Tuesday, July 28, 2009

గుప్తత హక్కు సంపూర్ణమా?


కొత్త చట్టాలు వస్తున్నాయి. సాంకేతికంగా అభివృద్ధిచెంది ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. గతంలో సమాచార హక్కు చట్టం లేదు. స్టింగ్‌ ఆపరేషన్లు లేవు. మొబైల్‌ ఫోన్లు లేవు. వీటి రాక వల్ల వ్యక్తికి ఉండే గుప్తత హక్కు ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది.మన రాజ్యాంగంలో గుప్తత హక్కుకి అభయం ఇవ్వలేదు.

వ్యక్తి గుప్తతకి సంబంధించిన సూత్రాలను మాత్రమే ఇప్పుడు ఉన్న చట్టాలు తెలియచేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ క్రియాత్మకంగా వ్యవహరించి ఈ గుప్తత హక్కుని విస్తరింప చేసింది. ఇందుకు రాజ్యాంగ అభయాన్ని కల్పించే దిశగా తీర్పులను ప్రకటించింది. ఈ హక్కు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజాహితం కోసం ఈ హక్కుకి భంగం కల్గించవచ్చా, అవసరమైన పరిస్థితులలో టెలిఫోన్లను కూడా ట్యాప్‌ చేయవచ్చా?

‘గుప్తత హక్కు’ మొదటి సారిగా ‘కరక్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌’ కేసులో 1963 ప్రాంతంలో సుప్రీంకోర్టు ముందు చర్చకు వచ్చింది. రాజ్యాంగం అభయం ఇచ్చిన అధికరణల్లో (19(1) (డి), 19(1) (ఇ), 21) ఈ హక్కు ఉన్నదా అన్న విషయం చర్చకు వచ్చింది. ఈ కేసులో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించలేదు. కానీ మైనారిటీ అభిప్రాయం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించిందని, రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛ’ హక్కులో ఈ హక్కు కూడా మిళితమై ఉందని న్యాయమూర్తి సుబ్బారావు అభిప్రాయపడినారు.

ఈ హక్కు గురించిన చర్చ మళ్ళీ ‘గోవింద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ కేసులో మరోసారి చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసులో గుప్తత హక్కును గుర్తించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 19(1)(డి), 21లలో ఈ హక్కు ప్రసారితం అవుతుందని న్యాయమూర్తులు ఈ కేసులో ప్రకటించారు. అయితే ఈ హక్కు సంపూర్ణం కాదని కూడా సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. అధికరణ 19(2)లో ఉన్న పరిమితులు ఈ హక్కుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు మళ్ళీ ‘ఉన్ని క్రిష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ (ఏ.ఐ.ఆర్‌ 1993 సుప్రీంకోర్టు 2178) కేసులో మళ్ళీ చర్చకు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ హక్కులో గుప్తత హక్కు మిళితమై ఉందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. వ్యక్తి హితం, ప్రతిహితం అనేవి చర్చకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిగత హక్కులో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా అన్న విషయం వి. రాజ్‌గోపాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు (ఏ.ఐ.ఆర్‌ 1998 సుప్రీంకోర్టు 264) కేసులో చర్చకు వచ్చింది. ప్రజాహితానికి సంబంధించినప్పుడు ఈ గుప్తత హక్కు ఉండదని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులను కోర్టు ప్రకటించింది. గుప్తత హక్కుకు రాజ్యాంగ హోదాను సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటిస్తూనే కొన్ని సూత్రీకరణలు చేసింది. అవి-

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో గుప్తత హక్కు మిళితమై ఉంది. తన విషయంలో, తన కుటుంబం విషయంలో, వివాహం, సంతానం, చదువు తదితర విషయాల్లో ప్రతి పౌరునికి గుప్తత హక్కు ఉంటుంది. అయితే స్వచ్ఛందంగా ఏదైనా వివాదంలో చిక్కుకుంటే, వివాదాన్ని స్వచ్ఛంధంగా ఆహ్వానిస్తే, లేదా ఏదైనా వివాదాన్ని సృష్టిస్తే ఈ గుప్తత హక్కు ఉండదు. 2. ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది. విషయం ప్రజల రికార్టు అయినప్పుడు, ఈ గుప్తత హక్కు ఉండదు. కానీ ఎవరైనా మహిళ ఏదైనా అత్యాచారానికి గురైనప్పుడు, కిడ్నాప్‌ అయినప్పుడు ఏదైనా నేరంలో ఇరుక్కున్నప్పుడు వారిని అగౌరవపరిచే విధంగా ప్రసార మాధ్యమాలలో, అచ్చు మాధ్యమాల్లో ప్రచారం చేయకూడదు. 3. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సుప్రీంకోర్టు రెండవ మినహాయింపును ప్రకటించింది. వారి విద్యుక్త ధర్మానికి, నడవడికలకు ఈ గుప్తత హక్కు వర్తించదు.

గుప్తత హక్కును విస్తరింపచేసినప్పటికీ సుప్రీంకోర్టు అది సంపూర్ణం కాదని స్పష్టం చేసింది. ఈ హక్కుకీ పరిమితులు ఉన్నాయని కూడా ప్రకటించింది. ఇదే విషయం ఎక్స్‌ వర్సెస్‌ హాస్పిటల్‌ కేసులో కూడా చర్చకు వచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తికి హెచ్‌.ఐ.వి. వైరస్‌ సోకిందన్న విషయం ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్న కుటుంబ సభ్యులకు తెలియచేశాడు అతణ్ణి పరీక్షించిన డాక్టరు. ఆ విధంగా తెలియచెయ్యడం తన గుప్తత హక్కుకు భంగం కలిగించడమేనని అతడు కోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వ్యక్తి గుప్తత హక్కును పునఃపరిశీలించి ఈ హక్కు సంపూర్ణం కాదని ఇతరుల స్వేచ్ఛను, హక్కులను, ఆరోగ్యాలను కాపాడటానికి జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది.

టెలిఫోన్‌ సమాచారాన్ని ట్యాపింగ్‌ చేయడం వ్యక్తి గుప్తత హక్కులోకి జోరబడటమే అవుతుందా? అది వ్యక్తిగత సంభాషణ అని, రహస్యమైనదని సుప్రీంకోర్టు ముందు పీపుర్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా((1997) ఎస్‌.సి.సి.301) కేసులో వాదించారు. టెలిఫోన్‌ సంభాషణను ట్యాపింగ్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తీర్పులో ప్రకటించింది. అయితే ఈ ట్యాపింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాలలో అవసరం అవుతుంది. అందుకోసం చట్టాన్ని తయారు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ విధంగా కాకుండా వ్యక్తుల సంభాషణను ట్యాపింగ్‌ చేస్తే అది ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కులలోకు జోక్యం చేసుకోవడమే అవుతుంది.

ఇంటర్నెట్‌ వచ్చిన తర్వాత వ్యక్తులపైన, వాళ్ళ అలవాట్లపైన నిఘా పెట్టడం సులువై పోయింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ ఉద్యోగుల మెయిల్స్‌ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనక్కొంటున్నాయి. ఇది వ్యక్తుల గుప్తత హక్కులోకి జోరబడడమే. వారిని నియంత్రించడానికి ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ చట్టంలో 2000లో సె.43 ఏర్పరిచారు. ఏ యాజమాన్యమైనా అనుమతి లేకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని చూస్తే నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టంలోని ఈ నిబంధన ఉపయోగపడుతుంది. అయితే ఈ నిబంధన సరిపోదని అనిపిస్తోంది.

స్టింగ్‌ ఆపరేషన్లు అవసరమే. కానీ ప్రసార మాధ్యమాలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్పుడు విషయాలను కూడా ప్రసారం చేసి వ్యక్తుల గుప్తత హక్కుల్లో జోరబడుతున్నాయి. వీటిని నియంత్రించుకోవడానికి చట్టం లేదు. ప్రసార మాధ్యమాలు కూడా ఎలాంటి నిబంధనలను, నియమాలను ఏర్పరచుకోలేదు.

సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత గుప్తత హక్కు మరోసారి చర్చనీయాంశం అయింది. పబ్లిక్‌ అధారిటీస్‌ దగ్గర ఉన్న వివిధ వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వవచ్చా లేదా, ఇస్తే అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్లో జోరబడినట్లు అవుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత హక్కులో జోరబడినట్లు కాదని చట్టం భావిస్తున్నది. పారదర్శకత, జవాబు దారీతనం అవసరమని ఈ చట్టం భావిస్తుంది.

గుప్తత హక్కు అనేది జీవించే హక్కులో భాగమే కానీ అది సంపూర్ణమైనది కాదు. నేరాలను నిరోధించడానికి, ఇతరుల ఆరోగ్యాలను, స్వేచ్ఛలను రక్షించడానికి, నీతి నియమాలను పరిరక్షించడానికి గాను ఈ హక్కుకు దీనికి పరిమితులను ఏర్పరచవచ్చు. వ్యక్తి ప్రాథమిక హక్కులకి సమాజ హితానికు, మధ్య సమస్య తలెత్తినప్పుడు సమాజ హితమే ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.

Sunday, July 19, 2009

ద్వేషించే నేరాలు !

భారత దేశస్థులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న దాడులు ఒక్క భారతీయులను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలామంది ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్క నెలలో నాలుగు దాడులు జరిగాయి ఒక జాతిపై జరుగుతున్న దాడుల వల్ల ఆస్ట్రేలియా జాతికి ఉన్న మంచి పేరు కాస్తా తొలగిపోతోంది మెల్‌బోర్న్‌ లోనే ముగ్గురు విద్యార్థులపై దాడులు జరిగాయి. స్క్రూడైవర్‌తో ఒకరిపైన, మిగతా ముగ్గురిపైన కత్తితో దాడులు జరిగాయి. సిడ్నీలో భారతీయ విద్యార్థిమీద పెట్రోలు బాంబుతో దాడి జరిగింది. ఒక జాతికి చెందిన ప్రజల మీద, ఒక మతానికి చెందిన ప్రజల మీద దాడులు ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశం 1670లో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఇంచు మించు ఈ విషయంలో అదే విధంగా ఉంది. రక రకాల మతాలకు, జాతులకు చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి దాడుల సంఘటనలు జరగడానికి అవకాశం ఉన్నా,అవి జరగకుండా నియంత్రించడానికి సరైన యంత్రాం గం, చట్టాలు అవసరం. ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోవా, కొత్త చట్టాలు అవసరమా అన్నది ప్రశ్న.మామూలుగా చూసినప్పుడు అత్యల్ప విషయంగా కనిపించే సంఘటన ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం కల్పిస్తుంది. స్వార్ధ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ఆ చిన్న సంఘటనని మతపరమైన దాడిగా చిత్రీకరించి ఘోరమైన సంఘటనలు జరగడానికి కారణమవుతున్నారు. చిన్న సంఘటనల వల్లనే కాదు, ఒక్కోసారి పెద్ద సంఘటనల వల్ల కూడా ‘ద్వేషించే నేరాలు’ (హేట్‌ క్రైమ్స్‌) జరిగే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణలు- ఇందిరా గాంధీ హత్య తరువాత మన దేశంలో చెలరేగిన అల్లర్లు, సెప్టెంబర్‌ 11 సంఘటన తర్వాత అమెరికాలో జరిగిన సంఘటనలు వంటివి ఎన్నో! సెప్టెంబర్‌ సంఘటన తర్వాత 2001లో సిక్కు మతానికి చెందిన బల్‌బీర్‌ సింగ్‌ సోధీని అమెరికాకు చెందిన ఫ్రాంక్‌ సిల్వారోక్‌ చంపేశాడు అమెరికా జ్యూరీ అతడికి మరణ శిక్ష విధించింది. క్రిష్టియన్‌ మిషనరీకి చెందిన గ్రాహమ్‌ స్టేన్స్‌ని అతని కుమారుని సజీవ దహనం చేసిన కేసులో దారాసింగ్‌ అనే వ్యక్తికి మన దేశంలోని కోర్టు మరణశిక్ష విధించింది. జాతి సంబంధమైన, మత సంబంధమైన నేరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రోజు రోజుకీ ఈ నేరాల సంఖ్య పెరుగుతోంది. విద్వేష పరమైన ప్రసంగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటి దాడులను, ‘ద్వేషించే నేరాలు’ అనీ, ఇలాంటి ప్రసంగాలను ‘అసహ్యకరమైన ప్రసంగాలు’ అని అంటున్నారు. ఏదైన ఒక ప్రత్యేకమైన సాంఘిక బృందంలో ఎవరైనా ఒక వ్యక్తి సభ్యుడైనందున ఆ వ్యక్తిపై ఎవరైనా దాడికి పాల్పడితే దానిని ‘అసహ్యకరమైన నేరం’అని అంటున్నాం. ఆ ప్రత్యేకమైన బృందం మతపరమైనది కావచ్చు, అంగ పరమైనది కావచ్చు, రాజకీయ పరమైనది కావచ్చు. ఆ బృందంలో సభ్యుడైనందుకు దాడులు జరిగితే దానిని ‘ద్వేషించే నేరం’ అని అంటున్నారు. ఆ దాడులు భౌతికంగా ఉండవచ్చు, మానసికంగా ఉండవచ్చు. ఆ నేరాలు ఆస్తికి నష్టం కలిగించడం ద్వారా, వేధించడం ద్వారా,తిట్టడం ద్వారా, అవమానించడం ద్వారా జరగవచ్చు. పిచ్చి పిచ్చి బొమ్మ లు రాయడం ద్వారా కూడా జరగవచ్చు. ఎవరైన వ్యక్తి చర్యలు విద్వేష పూరితంగా ఉన్నాయని, హాని కలిగించేవిగా ఉన్నాయని బాధితులు గానీ, లేక ఇతర వ్యక్తులు గానీ భావిస్తే వాటిని ఇంగ్లాండ్‌లో ‘హేట్‌ క్రైమ్స్‌’గా పరిగణిస్తున్నారు. ఈ దాడులు భౌతికంగా కాని, మాటల ద్వారా కాని, భయపెట్టడం ద్వారా కాని,అవమానించడం ద్వారా కాని కావచ్చు అవి ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. నల్ల జాతికి చెందిన వ్యక్తులమీద, మైనారిటీలకు చెందిన 87 వేల మంది వ్యక్తుల మీద బ్రిటన్‌లో 2004 సంవత్సరంలో దాడులు జరిగాయని ఆ దేశంలో జరిపిన ఒక సర్వే చెబుతోంది. అమెరికాలో 1991లో ‘హేట్‌ క్రైమ్‌’ను నిర్వచించారు. ఒక వ్యక్తి తెగకు సంబంధించి,వర్ణానికి సంబంధించి, జాతీయతకు సంబంధించి ఎవరైనా నేరం చేస్తే అది హేట్‌ క్రైమ్‌ అవుతుంది. 31 రాష్ట్రాలలో ఇందుకు సంబంధించిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.మన దేశంలో హేట్‌ క్రైమ్స్‌ను నిర్వచించలేదు. ఇందుకు సంబంధించి ప్రత్కేక చట్టం కూడా లేదు. ఇందుకు ప్రత్యేక చట్టం అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ద్వేషించే నేరాలను నియంత్రించకపోతే అవి తీవ్ర రూపం దాల్చుతాయి. ఫలితంగా ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంది. అందుకని ద్వేషించే నేరాల గురించి దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మత పరంగా, జాతి పరంగా, వర్ణ పరంగా జరిగే నేరాలను అదుపు చెయ్యడానికి మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను నియంత్రించడానికి సంబంధించి భారతీయ శిక్షా స్మృతిలో చాలా నిబంధనలు ఉన్నాయి మత విద్వేషాలను,జాతి విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై కేసులు నమోదు చేయడానికి చాలా నిబంధనలు ఆ కోడ్‌లో ఉన్నాయి. అలాగే ఆ నేరాలను ప్రేరేపించే వ్యక్తులపైనా, కుట్రలు పన్నే వ్యక్తులపైనా చర్యలు తీసుకోవడానికి కూడా నిబంధనలు భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపైన, తిరుగుబాటు చేసే వ్యక్తులపైన, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులపైన, విద్వేషం కలిగించే అన్ని నేరాలకు సంబంధించి ఈ చట్టంలో నిబంధనలున్నాయి. అయితే వాటిని సక్రమంగా దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఉపయోగించుకోవాలి. 2001 సెప్టెంబర్‌ 8న దర్బన్‌లో జాతి వివక్షకి, విదేశీ వస్తువుల వ్యతిరేకతకి సంబంధించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను ఉపయోగించి బాధితులకు రక్షణ కల్పించాలని ఆ సదస్సు ప్రకటన జారీ చేసింది. ఈ నేర బాధితులకు చట్టం అందుబాటులో ఉండి, వారికి రక్షణ కల్పించే విధంగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని, అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని ఈ సదస్సు కోరింది. ఈ నేపథ్యంలో ద్వేషించే నేరాలను అదుపు చేయడానికి కొత్తచట్టం తీసుకు రావాలన్న డిమాండ్‌ సహజంగానే వస్తుంది. అయితే, ఇప్పటికీ మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను అదుపు చెయ్యడానికి, అందుకు పాల్పడ్డ వ్యక్తులపై చర్య తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు భారతీయ శిక్షాస్మృతిలో ఉన్నాయి. కాబట్టి కొత్త చట్టం అవసరం లేదు గానీ, వాటిని దర్యాప్తు చేయడానికి యంత్రాంగం అవసరం ఉంది. నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని రూపొందించాలి ఇటువంటి ద్వేషించే నేరాలకు సంబంధించిన కేసులను సత్వరంగా పరిష్కరించే కోర్టులను ఏర్పాటు చేయాలి. నేరాలు జరిగినప్పుడు వాటిని అందరూ ఖండించాలి. అంతర్జాతీయంగా ఒకరికొకరు ఈ నేరాలను నియంత్రించడానికి సహకరించుకోవాలి. ఎందుకంటే, ఒక దేశంలో జరిగిన సంఘటన ప్రభావం మరో దేశంలో పడే అవకాశం ఉంది.

Saturday, July 11, 2009

కేసు ముందా దర్యాప్తు ముందా?

సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తుల మీద ప్రథమ సమాచార నివేదిక విడుదల కాగానే ఆ వ్యక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తప్పుడు కేసు పెట్టారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని ఆందోళనలు మొదలవుతాయి. ప్రథమ సమాచార నివేదిక విడుదల తరువాత దర్యా ప్తు ఉంటుందా? దర్యాప్తు తరువాత ప్రథమ సమాచార నివేదిక ఉంటుందా? ఆధునికసమాజంలో న్యాయపరిపాలన ముఖ్యమైన అంశం. ఇది లేకుండా నాగరిక సమాజాన్ని ఊహించలేం. కాగ్నిజబుల్‌ నేరాలనేవి బాధితులకు వ్యతిరేకంగా జరిగేవి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగేవి. నేరస్థుడు సమాజ హక్కుల్లోకి జొరబడే వ్యక్తి. శాంతి భద్రతలకు, వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తన విధి నిర్వర్తించాలంటే నేర సమాచారం తెలియా లి. నేర సమాచారంలో మొట్టమొదటి అడుగు ప్రథమ సమాచారం.ఇది అందిన తరువాతే క్రిమినల్‌ చట్టంలో చలనం కలు గుతుంది. ఆ తర్వాతే దర్యాప్తూ, విచారణ. ఆ తరువాత శిక్ష పడే అవకాశం. ప్రాసిక్యూషన్‌ కేసుకు బలాన్ని ఇచ్చే సాక్ష్యం- ప్రథమ సమాచార నివేదిక.పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి దర్యాప్తు మొదలు పెట్టడానికి, సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైనది- ప్రథమ సమాచార నివేదిక. ఇది అతి ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన పత్రం. ఇది స్థిరమైన సాక్ష్యం కానప్పటికీ, దీనికి అత్యంత విలువ ఉంది. ఇది ముద్దాయి ప్రయోజనాలను కాపాడుతుంది. సమాజహితాన్ని కలుగజేస్తుంది. అందుకని వివేకం కలిగిన ప్రతి మనిషి కాగ్నిజబుల్‌ నేరం జరుగగానే అది పోలీసులకు తెలియాలని కోరుకుంటాడు.ప్రథమ సమాచారం అందించడంలో జాప్యం జరిగితే దాని మీద అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కల్పనలు చోటు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. జాప్యం వల్ల సమాచార ప్రవాహం పోతుంది. జాప్యం అనేది ప్రతిసారి ప్రాసిక్యూషన్‌ కేసుకి ప్రాణాంతకం కాదు. దాని వల్ల ముద్దాయి విముక్తి పొందుతాడని అనలేం. అయితే జాప్యానికి గల కారణాలు తెలియచెయ్యాలి. ఎలాంటి వివరణ లేని జాప్యం ఉంటే కల్పితాలకు అవకాశం ఉందని కోర్టులు భావించే అవకాశం ఉంది. అలా అని సత్వరంగా ప్రథమ సమాచారాన్ని అందించ డంవల్ల ప్రాసిక్యూషన్‌ కేసు బలంగా ఉంటుందని కూడా అన లేం. కేసులోని వాస్తవ పరిస్థితులను బట్టి ప్రథమ సమాచార నివేదిక ప్రాముఖ్యతను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే జాప్యం అనేది పోలీసులు స్వీకరించడంలో జరుగకూడదు.జాప్యాలను డిఫెన్స్‌ న్యాయవాది శ్రద్ధగా గమనించాలి. ఏ రకంగా జాప్యం ఉన్నా డిఫెన్స్‌ న్యాయవాది దాన్ని ఆయుధంగా మలుచుకుంటాడు. కేసు తొలిదశలో ప్రథమ సమాచార నివేదికలోని కథనాన్ని బట్టి పరిశోధన అధికారి దర్యాప్తు మొదలుపెడతాడు. అది సరైందే. కానీ ప్రతిసారి అలాగే చెయ్యడం సమం జసం కాదు. గుడ్డిగా ప్రథమ సమాచార నివేదికలోని విషయాలను నమ్మకూడదు. కొంతమంది తమ ప్రత్యర్థులకు ఇరికించడానికి తప్పుడు నివేదికను ప్రణాళికాబద్ధంగా ఇచ్చే అవకాశం ఉంది. అందుకని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రథమ సమాచార నివేదికకు భిన్నంగా సాక్ష్యాలు వస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారి సేకరించాలి. ప్రాథమిక దృష్టిలో చూసినప్పుడు, నేర సమాచారం కాగ్నిజబుల్‌ నేరానికి సంబంధించినది అయినప్పుడు ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారిపై ఉంటుంది. సె.154 సి.ఆర్‌.పి.సి. ప్రకారం ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాలి ఈ విషయంలో ఎంపిక చేసుకొనే అవకాశాన్ని చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వనీయత కనిపించడం లేదన్న కారణంగా గాని లేదా అవసరమైన వివరాలు లేవనిగాని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత గురిం చి చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారన్న విషయం తేలితే కేసుని మూసివేసి పోలీసు అధికారి తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు.అవసరమని భావించినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవచ్చు (తులసీరామ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎం. పి. 1993, క్రిమినల్‌ లా జనరల్‌ 1165 ఎం.పి).అందిన సమాచారంలో కాగ్నిజబుల్‌ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి తప్పక కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కురుక్షేత్ర యూనివర్సిటి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హర్యానా, 1977, క్రిమినల్‌ లా జనరల్‌ 1990 కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయడానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడానికి కావలసిన అంశాలు రెండే రెండు.
మొదటిది:అది సమాచారం అయి ఉండాలి.
రెండవది:అది కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయి ఉండాలి.కేసు నమోదు దశలో ఈ రెండు అంశాలను మాత్రమే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి పరిశీలించాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154 అదేశం ఇది ఈ దశలో సంబంధిత పోలీస్‌ అధికారి సమాచారంలోని విశ్వసనీయత గురించి, నిజా- నిజాల గురించి ప్రాథమిక విచారణను చేపట్టడానికి వీల్లేదు. శాసనకర్తలు తమ వివేకాన్ని అనువర్తింప చేసి చాలా జాగ్రత్తగా నేర్పుగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154(1)ను పొందుపరిచారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-41(ఎ) లేదా (జి) సహేతుకమైన ఫిర్యాదును విశ్వసనీయ సమాచారంగా పేర్కొన్నాయి. అలాంటి గుణాత్మకమైన భావాన్ని సూచించే పదబంధాలను సె-154 లో పొందుపరచలేదు. అందుకు కారణం- కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు ప్రథమ సమాచార నివేదికను అందులోని సమాచారంలో సహేతుకత లేదా విశ్వసనీయత లేదన్న కారణంగా పోలీసు అధికారి నిరాకరించడానికి వీల్లేదు. కేసు నమోదు కావడానికి అవి రెండు షరతులు కావు. మరో విధంగా చెప్పాలంటే అందిన సమాచారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయితే చాలు. పోలీసు అధికారి సెక్షన్‌ 154(1) ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదు. సె-154(1) ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు తప్పకుండా వెంటనే ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది (స్టేట్‌ ఆఫ్‌ హర్యానా వర్సెస్‌ భజనేలాల్‌, 1992 క్రిమినల్‌ లా జనరల్‌ 527 సుప్రీం కోర్టు).అస్పష్ట సమాచారం ఆధారంగా పోలీసు అధికారి ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం రాత పూర్వంగా అందినప్పుడు దాని ఆధారంగా కేసు నమోదు చేయాలి. ఎవరైన మౌఖికంగా సమాచారం అందచేసినప్పుడు, దాన్ని రాతపూర్వకంగా నివేదిక రాసి, అతనికి చదివి వినిపించి, అతని సంతకం తీసుకొని కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారంలోని సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పుస్తకంలో రాయాల్సి ఉంటుంది. ప్రథ మసమాచార నివేదికను సంబంధిత మెజిస్ట్రేటుకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాని అస్పష్ట సమాచారం అందినప్పుడు ప్రథ మ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసం లేదు. అయితే అలాంటి సమాచారం అందినప్పుడు ఆ సమాచార వివరాలను జనరల్‌ డైరీలో నమోదు చేసి మరికొంత సమాచారాన్ని సేకరించుకొన్న తర్వాత కేసు నమోదు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు సోమాబాయి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ ఏ.ఐ.ఆర్‌. 1975, ఎస్‌.సి.1453; జహుర్‌, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యు.పి., 1990, క్రిమినల్‌ లా జర్నల్‌ 56, తుల్వకాలి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు ఏ.ఐ.ఆర్‌. 1973, సుప్రీంకోర్టు 501 కేసులలోని సారాంశాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గుడిసె వెంకప్ప, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ 1995(3) సి.సి.ఆర్‌. 129. ఆంధ్రప్రదేశ్‌ డివిజన్‌ బెంచ్‌ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది- ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లోని సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జీ అధికారికి అందినప్పుడు దాని ఆధారంగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది సమాచారం ఎవరైనా వ్యక్తి నుంచి వచ్చినది కావచ్చు లేదా టెలిఫోన్‌ ద్వారా వచ్చినది కావచ్చు. దాన్ని సాధారణంగా పోలీస్‌స్టేషన్‌లోని జనరల్‌ డైరీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రథమ సమాచారంగా లేదా దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడాన్ని చేపట్టారని అనుకోవడానికి వీల్లేదు సమాచారం అస్పష్టంగా ఉన్నప్పుడు దాని గురించి ప్రాథమిక విచారణ జరిపి ప్రథమ సమాచార నివేదిక విడుదల చేసే అధికారం పోలీసు అధికారికి ఉంటుంది’.

Followers