ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయి నేరం చేశాడన్న భావనలో కోర్టులు ఉంటాయన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అతను నిరపరాధి అన్న విషయం రుజువు చేసుకోవలసిన బాధ్యత అతనిపైనే ఉన్నదని కూడా చాలా మంది అనుకుంటారు. ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో ఇన్క్విస్టోరియల్‌ విధానం గత వంద సంవత్సరాలకు పైబడి ఉంది. అక్కడ నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంది. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి.

అంతర్జాతీయ సివిల్‌, రాజకీయ హక్కుల ఒప్పందంలోని అధికరణ ప్రకారం నేరం నిరూపణ అయ్యేవరకే ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాలి. ఈ సూత్రానికి అనుగుణంగానే ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని పాటిస్తున్న యూరోపియన్‌ దేశాల్లో చట్టాలున్నాయి. ఈ రెండు పద్ధతులకు ప్రధానమైన భేదం ఒకటుంది. ఏడ్వర్సరీ విధానంలో ముద్దాయిని అతను అనుకున్నప్పుడు తప్ప మరో సందర్భంలో ప్రాసిక్యూషన్‌ విచారించే అవకాశం లేదు. సాక్ష్యం ఇవ్వాలని అతణ్ణి ఒత్తిడికి గురిచేసే అవకాశం లేదు. రాజ్యాంగం, అదే విధంగా ఇతర శాసనాలు ముద్దాయికి ఈ హక్కులను ప్రసాదించాయి. ఇదే పద్ధతి ఈ ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని అనుసరిస్తున్న దేశాల్లో ఉంది.ఇన్క్విస్టోరియల్‌ విధానంలో కూడా దాదాపు ఇదే పద్ధతి ఉంటుంది. దర్యాప్తు క్రమంలో, కేసు విచారణ క్రమంలో ముద్దాయిని మాట్లాడమని ఒత్తిడి చేసే అవకాశం లేదు.

ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకు కారణాలు రెండు- ముద్దాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రాసిక్యూషన్‌ పరిశోధనను, సోదాలను నిర్వహిస్తుంది. విచారణ సమయంలో ముందుగా ముద్దాయిని న్యాయమూర్తి విచారిస్తాడు. కేసుకు సంబంధించిన కాగితాలను న్యాయమూర్తి ముద్దాయికి అందచేసి, అతని కథనాన్ని, అదే విధంగా అతని మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దీన్ని బట్టి ఈ ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారనే అపప్రథ ఏర్పడింది.

విరోధి పద్ధతి ముద్దాయికి అనుకూలంగా ఉందని, దానివల్ల చాలామంది శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కాని నేర న్యాయ వ్యవస్థని దగ్గరగా చూసిన వ్యక్తుల అభిప్రాయం వేరుగా ఉంటుంది. లోపభూయిష్టమైన దర్యాప్తు, సాక్షులు సహకరించకపోవడం, దర్యాప్తు విచారణలో జాప్యం వంటి కారణాలు ఎన్నో. కేసు నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న అభిప్రాయం ‘విరోధి పద్ధతి’లో ఉండడం వల్లే కేసులు వీగిపోతున్నాయని, దీనిని మార్చాలని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇదికూడా సరైన పద్ధతి కాదు. రెండు రకాలైన వ్యవస్థలకు ఇది వర్తిస్తుంది.
మన దేశంలో అభివృద్ధి చెందిన జ్యూరిస్‌ప్రుడెన్స్‌ ప్రకారం అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా ఉందో, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని నిరపరాధిగానే భావించాల్సి ఉంటుంది. నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌ది.

బాధితుడికి, సమాజానికి కష్టం, నష్టం కలిగించే విధంగా ఈ నిబంధన ఉందనే భిన్నాభిప్రాయాన్నీ చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను, సాక్ష్యాధారాల చట్టాన్ని ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చే విధంగా తయారు చేయలేదు. అందరికీ తగు న్యాయం జరిగే విధంగానే తయారు చేశారు. నేరనిరూపణ బాధ్యత ప్రాసిక్యూషన్‌పై కాక తాను నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిపై ఉంచాలన్న వాదన తరచు వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నేరాలు, హీనమైన నేరాలు జరిగినప్పుడు ఈ వాదన వస్తుంది. ఏమైనప్పటికీ ఈ వాదనతో ఏకీభవించలేం. ఎందుకంటే మన దేశంలోని నేరస్థుల్లో ఎక్కువమంది నిరుపేదలు, దిక్కు దివాణం లేని వ్యక్తులు. నేరం తాము చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి వారికి శిక్ష విధించాల్సి వస్తుంది. అమాయకులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని, నేరం నిరూపణ అయ్యేవరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న సూత్రానికి ఆవశ్యకత ఉంది. శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కొనడానికి అది కవచంలా ఉపయోగపడుతుంది.
మంగారి రాజేందర్‌

No comments:

Post a Comment

Followers