విడాకులు సులభతరం
వివాహ బంధంలో ఉన్న దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు-2010ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2010లో మొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లా కమిషన్ తన 271వ నివేదికలో వివాహాల (సవరణల) బిల్లు-2010ను సూచించింది. సరిదిద్దడానికి వీలు లేని వివాహాలను- విడాకులు పొందడానికి ఒక ఆధారంగా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే కలుగచేసే ప్రభావాలను సభ్య సమాజం చర్చించింది. కొందరు భయాందోళనలను కూడా వ్యక్తం చేశా రు. చాలామంది న్యాయ కోవిదులు, వ్యాసకర్తలు ఈ బిల్లులోని అంశాలను వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపి తగు సూచనలు, సలహాలు ఇవ్వమని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీ ప్రజలనుంచి సూచనలు, అభ్యంతరాలు కోరి వాటిని పరిశీలించి తన 45వ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జయంతి నటరాజన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 2011 మార్చి 1న సమర్పించిన తన నివేదికలో ఈ బిల్లులో తీసుకురావలసిన మార్పుల్ని సూచించింది. మార్పులు తీసుకొచ్చిన వివాహాల సవరణల బిల్లు- 2010ను కేంద్ర ప్రభుత్వం మార్చి 22న ఆమోదించింది. ఇక పార్లమెంట్ ఆమోదం పొంది రాష్టప్రతి ఆమోదముద్ర పొందితే చట్ట రూపం దాలుస్తుంది.
ఈ మార్పులపై కూడా విభిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. హిందూ సమాజం విడాకుల్ని ఆమోదించలేదు. అలాంటి భావన 19వ శతాబ్దం తొలి దశలో మన చట్టంలో లేదు. ఆ తర్వాత కాలంలో అది చట్టంలో చోటు చేసుకుంది. హిందువులకు సంబంధించి హిందూ వివాహ చట్టం, మతంతో సంబంధంలేకుండా ప్రత్యేక వివాహ చట్టం అమలులోకి వచ్చాయి. ఈ రెండు చట్టాల్లో విడాకులు పొందడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాలక్రమంలో పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి కూడా అవకాశం కల్పిస్తూ సవరణలు తీసుకొచ్చారు. ఆ అవకాశం ఉండగా మళ్ళీ ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహం’ అన్న కొత్త ఆధారం ఎందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడున్న చట్టాల ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదం చేసినప్పుడే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులు విడాకులు మంజూరు చేస్తున్నాయి. ఈ ఆధారాలకు మరో ఆధారం తోడైంది.
అదే పరస్పర ఆమోదంతో విడాకులు. దీనికి కూడా అదనంగా ఇప్పుడు మరో కొత్త ఆధారం 13 సి రూపంలో రాబోతోంది. ఈ నిబంధన ప్రకారం మొదట ప్రతిపాదించిన ప్రకారం మూడు సంవత్సరాలు భార్యా భర్తలు వేరుగా ఉంటే వారు విడాకులు పొందడానికి ఆస్కారం ఉంది. వైవాహిక తప్పిదం చేసిన వ్యక్తి కూడా వివాహం రద్దు చేయమని, తమది సరిదిద్దడానికి వీల్లేని వివాహమనీ కోరడానికి అవకాశం ఉంది. ఇది మహిళలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం రావడంతో సరికొత్త రూపంలో బిల్లును తీసుకురావాలని జయంతీ నటరాజన్ కమిటీ తన నివేదికలో కోరింది. ఈ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది.అవి- 1.సరిదిద్దడానికి వీల్లేని వివాహాలు అన్నది విడాకులు పొందడానికి ఒక ఆధారం కావాలి 2. భార్యకు, పిల్లలకు పోషణ కోసం తగు రక్షణలు కల్పించాలి.3. పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినప్పుడుదంపతులుతప్పకుండా ఆరు మాసాలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. దానిని తొలగించాలి.
సరిదిద్దడానికి వీల్లేని వివాహం అంటే ఏమిటో ప్రతిపాదిత బిల్లులో పేర్కొనలేదు. కాని ఈ ఆధారంతో దంపతులు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు వేరుగా ఉంటున్న దంపతులు ఈ ఆధారం ప్రకారం విడాకులు కోరడానికి అవకాశం ఉంది. సవరించి ప్రతిపాదిత బిల్లులోని నిబంధన ప్రకారం ఈ ఆధారం ప్రకారం భర్త విడాకులు కోరినప్పుడు భార్య ఆ విడాకులను వ్యతిరేకించవచ్చు. సరిదిద్దడానికి వీల్లేని వివాహం అన్న ఆధారంగా భార్య విడాకులు కోరినప్పుడు మాత్రం భర్త వ్యతిరేకించడానికి వీల్లేదు. ఈ నిబంధన మగవారిపట్ల వివక్షతో ఉన్నదని కొందరి వాదన. ఈ వాదనలో బలంలేదు. ఎందుకంటే, రాజ్యాంగంలోని అధికరణ 15 ప్రకారం పిల్లలు, స్ర్తీల కోసం ప్రత్యేక చట్టాలను రాజ్యం తయారు చేయవచ్చు.
భారతీయ శిక్షా స్మృతిలోని సె. 498 ఎ మాదిరిగా ఇది కూడా దుర్వినియోగం అవుతుందన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు. ఆ వాదనలో కూడా పస లేదు. పురుషులకు అందుబాటులో ఉన్నంతగా కోర్టులు స్త్రీలకు లేవు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే స్ర్తీలు కోర్టుకు వస్తారు. పురుషులు మోజు తీరిన తర్వాత మూడు సంవత్సరాలు విడిగా ఉండి విడాకులు కోరే అవకాశం ఉంది. అందువల్ల మార్పు చేసిన నిబంధన మహిళల పక్షం ఉండడం సమంజసం. ఈ ఆధారమే సరైనది కాదన్న వాదన కూడా హేతుబద్ధం కాదు. కోర్టుల్లో కేసుల విచారణకు చాలా సమయం పడుతుంది. కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసినప్పటికీ, సత్వరంగా కేసుల పరిష్కారం జరగడంలేదు. ఫలితంగా యవ్వనం కోల్పోయిన తర్వాత కేసుల పరిష్కారం వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరదు.
ఇక రెండవ సూచన కూడా అవసరమనిపిస్తుంది. పిల్లలకు, భార్యకు మనోవర్తి భరణం వంటి అంశాలు అమల్లో ఉన్న చట్టంలో ఉన్నప్పటికీ దానివల్ల మహిళలకు పూర్తి న్యాయం జరగడం లేదు. కోర్టులు మంజూరు చేసే మొత్తాలు సహేతుకంగా ఉండడం లేదు. వివాహ బంధంలో ఉన్న సమయంలో భర్త ఆర్జించిన ఆస్తిలో భార్యకు హక్కు కల్పించాలని కమిటీ సూచించింది. ఆ ఆస్తి సముపార్జనలో భార్య సహాయం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆమె ఉద్యోగి అయితే డబ్బు సహాయం చేస్తుంది. సహజంగా ఆ ఆస్తి భర్త పేరుతోనే రిజిస్టరయ్యే అవకాశం ఉంటుంది. ఆమె ఉద్యోగి కానప్పుడు గృహిణిగా ఆస్తి సంపాదనలో ఆమె వంతు సహాయం పరోక్షంగా ఉంటుంది. అందువల్ల, ఈ నిబంధనను ప్రతిపాదించడంలో సహేతుకత ఉంది. ఈ ప్రయోజనాన్ని దత్తత పిల్లలకు కూడా ఇవ్వాలని సూచించారు. అది కూడా సమంజసమే.
అయితే ఈ హక్కు భర్త ఉమ్మడి ఆస్తిలో, వివాహానికి ముందు ఆర్జించిన ఆస్తిలో ఉండదు. వివాహబంధంలో ఆర్జించిన ఆస్తి లేనపుడు భరణం మాత్రమే కోరే అవకాశం ఉంది.
మూడవ ప్రతిపాదిత అంశం పరస్పర ఆమోదంతో విడాకులు. ఈ మేరకు దరఖాస్తు చేశాక, ఆరు మాసాలు వేచి ఉండాలి. 6 నుంచి 18 మాసాలలోపు ఈ విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీనివల్ల దంపతులు ఇబ్బందులకు లోనవుతున్నారు. 6 మాసాల కాలాన్ని తగ్గించే విధంగా కోర్టులకు విచక్షణాధికారం ఇవ్వడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఈబిల్లు చట్టరూపం దాలుస్తే మహిళలకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తునర్
రూల్ఆఫ్లా మంగారి రాజేందర్