Wednesday, June 30, 2010

మానభంగ యత్నం అంటే..!?
June 29th, 2010

హత్యాప్రయత్నం గురించి, ఆత్మహత్యా ప్రయత్నం గురించి, దోపిడీ యత్నం గురించి భారతీయ శిక్షాస్మృతిలో ప్రత్యేకమైన నిబంధనలు వున్నాయి. వాటికి శిక్షలు కూడా వున్నాయి. కానీ మానభంగ యత్నం గురించి ప్రత్యేకమైన నిబంధన ఏదీ లేదు. ఎవరైనా వ్యక్తి మానభంగయత్నం గురించి -ఉద్దేశపూర్వకంగా తయారై నేరం చేయడానికి ప్రయత్నం చేసినపుడు దాన్ని మానభంగ యత్నం అంటారు.
ప్రయత్నం అనేది కేసునిబట్టి, ఆ కేసులోని పరిస్థితిని బట్టి మారుతూ వుంటుంది. ప్రయత్నం (ఎట్టంప్ట్)కి, తయారుకి (ప్రెపరేషన్) బేధం వుంది. ఎప్పుడైతే తయారై అనేది అంతం అవుతుందో అక్కడ ప్రయత్నం మొదలవుతుంది.
నేరం చేయడంలో నాలుగు దశలు వుంటాయి. అవి
* ఉద్దేశం
* తయారు
* ప్రయత్నం
* సఫలం
నేరం చెయ్యాలన్న తలంపు రావడమే ఉద్దేశ్యం. ఆ నేరం చేయడానికి తయారు కావడమనేది రెండవ దశ. ఆ నేరం చేయడానికి ఉద్రిక్తమై ప్రయత్నం చేయడం మూడో దశ. ఆ ప్రయత్నం సఫలమైతే నేరం పూర్తవుతుంది.
రేప్ నేరంలో, మానభంగ యత్నం నేరంలో మహిళల గౌరవ మర్యాదలపై దాడి వుంటుంది. ఎవరైనా స్ర్తిని దౌర్జన్యంగా చేయిపట్టుకుని కౌగిలించుకోవడానికి లాగినప్పుడు, బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకా ఏవైనా అగౌరవ చర్యలకి పాల్పడినప్పుడు అది గౌరవ మర్యాదలకి భంగం కలిగించినట్టవుతుంది. స్ర్తి గౌరవం సెక్స్‌తో ముడిపడి వుంటుంది. ఇలాంటి చర్యలు భారతీయ శిక్షాస్మృతిలోని సె.354 ప్రకారం నేరకృతము.
ఒకవేళ మహిళ గుడ్డలు ఊడదీసి నేలమీద పడేసి ఆ వ్యక్తిపై పడుకుని శారీరక సంభోగానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు అతను మానభంగ యత్నం నేరం చేసినవాడవుతాడు. అతను భారతీయ శిక్షాస్మృతిలోని సె.376 రెడ్‌విత్ 511 ప్రకారం శిక్షార్హుడవుతాడు. రేప్ నేరానికి వున్న శిక్షే, మానభంగ యత్నానికి ఉంటుంది.
మదన్‌లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్తాన్ (1986 ఆర్.ఎల్.డబ్ల్యు 377) కేసులో ముద్దాయి -అమ్మాయి సల్వార్ కమీజు తీసివేసి తన పైజామా కూడా తీసివేసి కిందపడేసాడు. ఆ తరువాత ఆమె అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. శారీరక సంభోగం కోసం ఆమెపై పడుకున్నాడు. అటువైపు వచ్చిన కొంతమంది అతన్ని లాగివేసారు. వాళ్లు రానట్టయితే అతను ఆమెను మానభంగానికి గురిచేసేవాడే. ఇది మానభంగ యత్ననేరం.
కౌగలించుకోవాలని మహిళలని చేయిపట్టుకుని లాగితే అది సె.354 ప్రకారం నేరం. ఇంకా కాస్త ముందుకు వెళ్లి బట్టలు విప్పదీసి మానభంగం చేయడానికి ప్రయత్నించి విఫలమైతే అది సె.376 ఆర్/డబ్ల్యు 511 ప్రకారం నేరం. మానభంగం చేయడంలో సఫలం అయతే, అది మానభంగం. ఆ వ్యక్తి సె.376 ప్రకారం శిక్షార్హుడవుతాడు.
శారీరక సంభోగం జరపాలన్న దృఢ నిశ్చయం వుండి విఫలమైనప్పుడు అది మానభంగ యత్నం అవుతుంది. ఖచ్చితమైన దృఢ నిశ్చయం లేనప్పుడు గౌరవ మర్యాదలపై దాడి అవుతుంది.
చేయి పట్టుకోకుండా రోడ్డుమీదున్న మహిళను ఉద్దేశించి కారుకూతలు కూసినా, సైగలు చేసినా, పాటలు పాడినా అది స్ర్తిని అవమానించడమే అవుతుంది. అలాంటి వ్యక్తులు సె.509 ప్రకారం శిక్షార్హులవుతారు. ప్రేమ లేఖలు రాయడం కూడా సె.509 ఐపిసి ప్రకారం నేరమవుతుంది

Tuesday, June 22, 2010

కామోద్రేకం కారణంగా చూపి శిక్ష తగ్గించవచ్చా?

కామోద్రేకం కారణంగా చూపి
శిక్ష తగ్గించవచ్చా?
June 22nd, 2010

బాధితురాలు హోస్కోట్‌లోని ఓ క్లినిక్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. బెంగళూరు నుంచి హాసన్ వెళ్తున్నప్పుడు ఇద్దరు ప్రయాణీకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణంలో పరిచయం స్నేహంగా మారింది. ఆమె వెళ్లాల్సిన ఊరుకి సరైన సమయంలో వెళ్లడానికి సహకరిస్తామని వాళ్లు ఆమెకు చెప్పారు. వాళ్లు ఆమెను భోజనానికని రెస్టారెంట్‌కి, తరువాత బి.జి.కె లాడ్జికి తీసుకొని వెళ్ళారు. వాళ్లు ముగ్గురూ లాడ్జిలో ఉన్నారు. లాడ్జీ ప్రక్కన రూంలో డ్యూటీకి వచ్చిన గోశాల అనే కానిస్టేబుల్ ఉన్నాడు. బాధితురాలు మంచం మీద పడుకుంది. ఇద్దరు (ముద్దాయిలు) క్రింద పడుకున్నారు. కొంతసమయం గడిచాక రూంలోని లైట్లు ఆరిపోయాయి. క్రిష్ణ (ముద్దాయి నెం.2) వచ్చి ఆమె ప్రక్కన పడుకున్నాడు. క్రింద దోమలు కుడుతున్నాయని చెప్పాడు. ఆమె అభ్యంతరాన్ని తెలియచేసింది. కొద్దిగా అరిచింది. రాజు (ముద్దాయి 1) లేచి కర్చీప్‌తో ఆమె నోటిని మూసివేశాడు. అరవొద్దని బెదిరించాడు. తరువాత క్రిష్ణని బయటకు పంపించి రూం గొళ్ళెం పెట్టాడు. ఆమె వ్యతిరేకతని లెక్కచేయకుండా శారీరక సంభోగం కావాలని కోరాడు. వివాహం చేసుకుంటే తప్ప అలాంటి అవకాశం లేదని ఆమె చెప్పింది. అప్పుడే తలుపుని రెండవ ముద్దాయి తట్టాడు. తలుపు తీసిన తరువాత అతను లోనికి వచ్చాడు. మొదటి ముద్దాయి బయటకు వెళ్లిపోయాడు. రెండవ ముద్దాయి కత్తితో ఆమెను బెదిరించి ఆమె నోరు మూసి ఆమెను మానభంగం చేశాడు. కాసేపటికి ఆమె నోరు పెగిలించుకొని అరిచింది. రూం బాయ్, ఇంకా కొంతమంది అరుపులు విని తలుపుని తట్టారు. బట్టలు వేసుకొని మొదటి ముద్దాయి తలుపు తీశాడు. జరిగిన విషయం లోనికి వచ్చిన వ్యక్తులకి, కానిస్టేబుల్ గోపాల్‌కి ఆమె చెప్పింది. హాసన్ పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షలకి పంపించారు. ఆమెపై శారీరక సంభోగం జరిగిందని, కనె్నపొర ఇటీవలనే చెదిరిందని ఆమె రహస్య అవయవాల మీద గాయాలు వున్నాయని వైద్య పరీక్షల్లో తేలింది.
కేసుని విచారించిన సెషన్స్ జడ్జి రేప్ నేరం మొదటి ముద్దాయి చేశాడని నిర్దారించాడు. రెండవ ముద్దాయి నేరం చేశాడని ఎలాంటి అనుమానానికి తావు లేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, రెండవ ముద్దాయిపై కేసుని కొట్టివేశాడు. ముద్దాయి యుక్తవయస్సుని దృష్టిలో పెట్టుకొని, బాధితురాలు ఆ రూంలో స్వచ్ఛందంగా వచ్చి వుందని, రేప్ కూడా క్షణికమైన కామోద్రేకంలో జరిగిందన్న కారణాలవల్ల మొదటి ముద్దాయికి కూడా సెషన్స్ జడ్జి అతి తక్కువ శిక్ష అంటే కోర్టు అయిపోయేంతవరకు శిక్ష మరియు రూ.500ల జరిమానాని విధించారు.
ఈ తీర్పుకి వ్యతిరేకంగా ‘స్టేట్’ అప్పీలుని వేసింది. అప్పీలుని విచారించిన హైకోర్టు రేప్ నేరం ఇద్దరు ముద్దాయిలు చేశారని రుజువైందని, మొదటి ముద్దాయికి శిక్షను హెచ్చించింది. రెండవ ముద్దాయికి శిక్షను విధించింది. ఇద్దరికీ ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షని హైకోర్టు విధించింది.
ముద్దాయి సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు. సుప్రీంకోర్టు రేప్ నేరాన్ని ముద్దాయిలు ఇద్దరూ చేశారని నిర్ధారించింది. కానీ శిక్ష విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించింది. బాధితురాలు ఆమె ఊరు చేరడానికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యమే ముద్దాయిలిద్దరికీ మొదట వుందని, తరువాత ఒకే రూంలో వుండంవల్ల వాళ్ళు కామోద్రేకానికి గురై నేరం చేశారని సుప్రీంకోర్ట వ్యాఖ్యానించింది. ఈ కారణాలవల్ల సుప్రీంకోర్టు శిక్షను ముద్దాయిలకు తగ్గిస్తున్నామని చెప్పింది.
* ముద్దాయిలు చాలా చిన్న వయస్సులో వున్నారని
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడలేక, డీసెన్సీనీ, నైతిక విలువల్ని కోల్పోయి, రేప్ నేరం చేశారని
* రేప్ నేరం చాలా రోజుల క్రితం జరిగిందని ఈ కాలంలో ముద్దాయిలు తీవ్రమైన మానసిక వేధనకి గురైనారని, వాళ్ళ ప్రతిష్టకు కూడా భంగం కలిగిందని
ఈ కారణాలవల్ల తక్కువ శిక్ష విధించడం వల్ల న్యాయం చేకూరుతుందని భావిస్తూ సుప్రీంకోర్టు ముద్దాయిలకి మూడు సంవత్సరాల శిక్షని విధించింది. (రాజు, క్రిష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏ.ఐ.ఆర్. 1994 సుప్రీంకోర్టు 222=1994 క్రిమినల్ లా జనరల్ 248)
ఈ శిక్షని తగ్గించడం విషయంలో మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరాలని లేవనెత్తి ఆందోళనలు చేశాయి. వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు -
* నేరం జరిగేటప్పుడు ముద్దాయిల వయస్సు 24 మరియు 21 సంవత్సరాలు. అంటే వాళ్లు చేస్తున్న చర్య ఫలితాలు వాళ్లకి తెలుసు. అందుకని వాళ్లకి జువెనైల్ జస్టిస్ చట్టం వర్తించదు. అదే విధంగా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం కూడా వర్తించదు.
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడ లేకపోయ్యారనడానికి గల కారణాలు వివరించలేదు.
* రేప్ నేరం చాలా సంవత్సరాల క్రితం జరిగిందని, ఈ కాలంలో ముద్దాయి తీవ్రమైన మానసిక వేదనకి గురైనారని వాళ్ల ప్రతిష్టకి భంగం కలిగిందని సుప్రీంకోర్టు శిక్షను తగ్గించింది కానీ ఈ జాప్యానికి కారణం బాధితురాలు కాదు. అదేవిధంగా ఈ పదిహేను సంవత్సరాల్లో బాధితురాలు ఎంతటి మనోవేదనకి మానసిక సంఘర్షణకి గురైందో సుప్రీంకోర్టు శిక్ష తగ్గించేప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు.
శిక్షను తగ్గించడానికి సరైన ప్రత్యేకమైన కారణాలు వుండాలి. వాటిని చట్టం నిర్వచించలేదు. *

Wednesday, June 9, 2010

సె.498ఎ’లో రాజీపడవచ్చా?

సె.498ఎ’లో రాజీపడవచ్చా?
- మంగారి రాజేందర్
June 8th, 2010

భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత భార్యలు పెట్టే కేసు 498ఎ. భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం ఈ కేసులని దాఖలు చేస్తుంటారు. భార్యని భర్తగాని అతని బంధువులు గానీ శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ నిబంధన ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది.కొన్ని సందర్భాలలో స్ర్తిలు అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తారు. ఆ స్ర్తిలు వివాహితులై ఏడు సంవత్సరాలలో మరణించి, మరణానికి ముందు వరకట్నం కోసం వేధింపులు వుంటే అది సె.304 బి ప్రకారం నేరమవుతుంది. అదేవిధంగా వివాహిత ఆత్మహత్య చేసుకునే విధంగా భర్తగానీ అతని బంధువులు ప్రవర్తిస్తే వాళ్ళపై భారతీయ శిక్షాస్మతిలోని సె.306 ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది. అదేవిధంగా కొట్టినప్పుడు కూడా భారతీయ శిక్షాస్మృతిలోని సె.324 ప్రకారం కేసులు పెట్టే అవకాశం వుంది. కొన్ని సందర్భాలలో కేసు విచారణలో వుండగా భార్యాభర్తలు రాజీపడాలని అనుకుంటారు. ఇలాంటి సందర్భాలలో భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం దాఖలు చేసిన కేసుని రాజీపడటానికి అవకాశం వుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ వుంటే ఏ దశలో రాజీ చేసుకోవచ్చు. రాజీపడటం అంటే ఏమిటి? రాజీపడదగ్గ నేరాలు అంటే ఏమిటి?
కేసులో మూడు రకాలు-
* కాగ్నిజబుల్ - నాన్ కాగ్నిజబుల్
* బెయిలబుల్ -నాన్ బెయిలబుల్
* రాజీపడే నేరాలు - రాజీపడటానికి అవకాశం వున్న నేరాలు
రాజీ పడే నేరాలు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.320లో ఓ పట్టికను ఇచ్చి అందులో కోర్టు అనుమతితో, కోర్టు అనుమతి లేకుండా రాజీపడే నేరాలని వర్గీకరించారు. ఈ పట్టికలో సూచించిన నేరాలు మాత్రమే రాజీపడటానికి వీలున్న నేరాలు. భారతీయ శిక్షాస్మృతిలోని నేరాలుని మాత్రమే ఈ పట్టికల్లో పొందుపరిచారు. భారతీయ శిక్షాస్మృతి అనేది ప్రభావ శాసనంగా తయారుచేశారు కాబట్టి అందులోని నేరాలు మాత్రమే ఇందులో వుండేవి. అయితే ఆ తరువాత చాలా చట్టాలు వచ్చాయి. వాటిని ఈ పట్టికలో పొందుపరచటం సాధ్యంకాదు. అందుకని వాటి గురించి వేరుగా ఆయా చట్టాల్లోనే అవి రాజీపడటానికి వీలున్న నేరాలా? కాదా అన్న విషయాలని పేర్కొంటారు. భారతీయ శిక్షాస్మృతిలో చేర్చిన నిబంధన సె.498ఎ. ఈ నిబంధన రాజీపడటానికి వీల్లేని నేరం. అయితే ఈ విధంగా వుంచడంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కలిసి జీవించాలని అనుకునే భార్యాభర్తలకి ఆటంకాలు ఏర్పడుతున్నాయని శాసనకర్తలు భావించి మన రాష్ట్రంలో దీన్ని రాజీపడటానికి వీలున్న నేరంగా సె.320కి మార్పులు చేసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ చట్టం 11/2003 ద్వారా ఈ మార్పులు తీసుకొని వచ్చారు. 1.8.2003 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే ఒక షరతుని విధించారు. రాజీ దరఖాస్తు చేసుకున్న తేదీనే ఈ నేరాన్ని రాజీపడటానికి అవకాశం వుండదు. రాజీపడటానికి దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి మూడు నెలలు దాటిన తరువాతనే ఈ నేరాన్ని రాజీ చేసుకోవచ్చు. అయితే ఈమధ్యకాలంలో రాజీచేసుకునే పార్టీలలో ఎవరూ కూడా దరఖాస్తుని ఉపసంహరించుకోకుండా వుండాలి.
రాజీ ఏ విధంగా చేసుకుంటారు?
* రాజీ కోసం ప్రయత్నాలు కోర్టు వెలుపల జరుగవచ్చు, కోర్టులో జరుగవచ్చు.
* కోర్టు అనుమతితో రాజీ చేసుకునే నేరాలని వెంటనే రాజీచేసుకోవడానికి అవకాశం వుండదు. కోర్టు అనుమతి తీసుకున్న తరువాతనే రాజీ చేసుకోవచ్చు. మిగతావి వెంటనే రాజీ చేసుకోవచ్చు.
* రాజీ చేసుకున్నారా? అన్న విషయాన్ని కోర్టు పరిశీలించి కేసుని రాజీ చేస్తుంది. కోర్టు అనుమతి ఇవ్వాల్సిన నేరాలకి సంబంధించి కోర్టు తన విచక్షణాధికారాలని ఉపయోగిస్తుంది. ఆ తరువాతనే అనుమతి ఇస్తుంది.
* పార్టీలు రాజీచేసుకున్న ముద్దాయి కేసు నుంచి విడుదల అవుతాడు.
* చిన్న పిల్లల (మైనర్) విషయంలో పెద్దవాళ్ళు రాజీపడటానికి అవకాశం వుంది.
* అప్పీలు దశలో కూడా కేసులని రాజీ చేసుకునే అవకాశం వుంది.
* బాధితులు మాత్రమే రాజీ చేసుకునే అవకాశం వుంది.
సె.498.ఎ నేరం కోర్టు అనుమతితో రాజీ చేసుకునే వీలున్న నేరం. అనుమతి ఇచ్చిన తరువాత మూడు మాసాల తరువాత రాజీపడాల్సి వుంటుంది. పార్టీలు. పార్టీలు ఈ మూడు మాసాల కాలంలో పునరాలోచించుకోవటానికి అవకాశం వుంటుంది.

Wednesday, June 2, 2010

శేష వీలునామా హక్కుదారంటే..?

శేష వీలునామా హక్కుదారంటే..?

June 1st, 2010

వీలునామాకర్త తన శేష ఆస్తిని ఎవరికైతే చెందాలని రాస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు. అంటే వీలునామాకర్త నిర్దేశించిన ప్రకారం వీలునామా హక్కుదారులు తమ ఆస్తులను తీసుకోగా మిగిలిన ఆస్తిని శేషాస్తి అంటారు. ఆ మిగులు ఆస్తి ఎవరికైతే చెందాలని వీలునామాకర్త నిర్దేశిస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు.
వీలునామా ఆస్తి
వీలునామా కర్తకన్నా ముందు వీలునామా హక్కుదారు చనిపోయినప్పుడు, ఆ వీలునామా ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది (105 (1) భారతీయ వారసత్వ చట్టం). అలాగే వీలునామా కర్త తరువాత వీలునామా హక్కుదారు చనిపోతే ఆ వీలునామా ఆస్తి వీలునామా హక్కుదారు చట్టబద్ధ వారసులకి చెందుతుంది (105 (2) భారతీయ వారసత్వ చట్టం).
ఇద్దరూ ఒకేసారి చనిపోయినప్పుడు
వీలునామా కర్త దాని హక్కుదారు ఇద్దరూ ఒకేసారి విమాన ప్రమాదంలోగానీ ఇతర ఏ ప్రమాదంలోనైనా చనిపోయినప్పుడు ఎవరు ముందు చనిపోయారోనన్న సాక్ష్యం లేనప్పుడు ఆ ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది. అయితే హిందువులకు సంబంధించినపుడు ఆ ఇద్దరిలో ఎవరు చిన్నవారో అతని వారసులకి ఆ ఆస్తి చెందుతుంది.
ఇద్దరికీ ఇచ్చినప్పుడు
వీలునామా ఆస్తిని ఇద్దరు వ్యక్తులకు సమష్టిగా చెందాలని రాసినపుడు ఆ ఇద్దరిలో ఎవరైనా వ్యక్తి వీలునామా కర్త కన్నా ముందే చనిపోతే, ఆ ఆస్తి మిగతా వ్యక్తికి చెందుతుంది.
పిల్లలకు ఇచ్చినప్పుడు
రామయ్య తన కొడుకు గంగాధర్‌కి తన డబ్బు మొత్తం అతని ఉపయోగార్థం చెందాలని వీలునామా రాసాడు. అయితే గంగాధర్ తన కొడుకు రవీందర్ పుట్టిన తరువాత రామయ్యకన్నా ముందే చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వీలునామా ఆస్తి గంగాధర్ కొడుకు రవీందర్‌కే చెందుతుంది. ఒకవేళ గంగాధర్ కూడా వీలునామా రాసి తన ఆస్తి మొత్తం తన భార్య విమలకి చెందాలని రాసినపుడు ఆస్తి కొడుకు రవీందర్‌కి కాకుండా గంగాధర్ భార్య విమలకి చెందుతుంది.
పిల్లలంటే
ఒక వ్యక్తి సంతతిని పిల్లలుగా భావిస్తారు. అంటే అతని మనుమలు, మనుమరాళ్లు అతని పిల్లలుగా భావించరు. అక్రమ సంతతిని కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అతని సంతతిగా పరిగణిస్తారు. గర్భంలో వున్న పిల్లల్ని కూడా అతని సంతతిగా పరిగణిస్తారు. (సె.99 (జి), 99 (ఎ) భారతీయ వారసత్వ చట్టం.
వీలునామా డిపాజిట్ చేయవచ్చా
వీలునామాలని రిజిస్ట్రేషన్ చట్టప్రకారం డిపాజిట్ కూడా చేయవచ్చు. వీలునామాకర్త తాను స్వయంగా కానీ, తన ఏజెంట్ ద్వారా కానీ వీలునామాని కవర్‌లోపెట్టి దాన్ని సీల్ చేసి రిజిస్ట్రార్ (సబ్ రిజిస్ట్రార్) దగ్గర డిపాజిట్ చేయొచ్చు. కవరుమీద వీలునామా కర్త పేరు, అది దేని గురించో, ఆ స్టేట్‌మెంట్ దాని కర్త సంతకంతో వుండాలి. అది వీలునామా కర్తదేనన్న విషయం సంతృప్తి చెందిన తరువాత, దాని కవర్‌పైనున్న విషయాలు తన రిజిష్టర్‌లో నోట్ చేసి ఆ కవరును డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన వీలునామాలను రిజిస్ట్రేషన్ అధికారులు తెరువరు. దాన్ని అలాగే భద్రపరుస్తారు. వీలునామా డిపాజిట్ చేయడానికి, దాన్ని రిజిష్టర్ చేయడానికి భేదముంది. రిజిష్టర్ చేసిన వీలునామాలోని విషయాలను తమ రిజిష్టర్‌లో నోట్ చేసుకొని వీలునామాపై సీల్ వేసి తిరిగి వీలునామా కర్తకు ఇచ్చేస్తారు.
డిపాజిట్ చేసిన వీలునామా కర్త
మరణించినప్పుడు
వీలునామా డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినప్పుడు, అతని మరణ ధృవీకరణ పత్రాన్ని రిజిస్ట్రార్‌కి అందచేసినప్పుడు అతని సమక్షంలో ఆ వీలునామాలోని విషయాలను తాను రిజిష్టర్‌లో రాసి దాన్ని తమ వద్ద భద్రపరుస్తారు. ఆ వీలునామాని ధృవీకరించడానికి కోర్టులో దాఖలు చేయమని కోర్టు ఆదేశించినప్పుడు కోర్టులో దాఖలు చేస్తారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరా..?
వీలునామా తప్పనిసరిగా రిజిష్టర్ చేయించాల్సిన అవసరం లేదు. కాని రిజిష్టర్ చేయించడం మంచిది. అనవసరపు చిక్కులు వుండవు. *

Followers