Wednesday, April 25, 2012

Impartiality in courts

కోర్టుల్లో నిష్పక్ష పాతం న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసం చూరగొనాలంటే న్యాయ నిర్ణయ ప్రక్రియలో నిష్పక్షపాతం ఉండాలి. ఆర్‌ వర్సెస్‌ సుసెక్స్‌ (1924) కేసులో ప్రధాన న్యాయమూర్తి లాడ్డ్‌ హేవర్ట్‌ ‘న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టుగా కనిపించాలి. కేసుల విచారణ ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలి’ అన్నారు. పక్షపాతం అనేది ఆరు రకాలుగా ఉంటుందని వర్గీకరించారు. అవి వ్యక్తిగత పక్షపాతం, ఆర్ధిక పరమైన పక్షపాతం, కేసులోని విషయంమీద పక్షపాతం, శాఖాపరమైన పక్షపాతం, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల పక్షపాతం, మొండితనం- మూర్ఖత్వం వల్ల ఏర్పడిన పక్షపాతం. కోర్టు విచారణల్లో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కోర్టు ఏదైనా విషయంలో పక్షపాతంలో ఉందన్న అభిప్రాయం కోర్టుకు వచ్చిన వ్యక్తులకు ఏర్పడకూడదు. ఆ విధంగా కోర్టు వాతావరణం ఉండాలి. కోర్టుకు అంటే న్యాయమూర్తికి పూర్వభావనలు, ప్రతికూలాభిప్రాయాలు ఉండవని కాదు. అలాంటి భావనలు ఉండకూడదు. అలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు పైకి కనుపించేఉ విధంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పైకి కనుపించకుండా ఉంటాయి. వర్గం, మతం, కులం, లింగం, భాష, ప్రాంతం అనే విషయాలు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ప్రభావితం చేయకుండా న్యాయమూర్తి వ్యవహరించాలి. కిరాయిదారుడుగా ఉన్న న్యాయమూర్తి యజమానితో ఇబ్బందులపాలైతే అతనికి యజమానుల పట్ల కొన్ని పూర్వ భావనలు ఉంటాయి. అదే విధంగా అతను యజమాని అయి ఉండి కిరాయిదారునితో ఇబ్బందులు పడినప్పుడు అతనికి కిరాయిదారుల పట్ల కొన్ని పూర్వభావనలు ఉంటాయి. అదే విధంగా పోలీసులతో ఇబ్బందులు పడ్డ న్యాయమూర్తికి వాళ్ళ పట్ల పూర్వభావనలు ఉండే అవకాశం ఉంది. ఈ భావనలను గుర్తించి వాటినుంచి బయట పడాల్సింది. గుర్తించినప్పుడు ఈ పూర్వభావనలు తీర్పుల్లో ప్రతిబింబించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పూర్వభావనలు, పక్షపాత దృష్టి బయటపడడం సులువుకాదు గానీ దుస్సాధ్యం మాత్రం కాదు. కోర్టులు అందరి హక్కులను కాపాడాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు. కోర్టుకు వచ్చే వ్యక్తులందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. వారి సాధక బాధకాలను సానుభూతితో అనే బదులు చట్టపరంగా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నట్టు అనిపిస్తుంది.సుప్రీకోర్టు- స్టేట్‌ ఆఫ్‌ యుపి వర్సెస్‌ శంభూనాథ్‌ సింగ్‌ మరి ఇతరులు (ఏఐఆర్‌ 2001 సుప్రీంకోర్టు 403) కేసులో అభిప్రాయపడినట్టు ‘కోర్టు నుంచి సమన్లు రాగానే సాక్షులు వణికిపోతారు. కోర్టుల్లో జరిగే విచారణకు వాళ్ళ కాళ్ళు వణికిపోవడం లేదు, కోర్టు చుట్టూ ఎన్నిరోజులు తిరగాల్సి ఉంటుందోనని వాళ్ళు వణికి పోతారు. ఎందుకంటే వాళ్ళు తమ పనులను వదిలివేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్క సారితో అయిపోదు. మన దేశంలోని ప్రతి కోర్టులో కనుపించే దృశ్యమే ఇది. కోర్టులు ఓ నిర్ణయానికి రావడానికి వచ్చిన అతిథులని విచారించే కోర్టులు భావించాల్సిన సమయం ఆసన్నమైంది..’. కోర్టుల్లో సాక్షులు కూర్చోవడానికి సరైన స్థలం ఉండదు. తాగడానికి నీటి సౌకర్యం ఉండదు. మరుగుదొడ్లు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటాయి. కోర్టు అటెండర్లు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. భయానికి గురి చేస్తూఉంటారు. వారి పరిస్థితులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని వారి రోజు వారి కూలి దెబ్బతినకుండా, వాళ్ళు ఎక్కువసార్లు కోర్టుకి తిరగకుండా తేదీలను వేస్తే అది కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టనిపిస్తుంది. కోర్టుకు హాజరైనప్పుడు వారికి ఇవ్వాల్సిన వేతనం ఇస్తే కూడా అది నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది. నిష్పక్షపాతంగా ఉండడం ఎంత అవసరమో కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా ఉండడం కూడా నిష్పక్షపాతంగా ఉండడంగా భావించాల్సి ఉంటుంది. బీద వాళ్ళ పట్ల, పిల్లల పట్ల, మహిళలపట్ల పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగం పట్ల పక్షపాతంతో ఉండాలి. రాజ్యంగం వీరి హక్కులను గౌరవిస్తుంది. ప్రత్యేకమైన అధికరణలు కూడా రాజ్యాంగంలో ఉప్పాయి అదేవిధంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన వ్యక్తుల కోసం, మైనారిటీల కోసం కూడా రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. వీరికి కోర్టు గురించి, అక్కడ జరిగే ప్రొసీడింగ్స్‌ గురించి ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు సరైన న్యాయం పొందే విధంగా కోర్టు ప్రయత్నం చేయాలి. చర్యలు తీసుకోవాలి. కొన్ని చట్టాలు, కొన్ని నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంటుంది. అందులో కొంత వాస్తవం ఉందని అనుకున్నప్పటికీ ఏ చట్టం, ఏ నిబంధన దుర్వినియోగం కావడం లేదన్న ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు. మరీ ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి లోని సె.498 ఎ. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదన్న వాదనను చాలా మంది లేవనెత్తుతుంటారు. అది సరైనది కాదు. ఆ విధంగా ఉండడం అంటే పక్షపాతంతో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రతి కేసుని ఆ కేసులోని విషయాలను బట్టి చూడాల్సి ఉంటుంది. అప్పుడే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేసులను విచారించేటప్పుడు మిగతా కేసుల కంటె ఎక్కువ సున్నితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చే వ్యక్తులకు కోర్టు పద్ధతులు తెలియవు. చట్టమూ తెలియదు. వాళ్ళ హక్కులు బాధ్యతలు తెలియవు. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఎవరూనా కావచ్చు. అందుకని వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. నిబంధనల ప్రకారం బెయిలబుల్‌ నేరాలలో బెయిలు అనేది హక్కు. అది పోలీసులే ఇవ్వాలి. పోలీసులు ఇవ్వనప్పుడు మేజిస్ట్రేట్‌ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి బెయిల్‌ కోరినా కోరకపోయినా బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. అదేవిధంగా అరెస్టు అయిన వారం రోజుల్లోగా అతను జామీను పెట్టుకోనప్పుడు అతన్ని నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలి పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా చార్జిషీటును పోలీసులు 60, 90 రోజుల్లో దాఖలు చేయలేనప్పుడు కూడా వాళ్ళని బెయిలు పైన విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలి. వాళ్ళు కోరినా కోరకపోయినా ఈ బెయిళ్ళను మంజూరు చేయాల్సి ఉంటుంది. కోర్టు పద్ధతులు, నియమాలు, నిబంధనలు చాలా మందికి తెలియవు. కోర్టు పద్ధతులను అందరూ పాటించాలి. అందరూ పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. కోర్టు అనేది పూర్తిగా ఆ కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఉంటుంది. అందుకని అందరూ కోర్టు పద్ధతులను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ కోర్టు న్యాయమూర్తిపై ఉంటుంది. ఇవన్నీ పాటించినప్పుడే ఆ విచారణ, ఆ కోర్టు నిష్పక్షపాతంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. రూల్‌ఆఫ్‌లామంగారిరాజేందర

Tuesday, April 17, 2012

Trafficking

మనుషుల క్రయ విక్రయాలు

వ్యభిచారం, మనుషుల క్రయ విక్రయాలు అన్న విషయాలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవినీతికర పనుల కోసం మహిళలను, చిన్న పిల్లలను అక్రమ రవాణా చేయడం అనేది అనాదిగా ఉంది. ఈ ఆధునిక కాలంలో అది వికృత రూపం దాలుస్తున్నది. అందుకు కారణాలు అనేకం. ఆర్ధిక పరమైన ఒత్తిడులు, సాంఘిక పరమైన ఒత్తిడులు, పేదరికం, నగరీకరణ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వంటి కారణాలు ఎన్నో. వ్యభిచారం అనేది మన సమాజంలో అనాదిగా ఉంది. అనాదిగా ఉన్న వ్యభిచారాన్ని రద్దు చేయలేం. కాని నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల క్రయ విక్రయాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యభిచారాన్ని రద్దు చేయలేం కానీ దాన్ని తగు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని లా కమిషన్‌ తన 64వ నివేదికలో పేర్కొంది. నియంత్రణలో ఉంచాల్సిందని ప్రభుత్వానికి సూచించింది. ‘సీటా’ బిల్లును ప్రవేశపెట్టే ముందు హోమ్‌ మంత్రి లోక్‌సభలో ఈ విధంగా అన్నారు ‘వ్యభిచారాన్ని నియంత్రించలేమని కాదు, కానీ సులభంగా అందుబాటులో ఉంచకుండా ఉంచే ప్రయత్నమే ఈ బిల్లు’. సీటా చట్టం వ్యభిచారాన్ని రద్దు చేయలేదు. అది మానవ అక్రమ రవాణాను రద్దు చేస్తుంది. బహిరంగ స్థలాల్లో వ్యభిచారాన్ని రద్దు చేస్తుంది. నేరంగా గుర్తిస్తుంది.

సీటా చట్టం పరోక్షంగా మగవాళ్ళని సమర్ధించి, వ్యభిచారం చేస్తున్న ఆడవాళ్ళని సంఘ బహిష్కృతులుగా భావిస్తుంది. ఈ చట్టం ద్వంద్వ విలువలను ప్రతిపాదించింది. సీటా చట్టానికి 1986 మార్పులు తీసుకు వచ్చారు. వ్యభిచారం అన్న నిర్వచనం కూడా మారిపోయింది. చట్టం పేరు కూడా మారిపోయింది. అణిచివేత అన్న పదం చట్టం నుంచి తొలగిపోయింది. అది అవినీతి పనులకోసం మనుషుల క్రయ విక్రయాల (నిరోధక) చట్టంగా మారిపోయింది. అది ‘పీటా’ చట్టంగా మారింది. నిర్వచనాన్ని, చట్టాన్ని మార్చినప్పటికీ అది మహిళల క్రయ విక్రయాలను తగ్గించలేకపోయింది. భారతీయ శిక్షా స్మృతికి అనుబంధంగా మారింది తప్ప అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 23 ప్రకారం- శరీర క్రయ విక్రయాలను నిషేధించారు. ఆర్టికల్‌ 39 (ఇ) ప్రకారం మహిళల ఆరోగ్యాన్ని అదే విధంగా పిల్లలని వాళ్ళ ఆర్ధిక అవసరాలకు గాను దోపిడీకి గురి చేయకూడదు. పీటా చట్టమే కాకుండా భారతీయ శిక్షా స్మృతిలో కూడా వ్యభిచారాన్ని మనుష్యుల క్రయ విక్రయాలని అరికట్టడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాలలోని సె. 366 ఎ, 366 బి, 373 ప్రకారం వ్యభిచారం కోసం ఆడపిల్లలను కొనడం, అమ్మడం హీనమైన నేరంగా పరిగణిస్తుంది. వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ మనుష్యుల క్రయవిక్రయాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో మనుషుల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఖండాంతరం వ్యాపించలేదు. ఈ క్రయ విక్రయాలు 90 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి.

ఇవి మన దేశంలో జరుగుతున్న సరియైన చర్యలని ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేక పోతోంది. ఈ క్రయ విక్రయాలు వ్యభిచారం కోసమే కాదు, పనుల కోసం బానిసలుగా ఉపయోగించుకోవడానికి కూడా నిర్వహిస్తున్నారు. నేరస్థులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సయోధ్య వల్ల ఈ క్రయ విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నేరస్థుల మధ్య, ప్రభుత్వ యంత్రాంగం మధ్య లాలూచీ ఎంత ఉందో తెలపడానికి ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఉదంతం చాలు. 2012 ఫిబ్రవరి 10 తేదీన ఇమ్రాబీ కుమార్తెను ఓ గూండా రేప్‌ చేశాడు. భోపాల్‌ నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీటల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాణీ యాదవ్‌ అనే యువతి సహాయంతో 15 సంవత్సరాల బాలికను రాజేశ్‌ హీరోలే తన సైకిల్‌ మోటారు మీద కిడ్నాప్‌ చేసి ఆమె పై రేప్‌ చేశాడు.

ఆమెను అతను అపహరించుకొని పోతున్నప్పుడు దాదాపు 1200 మంది చూశారు. కానీ ఎవరూ దానిని ప్రతిఘటించలేదు. ఆ ప్రాంతంలో రాజేశ్‌ హీరోలేకి తిరుగు లేదు. అతను భూ ఆక్రమణ దారుడు, వడ్డీ వ్యాపారి. అతన్ని ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. అయినా ఇమ్రాబీ బాయి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే 2006 సంవత్సరంలో ఆమె మరో కుమార్తె కనుపించకుండా పోయింది. రాణీ యాదవ్‌ ఆమెని వైష్ణవీ దేవి గుడికి అని తీసుకు వెళ్ళి వ్యభిచార గృహంలో అమ్మేశారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇమ్రాబీ బాయికి తెలిసింది. ఆ కుమార్తె పారిపోయి రావడం వల్ల ఈ సంగతి ఇమ్రాబీ బాయికి తెల్సింది.

రెండవ కుమార్తెకు కూడా అలాంటి పరిస్థితి రావద్దని ఆమె రాజేశ్‌ హీరోలేకి ఎదురు తిరగాలని అనుకొని రాజేశ్‌ హీరోలేపైన ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సె. 376, 342 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఆమె నోరు మూయించడానికి రాజేశ్‌ హీరోలే తన గ్యాంగ్‌తో ఆమె దగ్గరకు వచ్చాడు. అతని గ్యాంగ్‌ లోని మంటూ యాదవ్‌ అనే వ్యక్తి ఆమె కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపాడు. రేప్‌ కేసు నమోదైన తరువాత రాజేశ్‌ హీరోలే ఇమ్రాబీ బాయి దగ్గరకొచ్చి కేసును వదిలించుకోవడానికి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఫలితం లేకపోవడంతో ఆమెను బెదిరించాడు. ఆ తరువాత కాల్చి చంపారు. అతను ఒత్తిడి చేయడం మొదలు పెట్టిన తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులనుంచి సరైన స్పందన రాలేదు. ఆమెను రక్షించడానికి పోలీసులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఆమె హత్యకు గురైంది. షెడ్యూల్డు తెగకు చెందిన ఇమ్రాబీ బాయి హత్య మన 60 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ప్రశ్నిస్తున్నది. మన చట్టాన్ని ప్రశ్నిస్తున్నది. కఠినమైన శిక్షలను ఏర్పరచినంత మాత్రాన చట్టం సమర్ధవంతంగా అమలు జరగదు. చట్టాన్ని అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తేనే ఏ చట్టానికైనా పరమార్ధం.

Followers