Thursday, October 27, 2011

బెయిల్ కాదిక అంత సులువు!







-విశ్లేషణ
మంగారి రాజేందర్‌అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, వరంగల్

‘‘వ్యక్తి స్వేచ్ఛ, న్యాయం, ప్రజల రక్షణ, ప్రజాధనం మీద భారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న అంశం బెయిల్.’’
- జస్టిస్ వి.ఆర్.క్రిష్ణయ్యర్,గుడికంటి నర్సింహులు కేసులో (1977)

‘‘బెయిల్ ఇవ్వడంలోనూ, నిరాకరించడంలోనూ సమాజ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నేరం సమాజానికి వ్యతి రేకంగా జరిగేదే. అందుకని బెయిల్ ఉత్తర్వు వ్యక్తి స్వేచ్ఛనూ, సమాజ హితాన్నీ సమతూకం చేసేదిగా ఉండాలి’’.
- జస్టిస్ దల్వీర్ భండారీ, ఎస్‌ఎస్ మెహ్రా కేసులో (2010)

అరెస్టు, బెయిల్ అనే పదాలు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో తరచూ కనిపిం చేవే. అందుకు కారణం ఎందరెందరో రాజకీయ ప్రముఖులు అరెస్టు కావడం, బెయిల్ రాక వారు జైళ్లలో ఉండటం. ఈ నేపథ్యంలో బెయిల్‌కు సంబంధించి న్యాయపరంగా నెలకొని ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఎస్ మెహ్రా కేసులో సుప్రీంకోర్టు ‘అరెస్టు-బెయిల్’ గురించి ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక ప్రకారం అరెస్టు చేసే అధికారం విపరీ తంగా దుర్వినియోగం అవుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులు ఈ చర్యలు చేపడుతున్నారు. కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షలు పడే అవకాశం 10 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు అరెస్టు విషయంలో కూడా పోలీసులు సంయమనం పాటించాలి. నేరం రుజువయ్యే దాకా ముద్దాయి అమాయకమైన పౌరుడు అని చెప్పే క్రిమినల్ జురిస్‌ప్రుడ్సెన్‌ను, సమాజహితాన్ని, ముద్దాయి స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.’’

బెయిల్ పొందే హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమై ఉంది. రాజ్యాం గంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టయిన వ్యక్తికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలోని హక్కులని గమనించి క్రిమినల్ కోర్టులు వ్యవహరించాల్సి ఉంటుంది. ముద్దాయిని నిర్బంధంలో ఉంచేది... అతను విచారణను ఎదుర్కొని దోషి అని తేలితే కోర్టు అతనికి విధించే శిక్షను స్వీకరించడానికేనన్నది తెలిసిందే. విచారణ సమయంలో అతను హాజరవుతాడని, నిర్బంధం అవసరంలేదని కోర్టు భావిం చినప్పుడు అతని స్వేచ్ఛను హరించడం సరైంది కాదని న్యాయ శాస్త్రకోవిదులు అభిప్రాయపడ్డారు. అందుకని బెయిల్ మంజూరు చేయాలని, రాజ్యాంగం ఆర్టికల్ 21లో ప్రసాదించిన హక్కులకు రక్షణ కల్పించాలన్నది వారి భావన. ఈ భావన మన రాజ్యాంగంలోనే కాదు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (1948)లో కూడా పొందుపరచారు.

ఆ ప్రకటనలోని ఆర్టికల్ 9 ప్రకారం - ఏ వ్యక్తినీ సరైన కారణం లేకుండా అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి, లేక దేశం నుంచి బహిష్కరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 10 ప్రకారం - తన హక్కుల గురించి, బాధ్యతల గురించి, తన మీద వచ్చిన నేరారోపణల గురించి స్వతంత్రమైన, నిష్పాక్షికమైన న్యాయ స్థానాల ద్వారా బహిరంగ విచారణ జరపాలని కోరే హక్కు ప్రతి వ్యక్తీ కలిగి ఉంటాడు. ఆర్టికల్ 11(1) ప్రకారం - నేరం ఆరోపించబడిన వ్యక్తిని నేరారోపణ రుజువయ్యే వరకు నిరపరాధిగానే పరిగణించాలి. ఆ విచారణలో ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడానికి, రక్షణలు కల్పించుకోవడానికి అవసరమైన సదుపాయాన్ని అతనికి కల్పించాలి.

బెయిల్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలో చెప్పారు. కానీ బెయిల్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. కోర్టుముందు, దర్యాప్తు చేసే అధికారి ముందు హాజరు కావడానికి ఇచ్చే సెక్యూరిటీ (జామీను)ని బెయిలని అంటున్నాం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో బెయిల్‌ని నిర్వచించలేదు కానీ సెక్షన్ 2 (ఎ)లో బెయిలబుల్ నేరాన్ని, నాన్ బెయిలబుల్ నేరాన్ని నిర్వచించారు.

బెయిల్ పొందే హక్కు ఉన్న నేరాల్లో కోర్టులు, పోలీసులు తప్పక బెయి ల్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జామీను ఇవ్వలేని పరిస్థితులలో ఉండి బెయిలబుల్ నేరాల్లో అరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్బంధంలో ఉంటే అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 436తో సవరణలు తీసుకొ చ్చారు. నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా జామీను మొత్తం ఏకపక్షంగా ఎక్కువ ఉండకూడదని, సహేతుకంగా ఉండాలని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో అభి ప్రాయపడింది. మోతీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ (1978) కేసులో అవస రమైనప్పుడు నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా వ్యక్తిగత పూచీకత్తు మీద విడు దల చేయాలని, ఆ విధంగా చట్టంలో మార్పులు తీసుకొని రావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

అన్ని రకాలైన కేసుల్లో బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టులు ఉదారంగా వ్యవహరించాలని గతంలో అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, ఇటీవలి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో విముఖతని ప్రదర్శిస్తున్నది.

1977, డిసెంబర్ 6న గుడికంటి నర్సింహులు కేసులో జస్టిస్ క్రిష్టయ్యర్ బెయిల్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ‘‘బెయిలా లేక జెయిలా?’’ అనే ప్రశ్నపై బెయిల్ ఇవ్వడం వైపు మొగ్గుచూపాలని అన్నారు. బెయిల్ మీద ఉంటే తన మీద ఉన్న ఆరోపణలని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుం ది. కస్టడీలో ఆ అవకాశం ఉండదు.

ప్రజలకి న్యాయం జరగాలంటే, యాం త్రికంగా నిర్బంధంలో ఉంచడాన్ని నిరుత్సాహపరచాలి. ఈ తీర్పు వెలువడిన రెండు సంవత్సరాల తరువాత బెయిలా లేక జైలా? అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో గురుబక్ష్ సింగ్ సిబియా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1980, ఏప్రిల్ 9) కేసులో వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తూ - అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇలా అన్నారు. ‘‘అరెస్టు అయినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది. అరెస్టయ్యే క్రమంలో అతను బెయిల్ కోరితే అతని స్వేచ్ఛను కాపాడే విధంగా బెయిల్ మంజూరు చేయాలి. ఎందుకంటే నేరం రుజువయ్యే వరకూ అతన్ని నిరపరాధిగా పరిగణించాల్సి ఉంటుంది.’’

తరువాతి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహ రించాలని న్యాయస్థానాలు పలుమార్లు ఘోషించాయి. భగీరత్‌సింగ్ జడేజా, కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.ఎ.దేశాయ్ నవంబర్ 21, 1983న ఇలా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వడం వైపే కోర్టులు ఇటీవలి కాలంలో మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు పరిశీలిం చాల్సిన అంశం ఆ వ్యక్తి విచారణ సమయంలో అందుబాటులో ఉంటాడా... లేదా? సాక్ష్యాలను తారుమారు చేయడానికి స్వేచ్ఛను దుర్వినియోగపరు స్తాడా?’’ ఈ విషయాలను కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. ఉదారంగా బెయిల్ మంజూరు చేసే ధోరణి కొంత కాలం కొనసాగినా తరువాత పరిస్థితి మారుతూ వచ్చింది. 1990 దశకంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న తరువాత చంద్రస్వామికి బెయిల్ మంజూరయ్యింది. అప్పటికి 16 సంవత్సరాల క్రితం జరిగిన నేరానికి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. 1996లో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్మ, కిర్వాల్ ఈ విధంగా అన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తులను విడుదల చేయడం ద్వారా ప్రాసిక్యూషన్ కేసును ఇరుకునపెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు’’.

నాన్ బెయిలబుల్ నేరానికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో మూడు ప్రధానమైన నిబంధనలు ఉన్నాయి. అవి సెక్షన్ 437, 438, 439. ముం దస్తు బెయిల్ గురించిన నిబంధన 438 కాగా, మిగతా రెండు అరెస్టు అయిన తరువాత బెయిల్ మంజూరు చేసే నిబంధనలు. హైకోర్టు, సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసే నిబంధన సెక్షన్ 439. మేజిస్ట్రేట్లు, కొన్ని సందర్భాల్లో పోలీసులు బెయిల్ మంజూరు చేయడానికి ఉన్న నిబంధన సెక్షన్ 437. మహి ళలకు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు, దుర్భలంగా ఉన్న వ్యక్తులకు ఉదారంగా బెయిల్ మంజూరు చేయాలని సెక్షన్ 437 చెబుతుంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టుల ధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. నేరాల తీవ్రత ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఈ కొత్త ధోరణికి కారణమైన కేసులు చాలా ఉన్నప్పటికీ అందులో ప్రధానమైన కేసు ‘సత్యం కంప్యూటర్స్’ ప్రమోటర్ రామలింగరాజు బెయిల్ రద్దు కేసు.

2010, అక్టోబర్ 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్వీర్ భండారి, దీపక్ శర్మలు బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్లని ఆమోదిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారం ముద్దా యిలు చాలా ఘనమైన కార్పొరేట్ స్కామ్‌లో భాగస్వాములు. దాని వల్ల మన దేశంలో, ప్రపంచంలో కూడా ఆర్థిక తుపాను సంభవించింది. లక్షల మంది షేర్ హోల్డర్స్ మోసపోయారు. దేశ పరువు ప్రతిష్టలు మంటగలిశాయి. కేసు విచా రణలో ఉండగా మేం ఎలాంటి పరిశీలన చేయడం భావ్యం కాదు. దాని వల్ల విచారణ కోర్టు పక్షపాతానికి లోనుకాకూడదు. హైకోర్టు మంజూరు చేసిన బెయి ల్‌ను రద్దు చేసే విషయంలో సాధారణంగా ఈ కోర్టు (సుప్రీంకోర్టు) స్థిమితంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ని రద్దు చేస్తున్నాం’’.

అయితే 2010 డిసెంబర్‌లో మళ్లీ సిద్దారామ్ మెత్రే వర్సెస్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్బీర్ భండారీ, కె.పి.రాధాక్రిష్ణన్ హత్యకేసు లోని ముద్దాయి సిద్దారామ్ మెత్రే ముందస్తు బెయిల్‌ని ఆమోదిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అతి విలువైన ప్రాథమిక హక్కు.

అసా ధారణమైన పరిస్థితులు కేసులో ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛని నియంత్రిం చాలి’’. సమాజ హితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను సమతూకంగా చూడటం అంత సులువు కాదు. బెయిల్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. చివరగా రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడి చేసిన అభిప్రాయాలను ఇక్కడ మననం చేసుకుందాం. గురుబక్ష్‌సింగ్ కేసు (1980, ఏప్రిల్ 9)లో న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ విధంగా అన్నారు.

‘‘బెయిల్ వంటి విచక్షణా ధికారం ఉండే అంశాల్లో కచ్చితమైన సూత్రాలను ఏర్పరచడం సాధ్యం కాదు’’. అదేవిధంగా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో న్యాయమూర్తులు భగవతి, కోషల్ ఇలా అన్నారు. ‘‘ప్రజల పట్ల బాధ్యత వహించి అధికసంఖ్యలో కోర్టులను నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వా లపై ఉంది’’. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 సత్వర విచారణ, సత్వర దర్యాప్తులకు కట్టుబడి ఉంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొంటే తప్ప అందరికీ న్యాయం జరగదు.

Followers