Tuesday, July 28, 2009

గుప్తత హక్కు సంపూర్ణమా?


కొత్త చట్టాలు వస్తున్నాయి. సాంకేతికంగా అభివృద్ధిచెంది ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. గతంలో సమాచార హక్కు చట్టం లేదు. స్టింగ్‌ ఆపరేషన్లు లేవు. మొబైల్‌ ఫోన్లు లేవు. వీటి రాక వల్ల వ్యక్తికి ఉండే గుప్తత హక్కు ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది.మన రాజ్యాంగంలో గుప్తత హక్కుకి అభయం ఇవ్వలేదు.

వ్యక్తి గుప్తతకి సంబంధించిన సూత్రాలను మాత్రమే ఇప్పుడు ఉన్న చట్టాలు తెలియచేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ క్రియాత్మకంగా వ్యవహరించి ఈ గుప్తత హక్కుని విస్తరింప చేసింది. ఇందుకు రాజ్యాంగ అభయాన్ని కల్పించే దిశగా తీర్పులను ప్రకటించింది. ఈ హక్కు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజాహితం కోసం ఈ హక్కుకి భంగం కల్గించవచ్చా, అవసరమైన పరిస్థితులలో టెలిఫోన్లను కూడా ట్యాప్‌ చేయవచ్చా?

‘గుప్తత హక్కు’ మొదటి సారిగా ‘కరక్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌’ కేసులో 1963 ప్రాంతంలో సుప్రీంకోర్టు ముందు చర్చకు వచ్చింది. రాజ్యాంగం అభయం ఇచ్చిన అధికరణల్లో (19(1) (డి), 19(1) (ఇ), 21) ఈ హక్కు ఉన్నదా అన్న విషయం చర్చకు వచ్చింది. ఈ కేసులో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించలేదు. కానీ మైనారిటీ అభిప్రాయం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించిందని, రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛ’ హక్కులో ఈ హక్కు కూడా మిళితమై ఉందని న్యాయమూర్తి సుబ్బారావు అభిప్రాయపడినారు.

ఈ హక్కు గురించిన చర్చ మళ్ళీ ‘గోవింద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ కేసులో మరోసారి చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసులో గుప్తత హక్కును గుర్తించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 19(1)(డి), 21లలో ఈ హక్కు ప్రసారితం అవుతుందని న్యాయమూర్తులు ఈ కేసులో ప్రకటించారు. అయితే ఈ హక్కు సంపూర్ణం కాదని కూడా సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. అధికరణ 19(2)లో ఉన్న పరిమితులు ఈ హక్కుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు మళ్ళీ ‘ఉన్ని క్రిష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ (ఏ.ఐ.ఆర్‌ 1993 సుప్రీంకోర్టు 2178) కేసులో మళ్ళీ చర్చకు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ హక్కులో గుప్తత హక్కు మిళితమై ఉందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. వ్యక్తి హితం, ప్రతిహితం అనేవి చర్చకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిగత హక్కులో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా అన్న విషయం వి. రాజ్‌గోపాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు (ఏ.ఐ.ఆర్‌ 1998 సుప్రీంకోర్టు 264) కేసులో చర్చకు వచ్చింది. ప్రజాహితానికి సంబంధించినప్పుడు ఈ గుప్తత హక్కు ఉండదని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులను కోర్టు ప్రకటించింది. గుప్తత హక్కుకు రాజ్యాంగ హోదాను సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటిస్తూనే కొన్ని సూత్రీకరణలు చేసింది. అవి-

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో గుప్తత హక్కు మిళితమై ఉంది. తన విషయంలో, తన కుటుంబం విషయంలో, వివాహం, సంతానం, చదువు తదితర విషయాల్లో ప్రతి పౌరునికి గుప్తత హక్కు ఉంటుంది. అయితే స్వచ్ఛందంగా ఏదైనా వివాదంలో చిక్కుకుంటే, వివాదాన్ని స్వచ్ఛంధంగా ఆహ్వానిస్తే, లేదా ఏదైనా వివాదాన్ని సృష్టిస్తే ఈ గుప్తత హక్కు ఉండదు. 2. ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది. విషయం ప్రజల రికార్టు అయినప్పుడు, ఈ గుప్తత హక్కు ఉండదు. కానీ ఎవరైనా మహిళ ఏదైనా అత్యాచారానికి గురైనప్పుడు, కిడ్నాప్‌ అయినప్పుడు ఏదైనా నేరంలో ఇరుక్కున్నప్పుడు వారిని అగౌరవపరిచే విధంగా ప్రసార మాధ్యమాలలో, అచ్చు మాధ్యమాల్లో ప్రచారం చేయకూడదు. 3. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సుప్రీంకోర్టు రెండవ మినహాయింపును ప్రకటించింది. వారి విద్యుక్త ధర్మానికి, నడవడికలకు ఈ గుప్తత హక్కు వర్తించదు.

గుప్తత హక్కును విస్తరింపచేసినప్పటికీ సుప్రీంకోర్టు అది సంపూర్ణం కాదని స్పష్టం చేసింది. ఈ హక్కుకీ పరిమితులు ఉన్నాయని కూడా ప్రకటించింది. ఇదే విషయం ఎక్స్‌ వర్సెస్‌ హాస్పిటల్‌ కేసులో కూడా చర్చకు వచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తికి హెచ్‌.ఐ.వి. వైరస్‌ సోకిందన్న విషయం ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్న కుటుంబ సభ్యులకు తెలియచేశాడు అతణ్ణి పరీక్షించిన డాక్టరు. ఆ విధంగా తెలియచెయ్యడం తన గుప్తత హక్కుకు భంగం కలిగించడమేనని అతడు కోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వ్యక్తి గుప్తత హక్కును పునఃపరిశీలించి ఈ హక్కు సంపూర్ణం కాదని ఇతరుల స్వేచ్ఛను, హక్కులను, ఆరోగ్యాలను కాపాడటానికి జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది.

టెలిఫోన్‌ సమాచారాన్ని ట్యాపింగ్‌ చేయడం వ్యక్తి గుప్తత హక్కులోకి జోరబడటమే అవుతుందా? అది వ్యక్తిగత సంభాషణ అని, రహస్యమైనదని సుప్రీంకోర్టు ముందు పీపుర్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా((1997) ఎస్‌.సి.సి.301) కేసులో వాదించారు. టెలిఫోన్‌ సంభాషణను ట్యాపింగ్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తీర్పులో ప్రకటించింది. అయితే ఈ ట్యాపింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాలలో అవసరం అవుతుంది. అందుకోసం చట్టాన్ని తయారు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ విధంగా కాకుండా వ్యక్తుల సంభాషణను ట్యాపింగ్‌ చేస్తే అది ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కులలోకు జోక్యం చేసుకోవడమే అవుతుంది.

ఇంటర్నెట్‌ వచ్చిన తర్వాత వ్యక్తులపైన, వాళ్ళ అలవాట్లపైన నిఘా పెట్టడం సులువై పోయింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ ఉద్యోగుల మెయిల్స్‌ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనక్కొంటున్నాయి. ఇది వ్యక్తుల గుప్తత హక్కులోకి జోరబడడమే. వారిని నియంత్రించడానికి ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ చట్టంలో 2000లో సె.43 ఏర్పరిచారు. ఏ యాజమాన్యమైనా అనుమతి లేకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని చూస్తే నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టంలోని ఈ నిబంధన ఉపయోగపడుతుంది. అయితే ఈ నిబంధన సరిపోదని అనిపిస్తోంది.

స్టింగ్‌ ఆపరేషన్లు అవసరమే. కానీ ప్రసార మాధ్యమాలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్పుడు విషయాలను కూడా ప్రసారం చేసి వ్యక్తుల గుప్తత హక్కుల్లో జోరబడుతున్నాయి. వీటిని నియంత్రించుకోవడానికి చట్టం లేదు. ప్రసార మాధ్యమాలు కూడా ఎలాంటి నిబంధనలను, నియమాలను ఏర్పరచుకోలేదు.

సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత గుప్తత హక్కు మరోసారి చర్చనీయాంశం అయింది. పబ్లిక్‌ అధారిటీస్‌ దగ్గర ఉన్న వివిధ వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వవచ్చా లేదా, ఇస్తే అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్లో జోరబడినట్లు అవుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత హక్కులో జోరబడినట్లు కాదని చట్టం భావిస్తున్నది. పారదర్శకత, జవాబు దారీతనం అవసరమని ఈ చట్టం భావిస్తుంది.

గుప్తత హక్కు అనేది జీవించే హక్కులో భాగమే కానీ అది సంపూర్ణమైనది కాదు. నేరాలను నిరోధించడానికి, ఇతరుల ఆరోగ్యాలను, స్వేచ్ఛలను రక్షించడానికి, నీతి నియమాలను పరిరక్షించడానికి గాను ఈ హక్కుకు దీనికి పరిమితులను ఏర్పరచవచ్చు. వ్యక్తి ప్రాథమిక హక్కులకి సమాజ హితానికు, మధ్య సమస్య తలెత్తినప్పుడు సమాజ హితమే ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.

Sunday, July 19, 2009

ద్వేషించే నేరాలు !

భారత దేశస్థులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న దాడులు ఒక్క భారతీయులను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలామంది ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్క నెలలో నాలుగు దాడులు జరిగాయి ఒక జాతిపై జరుగుతున్న దాడుల వల్ల ఆస్ట్రేలియా జాతికి ఉన్న మంచి పేరు కాస్తా తొలగిపోతోంది మెల్‌బోర్న్‌ లోనే ముగ్గురు విద్యార్థులపై దాడులు జరిగాయి. స్క్రూడైవర్‌తో ఒకరిపైన, మిగతా ముగ్గురిపైన కత్తితో దాడులు జరిగాయి. సిడ్నీలో భారతీయ విద్యార్థిమీద పెట్రోలు బాంబుతో దాడి జరిగింది. ఒక జాతికి చెందిన ప్రజల మీద, ఒక మతానికి చెందిన ప్రజల మీద దాడులు ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశం 1670లో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఇంచు మించు ఈ విషయంలో అదే విధంగా ఉంది. రక రకాల మతాలకు, జాతులకు చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి దాడుల సంఘటనలు జరగడానికి అవకాశం ఉన్నా,అవి జరగకుండా నియంత్రించడానికి సరైన యంత్రాం గం, చట్టాలు అవసరం. ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోవా, కొత్త చట్టాలు అవసరమా అన్నది ప్రశ్న.మామూలుగా చూసినప్పుడు అత్యల్ప విషయంగా కనిపించే సంఘటన ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం కల్పిస్తుంది. స్వార్ధ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ఆ చిన్న సంఘటనని మతపరమైన దాడిగా చిత్రీకరించి ఘోరమైన సంఘటనలు జరగడానికి కారణమవుతున్నారు. చిన్న సంఘటనల వల్లనే కాదు, ఒక్కోసారి పెద్ద సంఘటనల వల్ల కూడా ‘ద్వేషించే నేరాలు’ (హేట్‌ క్రైమ్స్‌) జరిగే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణలు- ఇందిరా గాంధీ హత్య తరువాత మన దేశంలో చెలరేగిన అల్లర్లు, సెప్టెంబర్‌ 11 సంఘటన తర్వాత అమెరికాలో జరిగిన సంఘటనలు వంటివి ఎన్నో! సెప్టెంబర్‌ సంఘటన తర్వాత 2001లో సిక్కు మతానికి చెందిన బల్‌బీర్‌ సింగ్‌ సోధీని అమెరికాకు చెందిన ఫ్రాంక్‌ సిల్వారోక్‌ చంపేశాడు అమెరికా జ్యూరీ అతడికి మరణ శిక్ష విధించింది. క్రిష్టియన్‌ మిషనరీకి చెందిన గ్రాహమ్‌ స్టేన్స్‌ని అతని కుమారుని సజీవ దహనం చేసిన కేసులో దారాసింగ్‌ అనే వ్యక్తికి మన దేశంలోని కోర్టు మరణశిక్ష విధించింది. జాతి సంబంధమైన, మత సంబంధమైన నేరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రోజు రోజుకీ ఈ నేరాల సంఖ్య పెరుగుతోంది. విద్వేష పరమైన ప్రసంగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటి దాడులను, ‘ద్వేషించే నేరాలు’ అనీ, ఇలాంటి ప్రసంగాలను ‘అసహ్యకరమైన ప్రసంగాలు’ అని అంటున్నారు. ఏదైన ఒక ప్రత్యేకమైన సాంఘిక బృందంలో ఎవరైనా ఒక వ్యక్తి సభ్యుడైనందున ఆ వ్యక్తిపై ఎవరైనా దాడికి పాల్పడితే దానిని ‘అసహ్యకరమైన నేరం’అని అంటున్నాం. ఆ ప్రత్యేకమైన బృందం మతపరమైనది కావచ్చు, అంగ పరమైనది కావచ్చు, రాజకీయ పరమైనది కావచ్చు. ఆ బృందంలో సభ్యుడైనందుకు దాడులు జరిగితే దానిని ‘ద్వేషించే నేరం’ అని అంటున్నారు. ఆ దాడులు భౌతికంగా ఉండవచ్చు, మానసికంగా ఉండవచ్చు. ఆ నేరాలు ఆస్తికి నష్టం కలిగించడం ద్వారా, వేధించడం ద్వారా,తిట్టడం ద్వారా, అవమానించడం ద్వారా జరగవచ్చు. పిచ్చి పిచ్చి బొమ్మ లు రాయడం ద్వారా కూడా జరగవచ్చు. ఎవరైన వ్యక్తి చర్యలు విద్వేష పూరితంగా ఉన్నాయని, హాని కలిగించేవిగా ఉన్నాయని బాధితులు గానీ, లేక ఇతర వ్యక్తులు గానీ భావిస్తే వాటిని ఇంగ్లాండ్‌లో ‘హేట్‌ క్రైమ్స్‌’గా పరిగణిస్తున్నారు. ఈ దాడులు భౌతికంగా కాని, మాటల ద్వారా కాని, భయపెట్టడం ద్వారా కాని,అవమానించడం ద్వారా కాని కావచ్చు అవి ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. నల్ల జాతికి చెందిన వ్యక్తులమీద, మైనారిటీలకు చెందిన 87 వేల మంది వ్యక్తుల మీద బ్రిటన్‌లో 2004 సంవత్సరంలో దాడులు జరిగాయని ఆ దేశంలో జరిపిన ఒక సర్వే చెబుతోంది. అమెరికాలో 1991లో ‘హేట్‌ క్రైమ్‌’ను నిర్వచించారు. ఒక వ్యక్తి తెగకు సంబంధించి,వర్ణానికి సంబంధించి, జాతీయతకు సంబంధించి ఎవరైనా నేరం చేస్తే అది హేట్‌ క్రైమ్‌ అవుతుంది. 31 రాష్ట్రాలలో ఇందుకు సంబంధించిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.మన దేశంలో హేట్‌ క్రైమ్స్‌ను నిర్వచించలేదు. ఇందుకు సంబంధించి ప్రత్కేక చట్టం కూడా లేదు. ఇందుకు ప్రత్యేక చట్టం అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ద్వేషించే నేరాలను నియంత్రించకపోతే అవి తీవ్ర రూపం దాల్చుతాయి. ఫలితంగా ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంది. అందుకని ద్వేషించే నేరాల గురించి దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మత పరంగా, జాతి పరంగా, వర్ణ పరంగా జరిగే నేరాలను అదుపు చెయ్యడానికి మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను నియంత్రించడానికి సంబంధించి భారతీయ శిక్షా స్మృతిలో చాలా నిబంధనలు ఉన్నాయి మత విద్వేషాలను,జాతి విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై కేసులు నమోదు చేయడానికి చాలా నిబంధనలు ఆ కోడ్‌లో ఉన్నాయి. అలాగే ఆ నేరాలను ప్రేరేపించే వ్యక్తులపైనా, కుట్రలు పన్నే వ్యక్తులపైనా చర్యలు తీసుకోవడానికి కూడా నిబంధనలు భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపైన, తిరుగుబాటు చేసే వ్యక్తులపైన, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులపైన, విద్వేషం కలిగించే అన్ని నేరాలకు సంబంధించి ఈ చట్టంలో నిబంధనలున్నాయి. అయితే వాటిని సక్రమంగా దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఉపయోగించుకోవాలి. 2001 సెప్టెంబర్‌ 8న దర్బన్‌లో జాతి వివక్షకి, విదేశీ వస్తువుల వ్యతిరేకతకి సంబంధించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను ఉపయోగించి బాధితులకు రక్షణ కల్పించాలని ఆ సదస్సు ప్రకటన జారీ చేసింది. ఈ నేర బాధితులకు చట్టం అందుబాటులో ఉండి, వారికి రక్షణ కల్పించే విధంగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని, అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని ఈ సదస్సు కోరింది. ఈ నేపథ్యంలో ద్వేషించే నేరాలను అదుపు చేయడానికి కొత్తచట్టం తీసుకు రావాలన్న డిమాండ్‌ సహజంగానే వస్తుంది. అయితే, ఇప్పటికీ మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను అదుపు చెయ్యడానికి, అందుకు పాల్పడ్డ వ్యక్తులపై చర్య తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు భారతీయ శిక్షాస్మృతిలో ఉన్నాయి. కాబట్టి కొత్త చట్టం అవసరం లేదు గానీ, వాటిని దర్యాప్తు చేయడానికి యంత్రాంగం అవసరం ఉంది. నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని రూపొందించాలి ఇటువంటి ద్వేషించే నేరాలకు సంబంధించిన కేసులను సత్వరంగా పరిష్కరించే కోర్టులను ఏర్పాటు చేయాలి. నేరాలు జరిగినప్పుడు వాటిని అందరూ ఖండించాలి. అంతర్జాతీయంగా ఒకరికొకరు ఈ నేరాలను నియంత్రించడానికి సహకరించుకోవాలి. ఎందుకంటే, ఒక దేశంలో జరిగిన సంఘటన ప్రభావం మరో దేశంలో పడే అవకాశం ఉంది.

Saturday, July 11, 2009

కేసు ముందా దర్యాప్తు ముందా?

సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తుల మీద ప్రథమ సమాచార నివేదిక విడుదల కాగానే ఆ వ్యక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తప్పుడు కేసు పెట్టారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని ఆందోళనలు మొదలవుతాయి. ప్రథమ సమాచార నివేదిక విడుదల తరువాత దర్యా ప్తు ఉంటుందా? దర్యాప్తు తరువాత ప్రథమ సమాచార నివేదిక ఉంటుందా? ఆధునికసమాజంలో న్యాయపరిపాలన ముఖ్యమైన అంశం. ఇది లేకుండా నాగరిక సమాజాన్ని ఊహించలేం. కాగ్నిజబుల్‌ నేరాలనేవి బాధితులకు వ్యతిరేకంగా జరిగేవి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగేవి. నేరస్థుడు సమాజ హక్కుల్లోకి జొరబడే వ్యక్తి. శాంతి భద్రతలకు, వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తన విధి నిర్వర్తించాలంటే నేర సమాచారం తెలియా లి. నేర సమాచారంలో మొట్టమొదటి అడుగు ప్రథమ సమాచారం.ఇది అందిన తరువాతే క్రిమినల్‌ చట్టంలో చలనం కలు గుతుంది. ఆ తర్వాతే దర్యాప్తూ, విచారణ. ఆ తరువాత శిక్ష పడే అవకాశం. ప్రాసిక్యూషన్‌ కేసుకు బలాన్ని ఇచ్చే సాక్ష్యం- ప్రథమ సమాచార నివేదిక.పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి దర్యాప్తు మొదలు పెట్టడానికి, సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైనది- ప్రథమ సమాచార నివేదిక. ఇది అతి ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన పత్రం. ఇది స్థిరమైన సాక్ష్యం కానప్పటికీ, దీనికి అత్యంత విలువ ఉంది. ఇది ముద్దాయి ప్రయోజనాలను కాపాడుతుంది. సమాజహితాన్ని కలుగజేస్తుంది. అందుకని వివేకం కలిగిన ప్రతి మనిషి కాగ్నిజబుల్‌ నేరం జరుగగానే అది పోలీసులకు తెలియాలని కోరుకుంటాడు.ప్రథమ సమాచారం అందించడంలో జాప్యం జరిగితే దాని మీద అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కల్పనలు చోటు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. జాప్యం వల్ల సమాచార ప్రవాహం పోతుంది. జాప్యం అనేది ప్రతిసారి ప్రాసిక్యూషన్‌ కేసుకి ప్రాణాంతకం కాదు. దాని వల్ల ముద్దాయి విముక్తి పొందుతాడని అనలేం. అయితే జాప్యానికి గల కారణాలు తెలియచెయ్యాలి. ఎలాంటి వివరణ లేని జాప్యం ఉంటే కల్పితాలకు అవకాశం ఉందని కోర్టులు భావించే అవకాశం ఉంది. అలా అని సత్వరంగా ప్రథమ సమాచారాన్ని అందించ డంవల్ల ప్రాసిక్యూషన్‌ కేసు బలంగా ఉంటుందని కూడా అన లేం. కేసులోని వాస్తవ పరిస్థితులను బట్టి ప్రథమ సమాచార నివేదిక ప్రాముఖ్యతను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే జాప్యం అనేది పోలీసులు స్వీకరించడంలో జరుగకూడదు.జాప్యాలను డిఫెన్స్‌ న్యాయవాది శ్రద్ధగా గమనించాలి. ఏ రకంగా జాప్యం ఉన్నా డిఫెన్స్‌ న్యాయవాది దాన్ని ఆయుధంగా మలుచుకుంటాడు. కేసు తొలిదశలో ప్రథమ సమాచార నివేదికలోని కథనాన్ని బట్టి పరిశోధన అధికారి దర్యాప్తు మొదలుపెడతాడు. అది సరైందే. కానీ ప్రతిసారి అలాగే చెయ్యడం సమం జసం కాదు. గుడ్డిగా ప్రథమ సమాచార నివేదికలోని విషయాలను నమ్మకూడదు. కొంతమంది తమ ప్రత్యర్థులకు ఇరికించడానికి తప్పుడు నివేదికను ప్రణాళికాబద్ధంగా ఇచ్చే అవకాశం ఉంది. అందుకని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రథమ సమాచార నివేదికకు భిన్నంగా సాక్ష్యాలు వస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారి సేకరించాలి. ప్రాథమిక దృష్టిలో చూసినప్పుడు, నేర సమాచారం కాగ్నిజబుల్‌ నేరానికి సంబంధించినది అయినప్పుడు ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారిపై ఉంటుంది. సె.154 సి.ఆర్‌.పి.సి. ప్రకారం ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాలి ఈ విషయంలో ఎంపిక చేసుకొనే అవకాశాన్ని చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వనీయత కనిపించడం లేదన్న కారణంగా గాని లేదా అవసరమైన వివరాలు లేవనిగాని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత గురిం చి చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారన్న విషయం తేలితే కేసుని మూసివేసి పోలీసు అధికారి తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు.అవసరమని భావించినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవచ్చు (తులసీరామ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎం. పి. 1993, క్రిమినల్‌ లా జనరల్‌ 1165 ఎం.పి).అందిన సమాచారంలో కాగ్నిజబుల్‌ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి తప్పక కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కురుక్షేత్ర యూనివర్సిటి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హర్యానా, 1977, క్రిమినల్‌ లా జనరల్‌ 1990 కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయడానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడానికి కావలసిన అంశాలు రెండే రెండు.
మొదటిది:అది సమాచారం అయి ఉండాలి.
రెండవది:అది కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయి ఉండాలి.కేసు నమోదు దశలో ఈ రెండు అంశాలను మాత్రమే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి పరిశీలించాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154 అదేశం ఇది ఈ దశలో సంబంధిత పోలీస్‌ అధికారి సమాచారంలోని విశ్వసనీయత గురించి, నిజా- నిజాల గురించి ప్రాథమిక విచారణను చేపట్టడానికి వీల్లేదు. శాసనకర్తలు తమ వివేకాన్ని అనువర్తింప చేసి చాలా జాగ్రత్తగా నేర్పుగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154(1)ను పొందుపరిచారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-41(ఎ) లేదా (జి) సహేతుకమైన ఫిర్యాదును విశ్వసనీయ సమాచారంగా పేర్కొన్నాయి. అలాంటి గుణాత్మకమైన భావాన్ని సూచించే పదబంధాలను సె-154 లో పొందుపరచలేదు. అందుకు కారణం- కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు ప్రథమ సమాచార నివేదికను అందులోని సమాచారంలో సహేతుకత లేదా విశ్వసనీయత లేదన్న కారణంగా పోలీసు అధికారి నిరాకరించడానికి వీల్లేదు. కేసు నమోదు కావడానికి అవి రెండు షరతులు కావు. మరో విధంగా చెప్పాలంటే అందిన సమాచారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయితే చాలు. పోలీసు అధికారి సెక్షన్‌ 154(1) ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదు. సె-154(1) ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు తప్పకుండా వెంటనే ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది (స్టేట్‌ ఆఫ్‌ హర్యానా వర్సెస్‌ భజనేలాల్‌, 1992 క్రిమినల్‌ లా జనరల్‌ 527 సుప్రీం కోర్టు).అస్పష్ట సమాచారం ఆధారంగా పోలీసు అధికారి ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం రాత పూర్వంగా అందినప్పుడు దాని ఆధారంగా కేసు నమోదు చేయాలి. ఎవరైన మౌఖికంగా సమాచారం అందచేసినప్పుడు, దాన్ని రాతపూర్వకంగా నివేదిక రాసి, అతనికి చదివి వినిపించి, అతని సంతకం తీసుకొని కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారంలోని సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పుస్తకంలో రాయాల్సి ఉంటుంది. ప్రథ మసమాచార నివేదికను సంబంధిత మెజిస్ట్రేటుకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాని అస్పష్ట సమాచారం అందినప్పుడు ప్రథ మ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసం లేదు. అయితే అలాంటి సమాచారం అందినప్పుడు ఆ సమాచార వివరాలను జనరల్‌ డైరీలో నమోదు చేసి మరికొంత సమాచారాన్ని సేకరించుకొన్న తర్వాత కేసు నమోదు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు సోమాబాయి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ ఏ.ఐ.ఆర్‌. 1975, ఎస్‌.సి.1453; జహుర్‌, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యు.పి., 1990, క్రిమినల్‌ లా జర్నల్‌ 56, తుల్వకాలి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు ఏ.ఐ.ఆర్‌. 1973, సుప్రీంకోర్టు 501 కేసులలోని సారాంశాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గుడిసె వెంకప్ప, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ 1995(3) సి.సి.ఆర్‌. 129. ఆంధ్రప్రదేశ్‌ డివిజన్‌ బెంచ్‌ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది- ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లోని సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జీ అధికారికి అందినప్పుడు దాని ఆధారంగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది సమాచారం ఎవరైనా వ్యక్తి నుంచి వచ్చినది కావచ్చు లేదా టెలిఫోన్‌ ద్వారా వచ్చినది కావచ్చు. దాన్ని సాధారణంగా పోలీస్‌స్టేషన్‌లోని జనరల్‌ డైరీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రథమ సమాచారంగా లేదా దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడాన్ని చేపట్టారని అనుకోవడానికి వీల్లేదు సమాచారం అస్పష్టంగా ఉన్నప్పుడు దాని గురించి ప్రాథమిక విచారణ జరిపి ప్రథమ సమాచార నివేదిక విడుదల చేసే అధికారం పోలీసు అధికారికి ఉంటుంది’.

Friday, June 26, 2009


నేరబాధితులకు మేలు చేసే నిబంధనలు 27.6.09

‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు 2008’ చట్ట రూపంగా మారింది. కానీ అది అమల్లోకి రాలేదు. అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా ఈ చట్టం గురించి క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఆ ఒత్తిడి వల్ల ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. ఏ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియని పరిస్థితి మనదేశంలో నెలకొన్నది. ఆ చట్టంలో అరెస్టు విషయం గురించి తెచ్చిన సవరణల పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. అయితే బాధితుల గురించి గతంలో కొంత చర్చించడం జరిగింది. ఈ సరవణల గురించి న్యాయ వాదులకు అభ్యంతరాలు లేవు. కనీసం ఈ నిబంధనలనైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చే విధంగా ప్రకటన జారీ చేస్తే బాగుండేది. కానీ అది ఇంకా జరగలేదు. వీటి అమలు కోసం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది. ఆ సవరణలను పరిశీలిద్దాం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఎక్కడైనా నేరస్థుల ప్రస్తావన, ముద్దాయిల హక్కుల గురించిన నిబంధనలే కనిపిస్తాయి కానీ బాధితుల ప్రస్తావన కనిపించదు. ఒకటి రెండు నిబంధనల్లో వీరి ప్రస్తావన ఉంది. బాధితుల గురించిన నిర్వచనం కూడా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే, నేర న్యాయ వ్యవస్థ మరిచి పోయిన వ్యక్తి బాధితుడు/ బాధితురాలు.

ప్రతి చట్టంలో సాధారణంగా సె.2లో నిర్వచనాలు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా సె.2లో చాలా పదాలను నిర్వచించారు. నేరస్థులని, బాధితులని నిర్వచించలేదు కానీ నేరస్థుల ప్రస్తావన చట్టం మొదటి నుంచి చివరి దాకా ఉంటుంది. కానీ బాధితుల గురించి రెండు, మూడు నిబంధనల్లో మినహ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మానభంగానికి గురైన బాధితురాలికి వైద్య పరీక్ష జరిపించాలన్న నిబంధన కూడా కోడ్‌లో కనిపించదు. ఈ నేపథ్యంలో బాధితులను ఈ కొత్త చట్టంలో నిర్వచించినారు. 2(ఠ్చీ) ప్రకారం ‘బాధితులు’ అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి చర్యల వల్ల, లేదా ఏదైనా చేయాల్సిన ఆ చర్య చేయకలేకపోవడం వల్ల బాధపడుతున్న వ్యక్తి. బాధితుల సంరక్షకులు, వారి చట్ట బద్ధ ప్రతినిధులు కూడా ఈ నిర్వచనంలోకి వస్తారు. వాళ్ళని కూడా బాధితులుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

బాధితులు తమకి తాముగా న్యాయవాదిని నియమించుకునే అవకాశం లేదు. సె.301(2) ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులు న్యాయవాదులను నియమించుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశాలకు లోబడే పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతితో రాతపూర్వకంగా వాదనలు సమర్పించే అవకాశం ఉంది. నేరాలన్నీ రాజ్యానికి వ్యతిరేకంగా చేసేవని చట్టం భావిస్తుంది. అందుకని బాధితుల తరపున ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తాడు. కొన్ని సందర్బాలలో బాధితులు న్యాయవాదులని నియమించుకోవచ్చు. కానీ వాళ్ళు పై నిబంధన ప్రకారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆజామాయిషీలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి ఈ సవరణలు తీసుకొచ్చిన చట్టంలో సె.24(8) క్రింద ప్రొవిసోని ఏర్పరిచారు. ఆ ప్రకారం బాధితురాలు తనకు ఇష్టమైన న్యాయవాదిని నియమించుకోవడానికి కోర్టు అనుమతించవచ్చు.

నేరం జరిగిన సమాచారం అందగానే పోలీసు అధికారి కేసు నమోదు చేసి నేరస్థలానికి వెళ్ళాలి. నేరానికి సంబంధించిన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయా లేదా పరిశీలించాలి. అదే విధంగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మానభంగానికి గురైన వ్యక్తులని కూడా కొన్ని సందర్భాలలో నేరస్థలంలోనే విచారించాల్సి రావచ్చు. అది వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి కోడ్‌లోని సె.157 క్రింద ప్రొవిసోని ఏర్పాటు చేశారు. మానభంగానికి గురైన బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంటి దగ్గర గానీ లేదా ఆమె ఎంపిక చేసుకున్న స్థలంలో గానీ నమోదు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆమె వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి ఆ బాధితురాలి సంరక్షకుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల సమక్షంలో లేదా బందువుల సమక్షంలో లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన సాంఘిక సేవా కార్యకర్త సమక్షంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

పిల్లలపైన జరిగిన లైంగిక దాడుల కేసులు, మానభంగానికి సంబంధించిన కేసుల దర్యాప్తు నిర్దేశించిన కాల పరిమితిలోగా జరగాలి. ఈ విధంగా సె. 173 (ఐఎ) నిబంధనను ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రకారం ఆ నేర సమాచారం నమోదు చేసిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ దర్యాప్తులను పోలీసు అధికారులు తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ నేరాల విచారణను సాధ్యమైనంతవరకు మహిళా న్యాయమూర్తులు, మహిళా మేజిస్ట్రేట్‌లు జరపాలి. అంతే కాదు, ఈ నేరాల విచారణ గోప్యంగా జరపాల్సి ఉంటుంది. ఈ నేరాలకి సంబంధించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించవచ్చు కానీ బాధితురాలి చిరునామా వివరాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది.

బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సె.357 నిబంధన ఉంది. ఈ నిబంధన బాధితుల అవసరాలని పూర్తిగా తీర్చడం లేదు. ఈ విషయాన్ని గమనించి చట్టంలో సె.357(డి) అన్న కొత్త నిబంధనను చేర్చారు. సె.357 ప్రకారం ముద్దాయిల నుంచి మాత్రమే నష్టపరిహారాలను కోర్టులు మంజూరు చేసేవి. ముద్దాయిల ఆర్థిక స్తోమత బాగులేకపోతే బాధితులకు కోర్టు మంజూరు చేసిన నష్టపరిహారం లభించక పొయేది. ఈ కొత్త నిబంధన ఆ పరిస్థితిని అధిగమిస్తుంది.

అదే విధంగా ముద్దాయికి శిక్ష పడినప్పుడు మాత్రమే కోర్టులు నష్టపరిహారం చెల్లించమని ముద్దాయిని ఆదేశించే పరిస్థితి ఉంది. సె.357(ఎ) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఓ స్కీమును తయారు చెయ్యాలి. నేర బాధితుల, వారిపై ఆధారపడ్డ వ్యక్తులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి, వారికి పునరావాసం కల్పించే విధంగా ఈ స్కీముని తయారు చెయ్యాలి. కోర్టులో నేర విచారణ పూర్తి అయిన తరువాత నేర బాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టు సె.357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఆదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్ళకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఈ సిఫారసులను పరిశీలించి అవసరమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ నిర్ధారించిన మొత్తాన్ని ఈ స్కీమ్‌ ద్వారా ఏర్పరిచిన మొత్తం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. నేర విచారణ జరగనప్పుడు కూడా బాధితులు ఈ స్కీము ద్వారా నష్టపరిహారాలని కోరే అవకాశం ఉంది.సె.372కి కూడా ఒక ప్రొవిసోని ఏర్పరిచారు. ఈ ప్రొవిసో ప్రకారం బాధితులు అప్పీలు చేసే అవకాశం ఉంది. ముద్దాయిని విడుదలచేసినప్పుడు, తక్కువ శిక్ష పడినప్పుడు ఈ ప్రొవిసో ఉపయోగపడుతుంది. సవరణలు తీసుకొచ్చిన చట్టం అమల్లోకి రాకపోవడం వల్ల ఈ నిబంధనలు కూడా అమల్లోకి రాకుండా పోతున్నాయి. ఫలితంగా నేర బాధితులు నష్టపోతున్నారు. కనీసం ఈ నిబంధనల అమలు గురించి ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేది.

Monday, June 22, 2009

mba-online-program.com
Counter provided by mba-online-program.com .

బ్లాగ్‌లు - లీగల్‌ సమస్యలు


బ్లాగ్‌లు - లీగల్‌ సమస్యలు



ఒక విషయాన్ని తెలియచెప్పడం అనేది ఒక కళ. ఒకే విషయాన్ని కొంతమంది చాలా అందంగా, ఆకర్షించేట్టు చెబుతారు. మరి కొందరు ఆ విధంగా చెప్పలేకపోతారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత కమ్యూనికేషన్‌ చాలా వృద్ధి చెందింది. అచ్చు యంత్రం వచ్చిన తరువాత ఇది అభివృద్ధిలోకి వచ్చింది. ఇంటర్‌నెట్‌ యుగంలో కమ్యూనికేషన్‌ ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో ‘బ్లాగులు’ వచ్చేశాయి. కొంత బ్లా గుల్లో రాసుకున్న సమాచారాన్ని పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. ఓ యువతి తన బ్లాగ్‌లో రాసిన నవల ఇంగ్లీషులో వచ్చి చాలా ప్రాచుర్యాన్ని పొందింది. కొన్ని బ్లాగ్‌లు సమాచారాన్ని ఇస్తున్నార ుు. మరికొన్ని బ్లాగ్‌లు చర్చావేదికలుగా ఉంటున్నాయి. చాలా మంది ప్రముఖులు కూడా బ్లాగులని నిర్వహిస్తున్నారు. కొన్ని బ్లా గులని చాలా మంది చదువుతున్నారు. కొన్ని బ్లాగ్‌ల చర్చా వేదికల్లో కొందరు పాల్గొని తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. ఈ బ్లాగ్‌ల్లో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే ఎవరిపైన చర్య తీసుకోవాల్సి ఉంటుం ది. వారి పైన పరువు నష్టం కలిగించినారని సివిల్‌, క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడానికి అవకాశం ఉందా? డి.అజిత్‌ అనే వ్యక్తిపైన శివసేన కార్యకర్తలు ముంబైలో క్రిమినల్‌ కేసుని దాఖలు చేశారు. తన పై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయాలని అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విఫలమైనాడు. ఈ నేపథ్యంలో బ్లాగుల గురించి, చట్టపరమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన విషయాలు తెలుసుకునే ముందు బ్లాగ్‌ అనే పదబందం ఎట్లా అమల్లోకి వచ్చిందో చూద్దాం. వెబ్‌(ఠ్ఛీఛ), లాగ్‌(జూౌ) అన్న రెండు పదాల నుంచి బ్లాగ్‌ అన్న పదబందం వాడుకలోకి వచ్చింది.

బ్లాగ్‌ అంటే ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉన్న ‘అంతర్జాల డైరి’. ప్రజల అభిప్రాయాలని అంతర్జాల పేజీలలో తెలియచేసే అవకాశం ఉన్న స్థలం. తమ వ్యక్తిగత అభిప్రాయాలని బ్లాగ్‌ల్లో వ్యక్తపరచవచ్చు. లేదా సమకాలీన సమస్యల మీద సంఘటనల మీద తమ అభిప్రాయాలని బ్లాగ్‌ల్లో వ్యక్త పరచవచ్చు. ఆ క్షణంలో జరుగుతున్న సంఘటనల మీద కూడా అప్పటికప్పుడు తమ అభిప్రాయాలని వ్యక్తపరచడానికి అవకాశం ఉన్న స్థలం, సాధనం బ్లాగ్‌. బ్లాగ్‌ను సంపాదించడం చాలా సులువు. బ్లాగ్‌ను ఏ విధంగా తయారుచేసుకోవచ్చోనన్న విషయం అంతర్జాలంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తి అయినా సులువుగా తెలుసుకోవచ్చు. తమ వ్యక్తిగత సమాచారాన్ని కొంతమేరకే తెలియపరిచి బ్లాగ్‌లను సృష్టించుకునే అవకాశం ఉంది. ఈ బ్లాగ్‌లకి అవసరమైన స్థలాన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వాడుకందార్లకి ఉచితంగా అందచేస్తున్నాయి. ఈ స్థలానికి వాళ్ళు ఎలాంటి డబ్బులని కూడా తీసుకోవడం లేదు.

ఇంత సులువుగా, ఎలాంటి ఖర్చు లేకుండా సంపాదించుకునే ఈ స్థలానికి ప్రచురణ కర్త ఎవరు? బ్లాగ్‌లలో పరువునష్టం కలిగించే రాతలని, మీద విద్వేషాలని కలిగించే రాతలని, అసభ్యకరమైన బొమ్మలని ప్రచురిస్తే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? దీని బాధ్యత ఆ బ్లాగ్‌ని నిర్వహిస్తున్న వ్యక్తిపై ఉంటుం దా? ఆ స్థలాన్ని సమకూర్చిన ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌పై ఉంటుందా? ఆ సమాచారాన్ని అందులో ఉంచిన వ్యక్తిపై ఉంటుందా? ఈ ముగ్గురిపై ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మన దేశంలో సరైన సమాధానం లేదు. దానికి కారణం- వీటిని నియంత్రించడానికి అవసరమైన శాసనం ఇంకా మన దేశంలో లేదు.

బ్లాగ్‌లో కన్పించే అసభ్యకరమైన పదాలని బొమ్మలని తొలగించడానికి వడబోత యంత్రాంగం ఉంది. కానీ ఆ వడబోత ‘స్పామ్‌’ (టఞ్చఝ)లు అన్నింటిని తీసివేయలేవు. పరువు నష్టానికి సంబం ధించిన విషయాలు సందర్భాన్ని బట్టి మాత్రమే అర్థమవుతాయి. ఇది ఒక రకంగా ఉంటే కొన్ని బ్లాగుల్లోని పరిస్థితులు మరోరకం గా ఉంటాయి. కొన్ని బ్లాగ్‌లు చర్చలని, అభిప్రాయాలని చదువరు ల నుంచి తీసుకుంటాయి.వాటిల్లో ఏవైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే బ్లాగ్‌ యజమాని దానికి బాధ్యత వహించాల్సి ఉం టుందా? అజిత్‌ విషయంలో అదే జరిగింది.

శివసేన అజిత్‌పైన క్రిమినల్‌ కేసుని దాఖలు చేసింది. మతపరమైన భావాలని భంగ పరుస్తున్నాడని, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని ముంబైలోని పోలీస్‌ స్టేషన్లో అతనిపై ఫిర్యాదుని నమోదు చేసింది. తనపై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయమని అతను సుప్రీంకోర్టులో రిట్‌ పిటీషన్ని దాఖలు చే శాడు. సుప్రీంకోర్టు అజిత్‌పైన దాఖలైన కేసుని కొట్టివేయలేదు. అంతర్జాలంలోని తన బ్లాగ్‌లో ఉన్న సమాచారం ప్రపంచ వ్యాప్తం గా ఎంతోమందికి చేరుతుంది. అందుకని అందులో ఏవైనా అ భ్యంతర విషయాలు ఉంటే దాని పరిణామాలని అతను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. అంటే బ్లాగ్‌కి కూడా పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదిం చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ దానికి పరిమితులు ఉన్నా యి. ఆ పరిమితులకి లోబడే బ్లాగ్‌లో విషయాలు ఉండాలి. వార్తాపత్రికలకి, ఎలక్ట్రానిక్‌ మీడియాకి ఉండే పరిమితులు బ్లాగ్‌కి కూడా ఉన్నాయి.

అజిత్‌పైన కేసు 2008 ఆగస్టులో దాఖలైంది. అంటే ఐ.టి.చట్టానికి సవరణలు తీసుకొని రాకముందు ఈ కేసు దాఖలైంది. సవరణలు తీసుకొచ్చిన ఐ.టి. చట్టప్రకారం- బ్లాగ్‌ని నిర్వహిస్తు న్న వ్యక్తి ఆ బ్లాగ్లో ఇతరులు రాసిన వ్యాఖ్యలకి, వాఖ్యానాలకి బాధ్య త వహించడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యాలని అందులో నుంచి తొలగించనప్పుడు మా త్రమే అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ వ్యాఖ్యాలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని అనుకున్నప్పుడు కూడా బ్లాగ్‌ యజమాని ఆ వ్యాఖ్యాలకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అజిత్‌ బ్లాగ్‌లో వ్యక్త పరిచిన అభ్యంతరకర విషయాలు అతనివి కాదు. ఇతరులు వ్యక్త పరిచినవి. అయితే అతను ఆ బ్లాగ్‌కి కర్త. ఐ.టి. చట్టానికి సవరణలు రాకముందు జరిగిన సంఘటన అది. బాజి.కామ్‌ కేసు ఫలితంగా ఐ.టి. చట్టానికి సవరణలని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా చట్టాల్లో సవరణలు వస్తున్నాయని భావించడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ సవరణలు కూడా అజిత్‌ రక్షణకి వస్తాయని ఆశించవచ్చు.

Saturday, June 13, 2009

సార్వ భౌమ మినహాయింపు ఎప్పుడు వర్తించదు?
ఈప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు భంగం వాటిల్లిందని చెప్పడంతో కోర్టు బాధ్యత తీరిపోదు. నష్ట పరిహారాన్ని బాధితులకు చెల్లించాలి. అయితే, ఈ నష్ట పరిహారం కూడా సివిల్‌ చర్యల్లో భాగం కాకుండా, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినందుకు గాను పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. జరిగిన తప్పుకు- జరిగిన గాయానికి శాసన ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడమే కోర్టులు ఇచ్చే క్లేశ నివారణ చర్య. ఇలాంటి విషయాల్లో ‘సార్వభౌమ మినహాయింపు’ వర్తిం చదు. మోటారు వాహన ప్రమాదాలు రిగినప్పుడు కూడా ప్రభుత్వాలకు సార్వభౌమ మినహాయింపు వర్తించదు. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని చాలా కేసుల్లో స్పష్టం చేసినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతుంటాయి. కస్తూరీ లాల్‌ కేసులో ‘సార్వభౌమ మినహాయింపు’ గురించి చర్చ జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న సార్వభౌమ మిన హాయింపు అనేది రాజ్యం సేవకులు చేసిన సివిల్‌ నేరాలకు మాత్ర మే వర్తిస్తుంది. అది ఏమీ రక్షణ కూడా కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు 32, 226 ప్రకారం నష్టపరిహారం ఇమ్మని కోర్టులు ఆదేశించవచ్చు. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం అదే. కస్తూరీ లాల్‌ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు అతని వస్తువులు జప్తు చేసి తమ తప్పు వల్ల తిరిగి ఇవ్వలేదు. అది సివిల్‌ తప్పిదానికి కోరిన నష్టపరిహారం. అంతే కానీ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినందుకు కోరిన నష్ట పరిహారం కాదు. అందుకని కస్తూరీలాల్‌ కేసులోని తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వర్తించదు.తమ సేవకుల వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లైతే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం అభయం ఇచ్చిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛలను రాజ్యాంగ వ్యతిరేకం గా కాలరాచినప్పుడు, పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాలకు కోరే నష్ట పరిహారానికి అదనంగా ఈ నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రొసీడింగ్స్‌కు భిన్నంగా పబ్లిక్‌ లా ప్రొసీడింగ్స్‌ను నిర్దేశించారు. రాజ్యాంగం అభయం ఇచ్చిన ఆర్టికల్‌ 21 లోని అజేయమైన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. అందువల్ల దేశ పౌరులకు తమ హక్కులను, ప్రయోజనాలను రక్షించే న్యాయ వ్యవస్థ ఉందన్న విశ్వాసం కలుగుతుంది. ప్రాథమిక హక్కులకి రక్షణ కల్పించడంలో విఫలమైన రాజ్యాన్ని బాధ్యత వహించేలా చేసి కోర్టులు ఆర్టికల్‌ 32 లేక 226 ప్రకారం నష్టపరిహారాన్ని మంజూరు చేస్తున్నాయి. సివిల్‌ లా పరిధిలో ఉపశమనాల్ని ఇచ్చే పాత పద్ధతి వల్ల, కోర్టుల పరిధిని తగ్గించడమే అవుతుంది. ప్రజల సాంఘిక ఆకాంక్షల్ని కోర్టులు, చట్టాలు సంతృప్తి పరచాల్సిన బాధ్యత వాటిపై ఉంది. ఈ వాస్తవాలకు దూరంగా కోర్టులు ఉండటానికి వీల్లేదు. ముద్దాయిని శిక్షించడం వల్ల కావలసినంత ఊరడింపు బాధితుల కుటుంబాలకు దొరకదు.సివిల్‌ చర్యల వల్ల నష్టపరిహారం పొందడం కష్టమైన పని. డబ్బు రూపేణా నష్టపరిహారం ఇవ్వడం వల్ల కొంతవరకైనా బాధితులకు, వారి కుటుంబాలకు ఉపయోగం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ గాయాలని మాన్పే బలమైన ఉపశమనం ఇదే. నీలాబతి బెహవా కేసులో సుప్రీంకోర్టు సేవకుల తప్పిదాలకు రాజ్యం బాధ్యత వహించే విషయంలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెలిబుచ్చింది-ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్ళు సివిల్‌ కోర్టుల్లో కేసులు దాఖలు చేసుకోవచ్చు. అయితే సివిల్‌ కోర్టులకే వెళ్ళాలని హైకోర్టులు రిట్‌ పిటీషన్లలో అనడానికి వీల్లేదు. ఆ విధంగా ఉపశమనం పొందే అవకాశం ఉన్నప్పుటికీ పబ్లిక్‌ లా ప్రకారం ఎలాంటి నష్టపరిహారం రాదు అని కోర్టులు అనడం సరైంది కాదు.ఇది ఇలా ఉంటే, సివిల్‌ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ‘సార్వభౌమ మినహాయింపు’ను కోరుతుంటాయి. ఈ సిద్ధాంతానికి సుప్రీంకోర్టు ఎన్నడో తెర దించేసింది. అయినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నా యి. మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నాయి. ఈ మినహాయింపు వర్తించదని సుప్రీంకోర్టు పుష్పా టాకూర్‌ కేసులో స్పష్టం చేసింది.పుష్పా టాకూర్‌ కేసులోని విషయాలకు వస్తే- మిలిటరీ ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఓ మోటారు వాహన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయినాయి. కుడి కాలిని తీసివేయాల్సి వచ్చింది. బాధితుడు మోటారు వాహన చట్ట ప్రకారం నష్టపరిహారం కోరాడు. ట్రిబ్యునల్‌ అతని క్లయిమ్‌ను విచారించింది. ప్రమాదానికి కారణం ఆ వాహన డ్రైవరేనన్న నిర్ణయానికి వచ్చింది. కానీ ఆ ట్రక్కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్‌ బలగాలకు సంబంధించినది కాబట్టి సార్యభౌమ మినహాయింపు అనేది ఉంటుందన్న కారణంగా నష్టపరిహారాన్ని మంజూ రు చేయలేదు.బాధితుడు హైకోర్టుకి అప్పీలు చేశాడు. హైకోర్టు కూడా ట్రిబ్యునల్‌ అభిప్రాయాన్నే బలపరిచింది. అందుకని అతను సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.తన సేవకులు చేసిన పనులకి రాజ్యం బాధ్య వహించదన్న సూ త్రం పాతబడిపోయిందని, సార్వభౌమ మినహాయింపు వర్తించదని హైకోర్టు తప్పు తీర్పు ప్రకటించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం విషయంలో ఎలాంటి వివాదం లేదు. అందుకని ప్రభుత్వం అతని తప్పుకి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. క్ష రూపాయలను నష్టపరిహార మొత్తంగా సుప్రీంకోర్టు నిర్ధారించి హైకోర్టు తీర్పుని కొట్టివేసింది.తన సేవకులు చేసిన తప్పిదం వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో సివిల్‌ కేసుల ద్వారా కాకుండా రిట్‌ల ద్వారా కూడా కోర్టులు నష్ట పరిహారాలను మంజూరు చేయవచ్చు.

Followers